- 1918 నాటి స్పానిష్ ఫ్లూ తరహా తీవ్రత
- డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్
- వైరస్ విషయంలో ఏదీ దాచలేదని వెల్లడి
- కరోనా ల్యాబ్లో పుట్టింది కాదని స్పష్టీకరణ
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది కరోనా బారిన పడి.. 1.74 లక్షల మంది మృతిచెందగా.. మున్ముందు ఆ వైరస్ తన విశ్వరూపం చూపించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. 1918 నాటి స్పానిష్ ఫ్లూ మాదిరిగానే ఇది విజృంభిస్తోందని.. తీవ్రతలో ఈ రెండింటికీ సారూప్యత ఉందని ఆయన పేర్కొన్నారు. 1918లో ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మరణాలు సంభవించగా.. ప్రస్తుతం అందుబాటులో టెక్నాలజీ ద్వారా కరోనాను నియంత్రించే అవకాశాలున్నాయన్నారు. ‘‘మన దగ్గర సాంకేతికత ఉంది. అలాంటి విపత్తును నిరోధించగలం. కానీ.. కరోనా మున్ముందు ఇంకా తీవ్రంగా విజృంభించనుంది. రాబోయే విపత్తు, విషాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. కరోనా వైర్సను ఇప్పటికీ చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. కరోనా వైరస్ తీవ్రత విషయంలో తాము ఏదీ దాచలేదని ఘెబ్రేయేసస్ అన్నారు. అమెరికా ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. కరోనాపై ముందు నుంచే తాము హెచ్చరికలు చేశామని సోమవారం వర్చువల్ పద్ధతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందే తప్ప.. ల్యాబ్లో పుట్టింది కాదని స్పష్టం చేశారు.
Courtesy Andhrajyothi