– 18ఏండ్ల కనిష్టస్థాయికి వేతనాల పెంపు : సీఎంఐఈ
న్యూఢిల్లీ : ఉద్యోగుల జీతాల పెంపా? పరిస్థితి తెలిసే మాట్లాడు తున్నారా?…ఒక సర్వేలో పలు కంపెనీల యాజమాన్యాల స్పందన ఇది. వచ్చే ఏడాది పరిస్థితి బాగుంటే…పెంపు సంగతి పరిశీలిస్తామని కేవలం 23శాతం కంపెనీలు చెప్పాయి. జూన్ 2019-జూన్ 2020 మధ్యకాలంలో కంపెనీల జీతాల బిల్లులో పెరుగుదల కేవలం 2.9శాతముందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. గత 18ఏండ్లలో కనిష్ట పెరుగుదల ఇది. దేశవ్యాప్తంగా 1560 లిస్టెడ్ కంపెనీలపై ప్రత్యేక అధ్యయనం జరిపిన సీఎంఐఈ ఈ విషయాల్ని వెల్లడించింది. ఒక్క తయారీరంగంలోనే జీతాలు 7శాతం తగ్గాయని, కోవిడ్-19కు ముందునాటి జీతాల పెంపు ఇకపై ఉండదని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్వ్యాస్ చెప్పారు. ప్రయివేటు వ్యయం దారుణంగా పడిపోయిందని, ఇది ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన సమస్యల్లోకి నెట్టిందని ఆయన అన్నారు.
భారీగా తగ్గిన ప్రయివేటు వ్యయం
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గణాంకాల్ని ప్రభావితం చేసే అంశం ప్రయివేటు వ్యయం. ప్రజల ఆదాయాలు బాగుంటేనే వ్యయం బాగా జరుగుతుంది. ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధికి దారితీస్తుంది. ఒక అంచనా ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రయివేటు వ్యయం వాటా 60శాతం.
ఉపాధిరంగం, జీతాల పెంపు మెరుగ్గా ఉంటేనే ప్రయివేటు వ్యయం పెరుగుతుంది. కఠినమైన లాక్డౌన్, కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వేతనాల్లో పెరుగుదల, ప్రయివేటు వ్యయం పెరగేందుకు అవకాశమే లేదని ‘డెలాయిట్ టచ్’ పరిశోధన వెల్లడించింది.