మున్సిపాలిటీల్లో భారీగా కనిపిస్తోన్న వైనం
ఒకే ఇంటి నంబరుపై పదుల సంఖ్యలో ఓటర్లు
ఇది తుర్కయాంజల్ మున్సిపాలిటీ 22వ వార్డులోని కమ్మగూడలోని దివ్యాంగ పిల్లల పాఠశాల. గతంలో ఇక్కడ ఉన్న నర్సింగ్ విద్యార్థినుల పేర్లను ఓటరు జాబితాలో చేర్చారు. అలా ఈ చిరునామాతో 62 ఓట్లు వచ్చి చేరాయి. అక్కడి హాస్టల్లో ఉంటున్నట్లు చూపించారు. ఆ విద్యార్థినులంతా ఏడాది క్రితం అక్కడి నుంచి వెళ్లిపోయినా.. నేటికీ వారి పేరిట ఓట్లు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్; న్యూస్టుడే, పహాడీషరీఫ్, బాలాపూర్, తుర్కయాంజల్ : పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బోగస్ ఓట్లు కలకలం రేపుతున్నాయి. తప్పులు సరిదిద్దకుండానే ఇష్టారాజ్యంగా జాబితాలు ప్రచురిస్తుండటంతో చనిపోయినవారితోపాటు స్థానికంగా లేనివారికీ చోటు దక్కుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడమే కారణం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎన్నికలు జరగనున్న 7 నగరపాలక సంస్థలు, 21 మున్సిపాలిటీలకు సంబంధించి ఈనెల 30న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. మరుసటి రోజు రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలుంటాయి. వార్డుల వారీగా జాబితాలను ఉంచి ప్రజల అభ్యంతరాలు స్వీకరించి వచ్చే నెల 4న తుది జాబితాను ప్రచురిస్తారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల ఓటరు జాబితాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కొత్తగా రూపొందించినవి కాకపోవడంతో బోగస్వి ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు.
అంతా విచిత్రమే
* కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా తెలంగ మర్జాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ మహబూబ్ నబీ కుమారుడు సయ్యద్ మైనుద్దీన్ పేరిట జల్పల్లి ఓటరు జాబితాలో పేరు ఉంది. ఇతను స్థానికంగా ఉండడు. జల్పల్లిలో చనిపోయిన వారి పేర్లు కొన్ని కొనసాగుతున్నాయి. బోగస్ పేర్లతో కొందరు పార్టీల నేతలే వీటిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు 356 ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ః బడంగ్పేట మున్సిపాలిటీ పరిధి బాలాజీనగర్లో ఖాళీ ప్లాట్లపై ఇంటి నంబర్లు తీసుకుని 130 ఓట్లు నమోదయ్యాయి. అయోధ్యనగర్లోనూ 100 బోగస్ ఓట్లు సృష్టించారు. మొత్తంగా బడంగ్పేట మున్సిపాలిటీలో 400 వరకు ఇలాంటివి నమోదయ్యాయి. బాలాపూర్లోని సీపీఎన్ఆర్, గ్రీన్సిటీ కాలనీల్లో ఇళ్లు లేకున్నా ప్లాట్లపై 350 ఓట్ల వరకు నకిలీవి ఉన్నాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. నిజాంపేట మున్సిపాలిటీ రాజధాని ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటరుగా ఉన్న సూరనేని సుమన్ గత అసెంబ్లీ, ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయగా.. తాజా జాబితాలో పేరు గల్లంతయ్యింది.
* 16న ప్రచురించిన జాబితా ప్రకారమే.. : ఈ ఏడాది జనవరి 1 నాటికి ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగా తాజావి రూపొందించారు. అప్పటి ఎన్నికల్లో పెద్దసంఖ్యలో బోగస్ ఓటర్లు ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత సవరించిన దాఖలాలు లేవు. దీనివల్ల మరోసారి నకిలీ చీడ పీడించనుంది. ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన చేస్తున్నారే తప్ప.. తప్పులను సరిదిద్దడం లేదు.
Courtesy Eenadu