– లాక్డౌన్ తర్వాత దారుణమైన పరిస్థితులు
– పురుషుల కంటే మహిళల పైనే అధిక ప్రభావం
– గృహనిర్మాణ రంగ కార్మికులకూ తీరని నష్టం
– అసంఘటిత రంగంపై తాజా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్ దేశంలో మహిళల ఉపాధిపై తీవ్రంగా దెబ్బ చూపింది. పురుషులతో పోల్చుకుంటే ఉపాధి కోల్పోయినవారిలో మహిళల సంఖ్యనే అధికంగా ఉన్నది. దీంతో అసంఘటిత రంగం నుంచి వేలాది మంది మహిళలు పనులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ అనంతరం ఉపాధిపై ఏర్పడిన పరిస్థితుల గురించి 20 రాష్ట్రాల్లో మొత్తం 11,537 మంది కార్మికుల (వీరిలో 3221 మందికి పైగా మహిళా కార్మికులు ఉన్నారు) నుంచి అభిప్రాయాలు, సమాచారాన్ని ఓ సర్వే ద్వారా యాక్షన్ ఎయిడ్ అసోసియేషన్ అనే పౌర సంస్థ సేకరించింది. దీనిని మే-జూన్ నెలల మధ్య నిర్వహించారు.
ఈ సర్వే ప్రకారం.. వేలాది మంది మహిళలు(శాంపిల్లో 79.23శాతం మంది) ఉపాధిని కోల్పోయారు. ఇది పురుషుల్లో 51.6శాతంగానే ఉండటం గమనించాల్సిన అంశం. అంతేకాదు, లాక్డౌన్ సమయంలోనూ మహిళా కార్మికులకు వేతనాలు అందలేదు. లాక్డౌన్ అనంతరం గృహనిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 85శాతం మంది కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. ఇకరోజువారీ ఖర్చులను వెళ్లదీయడానికి తాము అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని 68శాతం మంది వివరించారు. లాక్డౌన్కు ముందు 90శాతం మంది మహిళలు తమకు ఉపాధి ఉన్నదని తెలిపారు. ఇది పురుషుల విషయంలో 85శాతంగా ఉన్నది. కానీ, మే మధ్యనాటికి 79శాతం మంది మహిళలు తాము ఉపాధిని కోల్పోయినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఉపాధి కోల్పోయిన పురుషుల సంఖ్య మహిళలతో పోల్చుకుంటే కొంత తక్కువగా, 79శాతంగా నమోదు కావడం గమనార్హం.
లాక్డౌన్ సమయంలో తమకు వేతనం అందలేదని 52శాతం మంది మహిళలు వివరించారు. ఇది పురుషుల్లో 46శాతంగా ఉన్నది. ఇక లాక్డౌన్ అనంతరం కేవలం 16శాతం మంది మహిళలు, పురుష కార్మికులు పాక్షిక వేతనాలకు నోచుకున్నారు. ఇక 32శాతం మంది మహిళలు, 37శాతం మంది పురుషులు మాత్రమే పూర్తి వేతనాలను అందుకోవడం లాక్డౌన్ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
ఇక, గృహ నిర్మాణరంగ కార్మికుల్లో చాలా మందికి ఆధార్కార్డులున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారి పేర్ల నమోదు స్వల్పంగా ఉండటం గమనార్హం. ఈ రంగంలోని కార్మికుల్లో దాదాపు 60శాతం మందికి పైగా ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ, ఉజ్వల్ యోజన కింద 10శాతం మంది, జన్ ధన్ యోజన కింద 19శాతం మంది మాత్రమే లబ్దిదారులుండటం గమనించాల్సిన అంశం. రాష్ట్రాలను ఏ మాత్రం స్పందించకుండా ఫెడరల్స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మోడీ సర్కారు విధించిన లాక్డౌన్ దేశంలోని ఆయా రంగాలపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపి కోలుకోలేని దెబ్బతీసిందని రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే దేశ జీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారడంతో పాటు నిరుద్యోగం విళయతాండవం చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.
Courtesy Nava telangana