-ఏ, బీ, సీ, డీ, కే, హెచ్ బ్లాకులు నేలమట్టం
– కూల్చివేత పనుల కవరేజీలో జర్నలిస్టులకు తిప్పలు
– నిబంధనలు గాలికొదిలి.. వ్యానులో కుక్కి తీసుకుపోయిన సర్కార్
హైదరాబాద్: సచివాలయ కూల్చివేత పనుల కవరేజీపై ఇప్పటిదాకా ఆంక్షల మీద ఆంక్షలు విధించిన సర్కారు.. హైకోర్టు మొట్టికాయ లేయటంతో ఎట్టకేలకు వార్తా సేకరణకు అనుమతినిస్తున్నట్టు సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. సాయంత్రం తాత్కాలిక సెక్రటేరియట్ బీఆర్కే భవన్ నుంచి మీడియా ప్రతినిధులను తీసుకెళతామంటూ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.కరోనా నిబంధనల్లో అతి ముఖ్యమైన భౌతిక దూరాన్ని విస్మరించి… ఒక వ్యాను, బస్సులో పాత్రికే యులం దర్నీ కుక్కి, కూల్చేసిన సచి వాలయ ప్రాం గణానికి తీసు కుపో యారు. ‘సార్.. ఇలా తీసుకుపోవటం ప్రమా దకరం.. మేం నడుచుకుంటూ వెళతాం…’ అని చెప్పినా వినకుండా జర్నలిస్టులు, ఫొటో, వీడియో గ్రాఫర్లందర్నీ ఒకే వాహనంలోనే ఎక్కించారు. మీడియా కోసం మొత్తం ఆరు వాహనాలను ఏర్పాటుచేయగా ఒక్కో వాహనానికి ఒక్కో ఇన్స్పెక్టర్ను ఇన్ ఛార్జీగా నియమించారు. వారితో పాటు ఐదుగురు పోలీసు సిబ్బందిని బస్సుల్లో ఉంచారు.
సచివా లయం లోపలికి వెళ్లిన తర్వాత బస్సుల్లో నుంచే ఫొటోలు తీసుకోవాలనీ, కిందకు దిగేందుకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఐదు నిమిషాలు అవకాశం ఇవ్వాలని కోరినా అంగీకరించ లేదు. ఉన్నతాధికారుల జోక్యంతో రోప్ పార్టీని అడ్డుగా పెట్టి ఐదు నిమిషాలు అవకాశమిచ్చారు. బస్సు దిగిన స్థలం నుంచి 100 మీటర్లు దాటి వెళ్లనీయలేదు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నేతృత్వంలో ఈ తతంగమంతా జరగటం గమనార్హం. దీంతో పాత్రికేయులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అనంతరం భారీ భద్రత నడుమ జర్నలిస్టులను పాత సచివాలయంలోపలికి తీసుకుపోయారు. లోనికి వెళ్లి చూస్తే సచివాలయ ప్రాంగణమంతా శిధిలాల దిబ్బ లా కనిపించింది. పచ్చటి లాన్లు, వందల ఏండ్ల నాటి భారీ వృక్షాలు, పూల మొక్కలు అదృశ్యమయ్యాయి. పదిహేనేండ్ల క్రితం నిర్మించిన డీ, సౌత్, నార్త్ హెచ్ బ్లాకుల ఆనవాళ్లు కూడా లేవు. ధ్వంసమైన మసీదు కనిపిస్తుంది.. కాబట్టి పక్కనే ఉన్న శిధిలాల గుట్ట సి బ్లాకు అనుకోవాలి. ఏ, బీ,సీ, కే బ్లాకులు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
ఎనిమిది అంతస్తులున్న జే,ఎల్ బ్లాకుల కూల్చివేత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జే బ్లాకు కూల్చివేత 90 శాతం పూర్తయింది. పనుల్లో నిమగమైన కార్మికులకు ఎల్ బ్లాకులో షెల్టర్ ఏర్పాటు చేయడంతో అక్కడ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. కూల్చివేతకు భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. పది అంతస్తుల ఎత్తులో డ్రిల్ చేసి భవనాన్ని ధ్వంసం చేసే యంత్రాలు 10, ప్రొక్లైనర్లు, జేసీబీలు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. భవన శిధిలాల తరలింపు ముమ్మరంగా సాగుతోంది. ఇవి మొత్తం 4,500 లారీ ల లోడు ఉంటాయని అధికారులు అంచనా వేయగా ఇప్పటికే 2 వేల ట్రిప్పుల శిధిలాలను ఎత్తివేశారు.
నిబంధనలకు పాతర…
మీడియా టూర్ సందర్భంగా పోలీసులు కోవిడ్ నిబంధనలను పట్టించుకోలేదు. బస్సుల్లో సీటింగ్కు మించి ఎక్కించారు. శానిటైజర్లు కూడా ఇవ్వలేదు. ఉన్నతాధికారుల అనుమతి కోసం గంట సేపు మీడియా ప్రతినిధులు బస్సుల్లోనే వేచిచూడాల్సి వచ్చింది.
వీడియో జర్నలిస్టుల కోసం రెండు వాహనాలు ఏర్పాటుచేసినా అవి కిక్కిరిసిపోయాయి. ఎవరికి వారు సొంత వాహనాల్లో సచివాలయం గేటు వరకూ వస్తామనీ, అక్కడ తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని మీడియా ప్రతినిధులు కోరినా పోలీసులు అంగీకరించకపోవడం గమనార్హం.
Courtesy: NT