– వేధింపులకు పరాకాష్టన్న మానవ హక్కుల సంస్థ
న్యూఢిల్లీ : ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా’కు చెందిన ఢిల్లీ, బెంగళూర్లోని కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ శుక్రవారం దాడులు నిర్వహించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సిఆర్ఎ) నిబంధనలను ఉల్లంఘించిన కారణంతో తాము ఈ దాడులు నిర్వహించామని సిబిఐ పేర్కొంది. ఆయా కార్యాలయాల్లో సాయంత్రం 5 గంటల వరకూ అధికారులు సోదాలు నిర్వహించారు. సిబిఐ సోదాలకు తాము అన్నివిధాలుగా సహకరించామని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్తో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై తాము మాట్లాడుతున్నందు వలనే గత కొన్ని సంవత్సరాలుగా తమపై ఈ వేదింపుల పరంపర సాగుతోందని ఈ సంస్థ పేర్కొంది. అయినా ప్రపంచంతో పాటు భారతీయ చట్టాలకు కూడా తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 2018, అక్టోబర్లో కూడా బెంగళూరులోని ఆమ్నెస్టీ కార్యాలయంపై ఎన్పోర్సుమెంటు డైరెక్టరేట్(ఇడి) దాడులు నిర్వహించింది. లండన్ కేంద్రంగా పనిచేసే ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థను 1961లో ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంస్థ 70 లక్షల మంది సభ్యులతో 150 దేశాల్లో విస్తరించి ఉంది. గత కొన్నేళ్లుగా విదేశీ నిధులకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా ఎఫ్సిఆర్ఎ నిబంధనలను ఉల్లఘించాయన్న కారణంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాదాపు 1800 స్వచ్ఛంద, విద్యా సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
Courtesy Prajasakti..