ఇటలీలో ఒక్కరోజే 250 మంది మృతి.. భారత్లో మరొకరు
ఢిల్లీలో 69 ఏళ్ల వృద్ధురాలి మరణం.. ఇటలీ, స్విట్జర్లాండ్ వెళ్లొచ్చిన ఆమె కొడుకు
తల్లీ కొడుకులు ఇద్దరికీ కరోనా పాజిటివ్.. ఇటలీలో 1266కు చేరిన మరణాలు
5000 దాటిన కరోనా మృతుల సంఖ్య.. స్కూళ్లు.. మాల్స్.. హాల్స్.. సకలం బంద్
భారత్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా.. భారత్లో 82కి చేరిన కొవిడ్-19 కేసులు
71 మంది పరిస్థితి వైద్యపరంగా నిలకడగానే.. ఐపీఎల్ ఏప్రిల్ 15 దాకా నిలిపివేత
7 దేశాలకు ఎయిరిండియా విమానాల రద్దు.. వైరస్ కొత్త కేంద్ర స్థానంగా యూరప్
అత్యవసర కేసులే విచారణ.. సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల నిర్ణయం
కొవిడ్-19 డ్రాప్లెట్ వైరస్ అయినప్పటికీ.. దగ్గు, జలుబు తుంపర్లు పడిన చోట ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించి ఉంటే అది మనుగడ సాగించలేకపోవచ్చు.
-యూనివర్సిటీ మెడిసిన్ గ్రీఫ్స్వాల్డ్, రు్హ్ర యూనివర్సిటీ బోచమ్ (జర్మనీ)
మామూలు జలుబు అయితే ముక్కు కారుతుంది. కరోనా ఇన్ఫెక్షన్ వల్ల ముక్కు కారడం అరుదు.
-సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రెవెన్షన్, డబ్ల్యూహెచ్వో, అమెరికన్ కాలేజ్ ఫర్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యూనాలజీ
నీళ్లు ఎక్కువ తాగితే వైరస్ కడుపులోకి జారి చనిపోతుందన్నది అపోహ. కానీ, మ్యూకస్ మెంబ్రేన్ తడిగా ఉండడం కోసం తరచుగా మంచినీళ్లు తాగడం మంచిది.
-డాక్టర్ విలియమ్ షాఫ్నర్, వాండర్బిల్ట్ యూనివర్సిటీ
న్యూఢిల్లీ 3: మన దేశంలో కరోనా మరొకరిని బలి తీసుకుంది. ఢిల్లీకి చెందిన 69 సంవత్సరాల మహిళ శుక్రవారం మరణించారు. ఇప్పటికే మధుమేహం, హైబీపీతో బాధ పడుతున్న ఆమెకు ఇటీవలే కరోనా సోకింది. ఆమె మృతితో భారత్లో ఇప్పటి వరకూ ఇద్దరు మరణించినట్లు అయింది. నిజానికి, ఆమె కుమారుడు ఫిబ్రవరి 5వ తేదీ, 22వ తేదీ మధ్య స్విట్జర్లాండ్, ఇటలీ వెళ్లి వచ్చారు. ఫిబ్రవరి 23న భారత్కు తిరిగి వచ్చారు. అప్పట్లో అతనికి ఎటువంటి లక్షణాలూ లేవు. కానీ, ఒక్క రోజుకే దగ్గు, జ్వరం మొదలయ్యాయి. అతని తల్లికి కూడా అవే లక్షణాలు ఉండడంతో ఇద్దరూ కలిసి మార్చి ఏడో తేదీన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరారు. ఇద్దరికీ పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత, ఒక్కరోజులోనే ఆమె పరిస్థితి విషమించింది. ఐసీయూలో చికిత్స అందించినా ఫలితం లేదని, శుక్రవారం ఆమె మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఢిల్లీలోని జానకీపురానికి చెందిన ఓ వ్యక్తికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఆయన 773 మందిని కలిసినట్లు గుర్తించారు.
82కు చేరిన కరోనా కేసులు
దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 82కి చేరింది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన పని లేదని.. కరోనా వల్ల దేశంలో ఆరోగ్య అత్యవసర స్థితి ఏర్పడలేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కొవిడ్-19 బారిన పడినవారిలో ఏడుగురికి చికిత్సతో నయమైందని త్వరలో వారిని ఇంటికి పంపుతామని ఆయన పేర్కొన్నారు. మొత్తం రోగుల్లో 71 మంది పరిస్థితి వైద్యపరంగా నిలకడగా ఉందని చెప్పారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి ఇప్పటిదాకా 48 మంది విదేశీయులు సహా 1031 మందిని భారత్కు తీసుకువచ్చామని.. వారిలో 890 మంది 14 రోజుల ఐసొలేషన్ పూర్తిచేసుకుని వైరస్ నెగెటివ్గా తేలడంతో ఇంటికి పంపామని తెలిపారు. హైదరాబాద్లో మృతి చెందిన కలబుర్గివాసి సిద్దిఖీకి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినప్పటికీ ఆయన మరణానికి ఇతర ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సిద్దిఖీని నేరుగా తాకిన 46 మందిని గుర్తించి వారిని క్వారంటైన్లో ఉంచినట్టు కర్ణాటక వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇక, కొత్త కేసుల విషయానికి వస్తే.. మూడు రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చి మానేసర్లోని ఆర్మీ క్వారంటైన్లో ఉంటున్న ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి. ఆయనను వెంటనే ఐసొలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. అమెరికా నుంచి ఇటీవలే నాగపూర్కు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి, ఆయన భార్యకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. పుణేలో కూడా ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17కు పెరిగింది. బెంగళూరులోని తమ కార్యాలయంలో ఒక ఉద్యోగికి (26) కరోనా సోకినట్టు గూగుల్ సంస్థ ధ్రువీకరించింది. కొద్దిరోజుల క్రితం గ్రీస్కు వెళ్లొచ్చిన అతడికి వైరస్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. అతడితో సన్నిహితంగా ఉన్న ఇతర ఉద్యోగులను స్వీయ గృహనిర్బంధంలో ఉండాల్సిందిగా కోరినట్టు చెప్పింది. అమెజాన్ సంస్థ కూడా హైదరాబాద్లోని తమ కార్యాలయ ఉద్యోగుల్లో.. ఇళ్ల నుంచే పనిచేసే వీలున్న వారందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా కోరింది. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఇటాలియన్ జంట, థాయ్కు చెందిన మరొకరు కోల్కతాలోని ఒక ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. అటు కేరళలో కరోనా పాజిటివ్గా తేలిన ఒక వ్యక్తికి పొరుగింట్లో ఉండే వృద్ధుడు గురువారం మరణించాడు. ఆయన మృతికి కూడా కరోనానే కారణమని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయన గుండెపోటుతో మరణించినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు చెబుతున్నారు.
చైనాలోని వూహాన్ నుంచి తీసుకొచ్చి ఐటీబీపీ క్వారంటైన్లో ఉంచిన 112 మందికీ వైరస్ నెగెటివ్గా తేలడంతో వారిని త్వరలో విడుదల చేయనున్నారు. ఇరాన్ నుంచి 44 మంది భారతీయులను శుక్రవారం ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. ఇటలీ, ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్లో మరికొందరిని శనివారంనాడు ప్రత్యేక విమానంలో తీసుకురానున్నట్టు పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయిల్, దక్షిణకొరియా, శ్రీలంకకు ఏ ప్రిల్ 30 దాకా విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా.. మార్చి 31 దాకా అన్ని స్కూళ్లు, కాలేజీల మూసివేతకు ఢిల్లీ సర్కారు ఆదేశించింది. ఐపీఎల్ సహా అన్ని క్రీడా పోటీలనూ నిలిపివేసింది. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వృద్ధుడు కరోనాతో మరణించినందున కర్ణాటక సర్కారు.. రాష్ట్రంలోని మాల్స్, సినిమాహాళ్లు, పబ్బులు, నైట్ క్లబ్బులను వారం రోజులపాటు మూసివేయనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. అన్ని రకాల ఎగ్జిబిషన్లు, వేసవి శిక్షణ శిబిరాలను, సదస్సులను, వివాహాది శుభకార్యాలను నిలిపివేయాల్సిందిగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప సూచించారు. వైద్యసిబ్బందిని మాత్రం సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సిందిగా కర్ణాటక సర్కారు ఆదేశించింది. హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, ఛత్తీ్సగఢ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా స్కూళ్లు, సినిమాహాళ్లు, జిమ్లు, ఈతకొలనుల మూసివేతకు ఆదేశాలిచ్చాయి. క్రీడాభిమానులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 సైతం ఏప్రిల్ 15 దాకా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్మీ సైతం ఒక నెల రోజులపాటు అన్నిరకాల నియామక ప్రక్రియలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ విద్యాసంస్థలు బంద్!
ఐఐటీ కాన్పూర్లో మార్చి 29 దాకా అన్ని తరగతులను, పరీక్షలను నిలిపివేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు ప్రకటించాయి. అటు ఐఐటీ ఢిల్లీ కూడా శనివారం అర్ధరాత్రికల్లా హాస్టల్ విద్యార్థులందరినీ ఖాళీ చేయాలని ఆదేశించింది. మార్చి 31 దాకా ఐఐటీ ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు రద్దయ్యాయి. జేఎన్యు, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ 31 దాకా కార్యకలాపాలు నిలిపివేశాయి.
ఆ తొమ్మిది మంది.. కనబడుటలేదు
కరోనా ప్రభావిత దేశాల నుంచి ఇటీవల పంజాబ్లోని లూధియానాకు వచ్చిన ఏడుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఆరా తీయగా వారు ఇచ్చిన చిరునామాలు కూడా తప్పుడువని తేలింది. దీంతో వారిని కనుగొనేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు.. కేరళలోని అలప్పుజ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు నుంచి ఇద్దరు బ్రిటిషర్లు పారిపోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.
Courtesy Andhrajyothi