తేల్చి చెప్పండి.. ఐసీఎంఆర్కు కేంద్రం ఆదేశం
దానిపైనే ఆధారపడలేం.. నిపుణుల అభిప్రాయం
ఒక వ్యక్తికి కరోనా సోకిందీ లేనిదీ కచ్చితంగా తేల్చి చెప్పే పరీక్ష ఆర్టీ-పీసీఆర్ టెస్ట్. అయితే, ఆ పరీక్ష ద్వారా ఫలితం రావడానికి చాలా సమయం పడుతుండడంతో.. వేగవంతమైన ఫలితాల కోసం ఇటీవలికాలంలో యాంటీజెన్ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నారు. ఆ పరీక్షల కచ్చితత్వం తక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఒక వైపు కేసులు సంఖ్య పెరిగిపోతుండడం.. మరోవైపు యాంటీజెన్ పరీక్షలలో నెగిటివ్ వచ్చిన వారు ఆ తర్వాత పాజిటివ్గా తేలిన ఘటనలు ఎక్కువ కావడంతో ఆ పరీక్షల కచ్చితత్వాన్ని మరొకసారి మదింపు చేసి నివేదిక ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలిని (ఐసీఎంఆర్) కేంద్రం ఆదేశించింది.
నెగెటివ్ వస్తే..
యాంటీజెన్ పరీక్షలకు మనదేశంలో తొలుత అనుమతి ఇవ్వని ఐసీఎంఆర్.. ఆ తర్వాత ఒక షరతుతో పచ్చజెండా ఊపింది. అదేంటంటే.. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ వస్తే వైరస్ సోకినట్లు నిర్ధారణకు రావాలి. అదే నెగెటివ్ వస్తే మాత్రం ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించాలని స్పష్టం చేసింది. కానీ ఈ సూచనను ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు. యాంటీజెన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా వదిలేస్తున్నారు. టెస్టుల మధ్య తేడా తెలియని చాలామంది ప్రజలు.. తమకు నెగెటివ్ వచ్చింది కాబట్టి వైరస్ సోకలేదని భావిస్తున్నారు. అలాంటివారిలో కొందరికి ఆ తర్వాత లక్షణాలు బయటపడడంతో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వస్తోంది. ఈలోపే వారంతా సామాజికవ్యాప్తికి కారణమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో చేసిన యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన మూడు వేల మంది.. ఆ తర్వాత కాలంలో జరిపిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్గా తేలారు. వీరి ద్వారా ఎంత మందికి కోవిడ్ సోకిందో తెలియదు. ముంబై, కోల్కతా నగరాల్లోనూ ఇలాగే జరగడంతో కేంద్రం స్పందించి ఐసీఎంఆర్ను వివరణ కోరింది.
తేడాలేమిటి..
వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేటప్పుడు.. సెన్సిటివిటీ (వైరస్ సోకినప్పుడు దానిని గుర్తించే లక్షణం), స్పెసిఫిసిటీ (సోకని వారిని గుర్తించటం) అనే రెండు లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండింటి ఆధారంగా ఆ పరీక్షల కచ్చితత్వాన్ని అంచనా వేస్తారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో ఈ కచ్చితత్వం రెండింటిలోనూ 99 శాతం ఉంటుంది. యాంటీజెన్ పరీక్షల్లో స్పెసిఫిసిటీ 99 శాతం ఉంటే.. సెన్సిటివిటీ మాత్రం 50 నుంచి 80 శాతం ఉంటుంది. మిగిలిన వారి విషయంలో ఈ పరీక్ష తప్పయ్యే అవకాశముంది. ‘‘యాంటీజెన్ పరీక్ష ఫలితాలు రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటాయి. తగినంత నమూ నా సేకరిస్తున్నారా? సేకరించే వ్యక్తికి నైపుణ్యం ఉందా? అనే విషయాలపై కూడా ఈ పరీక్ష ఆధారపడి ఉంటుంది. పరీక్ష ఎప్పుడు జరిగిందనే విషయం పై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి సోకిన వెంటనే వైరల్ కౌంట్ ఎక్కువ ఉండదు. ఆ సమయంలో పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చే అవకాశముంది. వైరస్ సోకి ఎక్కువ రోజులైతే – కౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కచ్చితత్వం ఎక్కువ ఉంటుంది’’ అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనాథరెడ్డి తెలిపారు.
– స్పెషల్ డెస్క్