– యూపీలో బీజేపీ ఎన్నికల వ్యయం
– ఎన్నికల ప్రచార ఖర్చులో కాంగ్రెస్ టాప్ : ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం బీజేపీ ఎంత వెచ్చించిందో తెలుసా? అక్షరాలా రూ. 763. 31 కోట్లు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో తేటతెల్లమైంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఐదు జాతీయ పార్టీలు ఖర్చు పెట్టిన మొత్తం విలువ రూ.1, 309. 846 కోట్లు కాగా, అందులో సగానికి పైగా ఖర్చు బీజేపీదే. అంటే పది ప్రధాన రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టిన దానిలో 54 శాతానికి పైగా బీజేపీ ఖర్చు చేసింది. ఎన్నికల కమిషన్కు ఐదు జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమర్పించిన వ్యయ ప్రకటనలను నివేదికను ఏడీఆర్ విశ్లేషించింది. ఈ స్టేట్ మెంట్లు సమర్పించిన ఐదు జాతీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐలున్నాయి. ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఎఐఎఫ్బీ), జనతాదళ్ (యునైటెడ్) జేడీయూ, శివసేన, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఎస్పీ, శివసేన, ఆప్లు వంటి ప్రాంతీయ పార్టీలు రూ.96.68 కోట్లు వ్యయం చేశాయి. యూపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ..తామేమీ ఖర్చు చేయలేదని జేడీయూ, ఎఐఎఫ్బి పార్టీలు నివేదిక ఇచ్చాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ప్రధాని మోడీ పోటీ చేసిన వారణాసి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీకి దిగిన అమేథీ నియోజకవర్గం యూపీలో ఉండటం గమనార్హం.
వరదలా పారిన వ్యయం..బిజెపి అత్యధికం
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవలం యుపి ఎన్నికల ప్రచారానికి, ఇతర ఖర్చులకు ప్రధాన పార్టీలన్నీ డబ్బును వరదల్లా పారించాయి. అత్యధికంగా బిజెపి రూ. 763.31 కోట్లు వెచ్చించింది. తదుపరి స్థానంలో కాంగ్రెస్ రూ.489. 97 కోట్లు (34.83), బిఎస్పి రూ.55.39 (3.94 శాతం) ఖర్చు పెట్టాయి. 99 శాతానికి పైగా పార్టీలన్నీ ఈ ఎన్నికల వ్యయాన్ని ఆయా రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలే వెచ్చించాయి. బిఎస్పి, ఎస్పి, ఆప్, ఎన్సిపిల విషయంలో పార్టీలు తమ రాష్ట్ర యూనిట్ల నుండి ఎటువంటి ఖర్చు చేయలేదని ఎడిఆర్ నివేదిక తెలిపింది.
ఎన్నికల ప్రచారం వ్యయంలో కాంగ్రెస్ టాప్
ఎన్నికల కమిషన్కు అందజేసిన నివేదికల్లో ఎన్నికల ప్రచారానికి రూ.813.13 కోట్లు, రవాణా ఖర్చులు రూ.341.68 కోట్లు, ఇతర ఖర్చులు రూ.241.95 కోట్లు, అభ్యర్థులకు మొత్తంగా చెల్లించిన డబ్బులు రూ. 64.08 కోట్లుగా పార్టీలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ అత్యధికంగా రూ.402.91 కోట్లు ఖర్చు పెట్టింది. బిజెపి రూ. 376.62 కోట్లు వ్యయం చేసింది. అయితే 4,529.56 కోట్ల రూపాయలను నిధుల రూపంలో సేకరించినట్లు ఐదు జాతీయ పార్టీలు చేపట్టాయి. ప్రాంతీయ పార్టీల(ఎఐఎఫ్బి మినహా)కు రూ. 153.56 కోట్లు వచ్చాయి.
బీజేపీ నిధుల ప్రవాహం
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బిజెపికి విరాళాలు వెల్లువలా వచ్చాయి. ఆ సమయంలో రూ. 3, 682. 06 కోట్లను (78.62 శాతం) నిధుల ద్వారా బిజెపి ఆర్జించింది. ఆతర్వాతి స్థానంలో కాంగ్రెస్ రూ. 843.92 కోట్లు(18.02శాతం), శివసేన రూ.100.595 కోట్లు(2.15 శాతం) నిధుల రూపంలో వచ్చాయి. 98 శాతానికి పైగా పార్టీలు.. ఆయా పార్టీల ప్రధానకార్యాలయాలే నిధులను సేకరించాయి. అదే సమయంలో ఎస్పి, ఎన్సిపి, బిఎస్పి, జెడియు రాష్ట్ర యూనిట్ల నుండి ఎటువంటి నిధులను సేకరించలేదని ఎడిఆర్ నివేదిక వెల్లడించింది. వ్యయ ప్రకటనలను సకాలంలో అందివ్వని పార్టీలకు జరినామా విధించాలని ఎడిఆర్ సిఫార్సు చేసింది. లోక్సభ ఎన్నికలు పూర్తైన 90 రోజుల్లోగా వ్యయ ప్రకటనలను సంబంధించిన నివేదికలను ఆయా పార్టీలు ఇసిఐకి అందించాల్సి ఉంది. ఈ నివేదికలను సమర్పించడంలో బిజెపి 85 రోజులు, కాంగ్రెస్ 66 రోజులు ఆలస్యంగా సమర్పించడం గమనార్హం.
Courtesy: NT