పంచేస్తున్నారు.. పాతేస్తున్నారు
నల్లగొండలో కిలో కోడి ఫారంగేటు ధర రూ.11
సూర్యాపేటలో కిలో చికెన్ రూ.20.. బెంగళూరులో రూ.8
మేళ్లచెర్వులో 3వేల కోళ్లు ఉచిత పంపిణీ.. నేడూ సరఫరా
బెంగళూరులో 16 వేల కోళ్ల సజీవ సమాధి
దాణా ఖర్చు భరించలేక ఫారం యజమాని నిర్ణయం
గుడ్ల ధరలూ పతనం.. కోళ్ల పరిశ్రమకు 8 వేల కోట్ల నష్టం
సామాన్యుడికి అందకుండా కొండెక్కి కూసి.. వారాంతంలోనైతే మరీ పుంజుకునే కోడి ఇప్పుడు ‘వెల’.. వెలబోతోంది! నెలన్నర క్రితం దాకా జోరుగా పెరిగిన చికెన్ ధర ఇప్పుడు.. నిరాధారమైన వదంతులతో 20 రూపాయలకు పడిపోయింది. కొన్నిచోట్లయితే కోళ్లు పైసా విలువ చేయడం లేదు. కరోనా భయంతో ఎవ్వరూ కోళ్లను కొనకపోవడంతో పౌల్ట్రీ యజమానులు ఉచితంగా పంచిపెడుతుంటే.. ఇంకొన్నిచోట్ల కోళ్లను వదిలించుకోలేక గొయ్యి తీసి సజీవంగా పాతిపెడుతున్నారు. మొన్నటిదాకా ‘ముక్క’ను లోట్టలేసుకుంటూ కొరికిన చికెన్ ప్రియులంతా ఇప్పుడు కోడికూర పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. చికెన్ షాపులవైపే చూడటం లేదు. దీంతో తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా చికెన్ ధరలు మునుపెన్నడూ లేనంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. చౌటుప్పల్ కోళ్లఫారాల వద్ద రానున్న నాలుగు రోజుల పాటు లైవ్ బ్రాయిలర్ కోళ్లను కిలో రూ.11 చొప్పున కొనాలని ట్రేడర్స్ నిర్ణయించారు. సూర్యాపేట జిల్లాలో కిలో చికెన్ రూ.20కి అమ్ముతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ఫారం గేట్ వద్ద కిలో రూ.17కు విక్రయించారు. దాణా ఖర్చు తట్టుకోలేక సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలో బుధవారం 3వేల కోళ్లను ఉచితంగా జనాలకు పంపిణీ చేశారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కిలో బ్రాయిలర్ కోడి ఫారం గేటు ధర, ప్రస్తుతం రూ.15 నుంచి రూ.30 మధ్య పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోని బ్రాయిలర్ కోళ్ల రైతులకైతే బుధవారం కిలోకు రూ.10 కూడా గిట్టుబాటు కాలేదని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు చెప్పారు. గుడ్ల రైతులదీ ఇదే పరిస్థితి. రూ.355-రూ.400 వరకు పలికిన వంద కోడిగుడ్ల ధర ఇప్పుడు రూ.290కి దిగొచ్చింది. కరోనా ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ రూ8వేల కోట్లు నష్టపోయిందని సుగుణ ఫుడ్స్ ఎండీ జీబీ సుందరరాజన్ చెప్పారు.
కోళ్లను మేపలేక.. ఖననం
చికెన్ ధరలు అమాంతం పడిపోవడంతో పౌల్ట్రీ యజమానులు చేసేదేమీ లేక వేలాది కోళ్లను సజీవంగానే ఖననం చేస్తున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లా గోకాక్ తాలూకలోని లోస్లూర్లో ఓ యజమాని 6,500 కోళ్లను, కోలార్ జిల్లాలోని బంగారపేటలో 9500 కోళ్లను సజీవ సమాధి చేశారు. కిలో చికెన్ ధర రూ.8కి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి బయట పడేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
భారీ నష్టాలు
రైతులకు కిలో బ్రాయిలర్ కోడి పెంపకానికి రూ.80, ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రూ.4 ఖర్చవుతుంది. ధరల పతనంతో రైతులు కిలో కోడిపై రూ.65-70 నష్టపో తున్నారు. ఒక్కో గుడ్డుపైనా రూపాయి నష్టం వస్తోందని నెక్ జాతీయ వైస్ చైర్మన్ సుబ్బరాజు చెప్పారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల రైతులు రూ.2,000 కోట్లు నష్టపోయి ఉంటారని అంచనా. ప్రజల్లో అవగాహన పెరిగితే తప్ప పౌల్ట్రీ రంగం గట్టెక్కే అవకాశం లేదని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ట్రెజరర్ సోమిరెడ్డి తెలిపారు.
నిరూపిస్తే రూ.కోటి నజరానా
చికెన్, గుడ్ల వినియోగంతో ఎవరికీ కరోనా వైరస్ సోకదు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం. చికెన్, గుడ్ల ద్వారా కరోనా వైరస్ సోకుతుందని ఎవరైనా నిరూపిస్తే వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తాం.
– ఎర్రబెల్లి ప్రదీప్ రావు, అధ్యక్షులు, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్
Courtesy Andhrajyothi