– అనాథ బాలల పరిస్థితి దుర్భరం
– అసంఘటిత కార్మికులు జీవనోపాధి తిరిగిపొందే అవకాశాలు తక్కువే: సర్వేలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇప్పటికే యావత్ ప్రపంచం సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా సృష్టించిన ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంక్షోభం కారణంగా బాలకార్మికులు తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశముందని పలు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే తీవ్ర షాక్లో ఉన్న కార్మికుల ఉపాధి కోల్పోవడంతో.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారి పిల్లలు పాఠశాలలకు దూరమయ్యే ప్రమాదం పొంచివుంది. మరీ ముఖ్యంగా అనాథాశ్రమాలల్లో ఉండే పిల్లల పరిస్థితులు దారుణంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాల కార్మిక నిరోధక చట్టం ప్రకారం, 14 ఏండ్లలోపు పిల్లలు అన్ని రకాల పనులు చేయడాన్ని నిషేధించినప్పటికీ.. ఇది వరకే పలు సంస్థలు వెల్లడించిన గణాంకాలను గమనిస్తే.. ప్రపంచవ్యాప్తంగా 152 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. అదే భారత్ విషయానికి వస్తే..
10.1 మిలియన్ల మంది 5-14 ఏండ్లలోపు బాలకార్మికులు ఉన్నారు. (సెన్సస్ నివేదిక-2011). ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం ఈ సంఖ్యను మరింతగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోకపోతే..
సుస్థిరాభివృద్ధిలో భాగంగా పెట్టుకున్న 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యం కలగానే మిగులుతుంది. అలాగే, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం.. నిరుద్యోగాన్ని పెంచటంతోపాటు అసంఘటిత రంగంలో వేతనాలు, సామాజిక భద్రతా, పని గంటలు సైతం పూర్తిగా సర్దుబాటు చేసే అవకాశముంది. దేశ శ్రామిక శక్తిలో 90 శాతం అనధికారిక రంగంలో ఉన్నారు.
సెంటర్ ఫర్ మానీటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వీక్లీ ట్రాకర్ సర్వే ప్రకారం.. కోవిడ్-19 కారణంగా పట్టణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు 30.9 శాతానికి చేరింది. (మార్చి 15న 8.21 శాతంగా ఉంది). దీంతో పాటు పలు సర్వేలు వెల్లడించిన వివరాల గమనిస్తే, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారిలో దాదాపు 400 మిలియన్ల మంది కార్మికులు ఎక్కువ కాలం పాటు తమ జీవనోపాధిని తిరిగి పొందలేరని అంచనాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ అండ తగ్గటం, ఆర్థిక స్తోమత లేకపోవడం, ఉపాధి కరువవడం వంటి కారణాలలో తల్లిదండ్రులకు తమ పిల్లలను బాలకార్మిక వ్యవస్థలోకి మళ్లించడం తప్ప మరో మార్గం లేకుండాపోతుంది. రైతులు, వ్యవసాయ కూలీల పిల్లలు మరింత ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే, పంటకోత, వాటిని మార్కెట్కు తరలించే సమయంలో ప్రభుత్వ ఆంక్షలు విధించబడ్డాయి. ఈ క్రమంలో పిల్లలు వారికి సహాయంగా బాల కార్మిక వ్యవస్థలోకి మళ్లించటం జరుగుతుంది. అలాగే, అనాథ పిల్లలు బలవంతంగా బాలకార్మిక వ్యవస్థలోకి వెళ్లడం, అక్రమ రవాణాలకు గురికావడం, యాచించడం (అడుక్కోవడం), దోపిడీకి గురికావడం వంటివి జరుగుతాయి. ప్రభుత్వాలు వెంటనే ఈ విషయాలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Courtesy: NT