ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో మిత్రపక్షం శివసేనకు భాజపా భారీ షాక్ ఇచ్చినట్లయింది.
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అక్కడే తాజా భాజపా-ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు ముంబయి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారం అనంతరం మోదీ, అమిత్ షాకు ఫడణవీస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రపతి పాలన ఎత్తివేత
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో గవర్నర్ సిఫారసుల మేరకు ఈ నెల 12న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. తాజాగా అనూహ్యంగా భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకురావడంతో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఈ తెల్లవారుజామున రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు.
మోదీ శుభాకాంక్షలు
సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
(Courtesy Eenadu)