‘రాజధాని ఎక్కడ ఉండాలో’ సిఫారసు చేసేందుకు నియమించిన కమిటీ తొలి భేటీ! అన్నింటికీ మించి… కమిటీ ఎక్కడ చెబితే అక్కడే రాజధాని ఉంటుందంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన!వెరసి… నవ్యాంధ్ర రాజధాని కథ మళ్లీ మొదటికొచ్చినట్లేనా? కొత్త కమిటీ సిఫారసు చేస్తే తప్ప రాజధానిగా ‘అమరావతి’ కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్లేనా!
- ఆరు వారాల్లో నివేదిక ఇస్తుంది.. దేశంలోనే మేటి రాజధాని నిర్మిస్తాం
- 33 వేల ఎకరాలకే బాబు గొప్పలు.. ప్రజలు లక్ష ఎకరాలైనా ఇస్తారు!
- అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ.. పునాదులకు వంద అడుగులు తవ్వాలి
- తండ్రీ కొడుకుల గగ్గోలు ఎందుకు?.. ‘బినామీ’ భూములు పోతాయనేనా?
- మంత్రి బొత్స మండిపాటు.. పవన్కు అవగాహన లేదని వ్యాఖ్య
విశాఖపట్నం: ‘‘అది అమరావతి కావచ్చు! హైమావతి కావొచ్చు… ఇంకేదైనా వతి కావచ్చు! రాష్ట్ర రాజధాని ఏపీ ప్రజలందరి రాజధానిగా, 13 జిల్లాల ప్రజల ఆశలు తీర్చేలా ఉండాలి. దేశంలోనే మేటి రాజధానిని నిర్మిస్తాం’’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎక్కడ అనుకూలమని సిఫారసు చేస్తే అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రమంతా పర్యటించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి… పని ప్రారంభించిన ఆరు వారాల్లో నివేదికను అందిస్తారని ప్రకటించారు. బుధవారం ఆయన విశాఖలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు పక్కనపెట్టారు. నారాయణ కమిటీ వేసి మరీ అమరావతిని ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా భవనం కట్టాలంటే పునాదికి ఐదు నుంచి పది అడుగుల లోతు తవ్వితే సరిపోతుంది. అమరావతిలో మాత్రం వంద అడుగులు తవ్వాలి’’ అని బొత్స పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటుకు 33 వేల ఎకరాలు సమీకరించామంటూ చంద్రబాబు గొప్పగా చెబుతున్నారని… లక్ష ఎకరాలు ఇచ్చేందుకు కూడా ప్రజలు ముందుకువస్తారని వ్యాఖ్యానించారు. భూము లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటే కారణం కాదని, తమ తర్వాతి తరాలకు లబ్ధి చేకూరుతుందనే వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పారు.