– ఆలస్యమై గర్భంలోనే శిశువు మృతి..
– ఛత్తీస్గఢ్లో విషాదం
చర్ల : సరిహద్దు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికెళ్లేందుకు వంట పాత్రలో కూర్చొని వాగు దాటింది. అయితే, ఆ పాత్రలో బిగుతుగా కూర్చోవడం, ఆలస్యం వల్ల గర్భంలోనే శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా భూపాలపట్నంకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో దండకారణ్యం మీనూరు కుగ్రామం ఉంది. అక్కడి నుంచి భూపాల్ పట్టణానికి యలం లక్ష్మీ అనే నిండు గర్భిణి ప్రసవం కోసం భర్త హారిక్తో కలిసి బయలుదేరింది. మార్గమధ్యలో గొర్ల వద్ద ఉన్న చింత వాగు ఉధతంగా పారుతోంది. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త, మరో నలుగురు యువకులు కలిసి ఒక పెద్ద వంట పాత్రలో కూర్చోబెట్టి వాగు దాటించారు. తర్వాత భూపాలపట్నం ప్రాథమిక వైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఆలస్యం కావడం, వంట పాత్రలో బిగుతుగా కూర్చోవడం వల్ల గర్భంలోనే శిశువు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. క్షేత్రస్థాయి వైద్యుల పర్యవేక్షణ లోపం వల్లే తమకు అన్యాయం జరిగిందని బాధితులు బ్లాక్ మెడికల్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. స్పందించిన బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్టేక్.. డాక్టర్ గోపి కిషన్, స్టాఫ్ నర్స్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Courtesy: NT