- కరోనా మృతుల దహన సంస్కారాలకు సమస్యలు
- 900 శ్మశానాల్లో నాలుగైదు చోట్లే నిర్వహణ
- పది గ్యాస్ దహన వాటికల ఏర్పాటుకు చర్యలు
- కుటుంబీకులకు గుదిబండగా అంత్యక్రియల వ్యయం
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణిస్తే ఖర్చంతా జీహెచ్ఎంసీదే
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో చనిపోతే కుటుంబ సభ్యులపైనే భారం
హైదరాబాద్ సిటీ : అది హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి. అక్కడ కరోనాతో చికిత్స పొందుతూ ఓ రోగి మృతిచెందాడు. విషయాన్ని మృతుడి కుటుంబసభ్యులకు ఆస్పత్రి వర్గాలు చేరవేశాయి. నిబంధనల ప్రకారం.. అంత్యక్రియలను జరిపించేందుకు జీహెచ్ఎంసీ అధికారులకు కుటుంబసభ్యులు మధ్యాహ్నం 2గంటలకు ఫోన్ చేశారు. వాళ్లేమో మృతదేహం తీసుకెళ్లేందుకు మరుసటి రోజు ఉదయం వచ్చారు. ఎప్పుడో ఫోన్ చేస్తే.. ఇప్పుడు రావడం ఏమిటి? అని మృతుడి కుటుంబీకులు ప్రశ్నిస్తే.. అంత్యక్రియల కోసం ఎన్నో మృతదేహాలు ఉన్నాయని, అందుకే ఆలస్యమైందని వారు చెప్పారు. ఈ రోజుల్లో కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వెళితే చికిత్స కోసం బెడ్లు దొరకడం లేదన్నది రోగుల్లో చాలామంది వ్యక్తం చేస్తున్న ఆందోళన. కరోనా మృతుల అంత్యక్రియల్లో చోటుచేసుకుంటున్న ఈ ఆలస్యాన్ని బట్టి చూస్తే మున్ముందు అసలు శ్మశానాలు దొరకని దుస్థితి రావొచ్చని అంటున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్గా తేలి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు..
హోం క్వారంటైన్లో ఉంటున్న వారిలో ఎవరైనా మృతి చెందితే నిబంధనల ప్రకారం దహన సంస్కారాలను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఇటీవల పాజిటివ్లతో పాటు కరోనా అనుమానితుల మృతుల సంఖ్యా పెరుగుతోంది. ఈ తరహా మృతులను అధికారికంగా లెక్కల్లో చూపకపోయినా నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో శ్మశానాలకు కొరత ఏర్పడటంతో అంత్యక్రియల నిర్వహణ ప్రక్రియ అధికార యంత్రాంగానికి తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉందని అంటున్నారు. జీహెచ్ఎంసీ పరిఽధిలో 900 వరకూ శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో ఓ నాలుగైదు చోట్ల మినహా ఎక్కడా కరోనా మృతులకు దహన సంస్కారాలు నిర్వహించే పరిస్థితి లేదు. మంగళ్హాట్, కవాడిగూడ, అంబర్పేట తదితర ప్రాంతాలో కరోనా మృతులకు దహన సంస్కారాలు జరపొద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. అందువల్ల ప్రత్యేక శ్మశానవాటికలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి లాక్డౌన్ సమయంలోనే నగరం ఆవల పలు ప్రాంతాల్లో దహన సంస్కారాలకు అనువైన స్థలాలు గుర్తించాలని మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించినా అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఓ ఉన్నతస్థాయి సమావేశంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ కూడా శ్మశాన వాటికల ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న శ్మశాన వాటికల్లో పది గ్యాస్ దహన వాటికలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థలాలనూ అన్వేషిస్తున్నారు. గ్యాస్ ఆధారిత దహన వాటికల ఏర్పాటుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. నగరం బటయ విశాల స్థలంలో కరోనా మృతుల కోసం ప్రత్యేక దహన వాటిక ఏర్పాటు చేసే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
కరోనా మృతులకు అంత్యక్రియలు ఇలా..
కరోనాతో చనిపోతే నిబంధనల ప్రకారం ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. చివరి చూపునకు నలుగురికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు 30-40 మృతదేహాలను అంబర్పేట హరా్సపెంట , 20 వరకు హయత్నగర్ సర్కిల్లోని ఓ శ్మశాన వాటికల్లో, బాలాపూర్ మండలంలోని మల్లాపూర్, అంబర్పేట, కవాడిగూడ, రెయిన్ బజార్ తదితర ప్రాంతాల్లోని ఖబరస్థాన్లో అంత్యక్రియలు జరిగాయి. హిందూ సంప్రదాయ పద్ధతిలోని అంత్యక్రియలను ఎక్కువగా ఈఎ్సఐ శ్మశాన వాటికలో నిర్వహిస్తున్నారు. గాంధీ, చెస్ట్, ఉస్మానియా, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో మరణించిన వారి అంత్యక్రియలకయ్యే ఖర్చును జీహెచ్ఎంసీ భరిస్తోంది. అంబులెన్స్, బాడీ హ్యాంగర్స్, కట్టెలు, దహనం, అనంతరం అస్తికలు భద్రపర్చడం వరకు అంతా ప్యాకేజీగా రూ.23 వేల వరకు చెల్లిస్తున్నారు. ఖననం చేస్తే ఈ ఖర్చు రూ.13 వేల వరకు అవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఇందుకు మృతుడి కుటుంబీకుల నుంచే రూ.25 వేల నుంచి రూ.30 వేల దాకా తీసుకుంటున్నారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు సరిగా లేవనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారని.. వారిలో పేద, మధ్య తరగతి ప్రజలు ఉంటున్నారని.. అక్కడ రోగులు చనిపోతే దహన సంస్కారాల వ్యయాన్ని సర్కారు భరించకపోవడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Courtesy Andhrajyothi