– పౌరసత్వ బిల్లు రాజ్యాంగ విరుద్ధంకాంగ్రెస్తో సహా 11 ప్రతిపక్షపార్టీల నిరసన
– సుమారు 6 గంటలకు పైగా సుధీర్ఘచర్చ
– అనుకూలంగా 311 ఓట్లు.. వ్యతిరేకంగా 80
– మద్దతిచ్చిన వైసీపీ, టీడీపీ.. వ్యతిరేకించిన టీఆర్ఎస్
– లోక్సభలో బిల్లుకు ఆమోదం
– రాజ్యసభలో ఈ బిల్లును గట్టెక్కుతుందా.
న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై సోమవారం లోక్సభలో సుదీర్ఘ చర్చ… ప్రతిపక్షాల నిరసన మధ్యనే ఈ బిల్లును హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శిం చాయి. భారతీయ ముస్లింలకు ఈ బిల్లుతో ప్రమాదమేమీ లేదని హోం మంత్రి అమిత్షా అన్నారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ఓటింగ్లో బిల్లును లోక్సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 80ఓట్లు లభించాయి. అంతకుముందు సోమ వారం ఉదయం బిల్లును ప్రవేశపెట్టడంపై కూడా ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్తోపాటు 11 ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్ మేరకు నిర్వహించిన ఓటింగ్లో బిల్లు ప్రవేశపెట్ట డానికి అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. అనంతరం జరిగిన చర్చలో కేంద్రం ఏకపక్షంగా తీసుకురావాలనుకుంటున్న ఈ పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కుకు వ్యతిరేకంగా బిల్లు ఉందని అన్నారు. కాంగ్రెస్ లోక్సభపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ పౌరసత్వ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరిస్తు న్నదనీ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 5(పౌరసత్వం), 14(సమానత్వపు హక్కు)లను పూర్తిగా హరించేదిగా ఉందని, మోడీ సర్కార్ ముస్లింలే టార్గెట్గా ఈ బిల్లును హడావుడిగా తీసుకొస్తున్నదని విమర్శించారు. మరో కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ ఈ బిల్లు పూర్తిగా మత కోణంతో కూడుకున్నదని అన్నారు. ఎవరైనా ఆశ్రయం కోరి వస్తే అంతర్జాతీయ చట్టాల ప్రకారం మతంతో ప్రమేయం లేకుండా అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. బిల్లును వ్యతిరేకించిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ ముస్లిములపై ఉన్న ద్వేషంతోనే బిజెపి నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(ఆర్ఎస్పీ) ఎంపీ ఎన్కె ప్రేమ్చంద్రన్ మాట్లాడుతూ మతం ఆధారంగా పౌరసత్వ హక్కును కల్పించడం దేశ లౌకిక వ్యవస్థకు విరుద్ధమని అన్నారు. ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు కాపీలను ఒవైసీ చింపేశారు. అమిత్ షా నుంచి ఈ దేశాన్ని కాపాడాలంటూ పరుషపదజాలం ప్రయోగించారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించారు.
కాంగ్రెస్సే మతాల వారీగా విభజించింది : అమిత్షా
పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎదురుదాడి చేశారు. 1947లో కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని మతాలవారీగా విభజించిందన్నారు. స్వాతంత్య్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు సమ్మతి తెలపకుండా ఉంటే ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరమే ఉండేది కాదని అన్నారు. బంగ్లాదేశ్ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పిస్తూ 1971లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం తీసుకున్నారని, అసోం ఒప్పందానికి సంబంధించి మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 1971 సంవత్సరాన్ని కటాఫ్ సంవత్సరంగా తీసుకున్నారని ఈ సందర్భంగా అమిత్షా పేర్కొన్నారు. ఆ సమయంలో వారు పాకిస్థాన్ నుంచి వచ్చే శరణార్ధులను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. బిల్లుపై ఈశాన్య ప్రాంతాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయా రాష్ట్రాలకు బిల్లులో కొన్ని మినహాయింపులు ఉన్నాయని తెలిపారు.
ఈ బిల్లు దేశానికి అవమానకరం : అఖిలేశ్
పౌరసత్వ సవరణ బిల్లు దేశానికి అవమానకరమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్ వంటి దేశంలో ఇలాంటి వివక్షాపూరితమైన బిల్లు సరికాదని ఆయన అన్నారు. లౌకిక స్వభావానికి భిన్నంగా ఉన్న ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.
రాజ్యసభలో బీజేపీ పరిస్థితి ఇది..
రాజ్యసభలో బీజేపీకి బలం 83. వివాదస్పద బిల్లు గట్టెక్కాలంటే 121 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీఏకూటమిలోని పార్టీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు ఆ పార్టీలో చర్చనడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పౌరసత్వబిల్లుకు లోక్సభ ఆమోదం పొందినా…రాజ్యసభలో పాస్ కావటం అంత సులువుకాదని రాజకీయపరిశీలకులు అంటున్నారు.
వ్యతిరేకించిన టీఆర్ఎస్
పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ, టీడీపీ మద్దతు తెలపగా, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. సోమవారం లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో వైసీపీ, టీడీపీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. టీిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎందుకంటే తాము లౌకిక వాదాన్ని నమ్ముతామని అన్నారు. మతం పేరుతో పౌరసత్వం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఈ బిల్లును సవరణ చేయాలని హితవు పలికారు. ముస్లింలకు అందరితో సమాన అవకాశం కల్పిస్తే, తాము బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. వైసీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నామని, కానీ ఇతర దేశాల్లో మైనార్టీలుగా ఉన్న ముస్లింలకు పౌరసత్వం కల్పించాలని కోరారు.
Courtesy Nava telangana