– కరోనాలోనూ కమలం దందా
– గుజరాత్ కంపెనీ ప్రమోటర్లుకు ప్రధాని సహా బీజేపీ పెద్దలతో దోస్తి
– మోడీకి ఖరీదైన సూటు గిఫ్ట్గా ఇచ్చిన గుజరాత్ వ్యాపారికి కాంట్రాక్ట్
న్యూఢిల్లీ : కోవిడ్-19 చికిత్స నిమిత్తమై దేశవ్యాప్తంగా వివిధ హాస్పిటల్స్కు పెద్ద ఎత్తున వెంటిలేటర్లు అవసరమవుతున్నాయి. ఈ పరిణామం కొన్ని ప్రయివేటు తయారీ సంస్థలకు వరంగా మారింది. 58వేలకు పైగా వెంటిలేటర్ల సేకరణ నిమిత్తం మోడీ సర్కార్ రూ.2,332 కోట్లను కొద్దినెలల క్రితం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని బడా నేతలతో ఉన్న పరిచయాల్ని ఉపయోగించుకొని గుజరాత్కు చెందిన కొన్ని కంపెనీలు అక్రమంగా ఆర్డర్లు దక్కించుకున్నారనీ, నాణ్యతలేని వెంటిలేటర్లును పంపుతున్నారని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖలో ‘డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సర్వీసెస్’ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక కమిటీ ఆమోదం లేకుండానే గుజరాత్కు చెందిన ‘జ్యోతీ సీఎన్సీ’ అనే కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించటం, అంతేగాక..కొన్ని కోట్ల రూపాయలు ఆ కంపెనీకి అడ్వాన్స్ కింద చెల్లించటం ఇప్పుడు వివాదాస్పదమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ ద్వారా అడ్వాన్స్ స్వీకరించిన జ్యోతీ సీఎన్సీ కంపెనీ, మరికొన్ని సంస్థలు ప్రభుత్వ హాస్పిటల్స్కు ఇప్పటివరకూ వెంటిలేటర్లను సరఫరా చేయలేదని తెలిసింది.
జ్యోతి సీఎన్సీ కంపెనీ తయారుచేసిన ‘ధామాన్-1’ అనే వెంటిలేటర్ల పనితీరు సరిగా లేదని గుజరాత్లోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి ఫిర్యాదుల అందాయి. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ జె.వి.మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. వెంటిలేటర్ల పనితీరు సరిగాలేదనీ, ఆశించిన ఫలితాలు రావటం లేదని ఆయన ఆ లేఖలో పేరొన్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల వెబ్పోర్టల్ గుజరాత్ వెంటిలేటర్ల తయారీ కంపెనీలపై పరిశోధనాత్మక కథనం వెలువరించింది. జ్యోతీ సీఎన్సీ ప్రమోటర్లకు ప్రధాని మోడీ సహా కేంద్రంలోని బీజేపీ నేతలతో ప్రత్యేక పరిచయాలున్నాయని ఆ కథనం పేర్కొన్నది. ఈ పరిచయాలతోనే సదరు కంపెనీకి వెంటిలేటర్ల తయారీ కాంట్రాక్ట్ దక్కిందని అందులో తెలిపారు. కొంతకాలం క్రితం ప్రధాని మోడీ అత్యంత ఖరీదైన సూట్ వేసుకోవటం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. వెంటిలేటర్ల వ్యాపారంలో ఉన్న గుజరాత్ కంపెనీ ప్రమోటర్ ఒకరు ఈ సూట్ తయారుచేయించి ప్రధాని మోడీకి పంపాడని ఆ వార్తా కథనం తేల్చింది. కేంద్ర ఆరోగ్యశాఖలోని డీజీహెచ్ఎస్ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ 40,350 వెంటిలేటర్ల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ 5 కంపెనీలను ఎంపికచేసింది. అయితే ఇందులో జ్యోతీ సీఎన్సీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన మెడ్టెక్ జోన్ కంపెనీలకు డీజీహెచ్ఎస్ సాంకేతిక కమిటీ ఆమోదం లేదు. అయినప్పటికీ వాటికి అడ్వాన్స్ చెల్లింపు కింద కేంద్రం రూ.22.5కోట్లు అందజేయటం, కాంట్రాక్ట్ అప్పజెప్పటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
Courtesy: NT