- పార్టీ ద్వితీయ రాష్ట్ర మహాసభల్లో ఎన్నిక
- విశాల వేదిక ఏర్పాటుకు ప్రతినిధుల అంగీకారం
హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నాలుగు రోజులుగా జరిగిన పార్టీ రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. బుధవారం నాలుగోరోజు మహాసభల్లో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, పూర్వవైభవం సాధించాలని నిర్ణయించారు. పార్టీకి పట్టున్న నియోజకవర్గాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలని తీర్మానించారు. ఇతర పార్టీలతో పొత్తు, సయోధ్య కంటే ముందు పార్టీని సొంతకాళ్లపై నిలబెట్టాలన్న నిర్ణయానికి ప్రతినిధులు పూర్తి మద్దతు తెలిపారు. నాలుగోరోజు చర్చించిన అంశాలను పార్టీ నేతలు కూనంనేని, బాలమల్లేశ్, ఆదిరెడ్డి విలేకరులకు వివరించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎ్సలను గద్దెదించేందుకు కలిసివచ్చే శక్తులతో విశాల వేదికను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని మహాసభలు ఆమోదించాయన్నారు.
నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలపై ఉద్యమించాలని తీర్మానించినట్లు తెలిపారు. రైతుఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయిలో లక్ష కోట్లతో, రాష్ట్ర స్థాయిలో రూ.10వేల కోట్లతో ‘ధరల స్థిరీకరణనిధి’ని ఏర్పాటు చేయాలన్న తీర్మానం ఆమోదం పొందిందన్నారు. దిగుబడులకు ధరల నిర్ణయించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను సభ డిమాండ్ చేసిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.
Courtesy Andhrajyothi