– బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ పిటిషన్ విచారణ 12కు వాయిదా
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, రాజకీయ నేతల విద్వేష ప్రసంగాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే విచారణను ఢిల్లీ కోర్టు ఈ నెల 12కు వాయిదావేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలనీ, వారిని అరెస్టుచేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి డి.ఎన్. పటేల్, జస్టిస్ సి. హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పౌర హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ ఈ పిటిషన్ను దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ కోర్టు తొలుత విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేయగా.. మందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి ఘటనపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కూడా ఆయన కోర్టుకు విజ్ఞప్తిచేశారు.
రాజకీయ ఎజెండాలో భాగమే..
ఢిల్లీ హింసపై వ్యాఖ్యానించిన టర్కీపై భారత్ ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింసపై వ్యాఖ్యానించిన టర్కీపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మైనార్టీలను లక్ష్యం చేసుకొని జరిగిన దాడిగా పేర్కొంటూ ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణహౌమాన్ని టర్కీ అధ్యక్షుడు ఇటీవల ఖండించారు. సున్నితమైన సమయంలో బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారంటూ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ను భారత్ విమర్శించింది. ‘ఆయన వ్యాఖ్యలు సరికాదు, రాజకీయ ఎజెండాలో భాగమే. ఇటువంటి బాధ్యతా రహితమైన ప్రకట నను ఓ దేశాధినేత నుంచి మేం ఆశించం’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి రవీశ్ కుమార్ అన్నారు. దేశ రాజధానిలో ప్రస్తుతం పరిస్థితి కుదుట పడుతున్నదనీ, శాంతిభద్రతలు అదుపులో వున్నాయనీ, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కుమార్ చెప్పారు.
పోలెండ్ విద్యార్థికి ‘లీవ్ ఇండియా‘ నోటీసులపై స్టే
కోల్కతా : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న పోలెండ్ విద్యార్థికి కేంద్రం జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసులపై కోల్కతా హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య నేతృత్వంలోని ధర్మాసనం ఆ నోటీసుపై మార్చి 18 వరకూ స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. జాదవ్పూర్ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న పోలెండ్ విద్యార్థి కమిల్ సిడ్జిసీజిన్కీకి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) ఫిబ్రవరి 14న ‘లీవ్ ఇండియా’ నోటీసులను జారీచేసింది. స్టూడెంట్ వీసా కలిగిన విదేశీయుడు భారత పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సవాలు చేయలేడని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఫిరోజ్ కోర్టుకు తెలిపారు. ఫీల్డ్ రిపోర్ట్ ఆధారంగానే ఎఫ్ఆర్ఆర్ఓ ఈ నోటీసులు జారీచేసినట్టు చెప్పారు. ఆ నోటీసులను అమలుచేయకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పోలెండ్ విద్యార్థి కోర్టును కోరారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు లీవ్ ఇండియా పిటిషన్పై స్టే విధించింది. ఫిబ్రవరి 24 న నోటీసు అందుకున్న అతను ఈ నెల తొమ్మిదిలోగా దేశం విడిచి వెళ్ళాల్సి ఉన్నది.
53కు చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీ మారణకాండలో చనిపోయిన వారి సంఖ్య 53కు చేరింది. తాజా సమాచారం ప్రకారం.. గురు తేగ్ బహదూర్ (జీటీబీ) ఆస్పత్రిలో 44 మంది, రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రిలో ఐదుగురు, లోక్ నాయక్ ఆస్పత్రిలో ముగ్గురు, జగ్ ప్రవీష్ చంద్ర ఆసుపత్రిలో ఒకరు మరణించారు. ఈ ఘటనలకు సంబంధించి వివిధ పోలీస్టేషన్లలో 654 కేసులు నమోదయ్యాయనీ, 1,820 మందిని అదుపులోకి తీసుకున్నామనీ, ఆయుధ చట్టం కింద 47 కేసులు నమోదయ్యాయని పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి.
అరెస్టు చేసినవారి వివరాలువెల్లడించండి
– బృందాకరత్ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు
ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసా కాండకు సంబంధించి అరెస్టయిన వారి జాబితాను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. వారి వివరాలను బహిర్గతం చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో కోర్టు పై ఆదేశాలు జారీచేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41సి ప్రకారం అరెస్టుచేసిన వ్యక్తుల పేర్లను పోలీసు కంట్రోల్ రూమ్, పోలీస్టేషన్ వెలుపల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలి. దీనిని పాటించేలా పోలీసులను ఆదేశించాలని బృందాకరత్ పిటిషన్ దాఖలుచేశారు. కేసుల వారీగా ఆ జాబితాను అప్డేట్ చేయాలని పిటిషన్లో కోరారు. ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చెలరేగిన మారణహౌమంలో దాదాపు 42 మంది హత్యకు గురికాగా రెండువందల మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ‘మీడియా నివేదికల ప్రకారం.. దాదాపు 1,600 మందిని పోలీసులు అరెస్టుచేశారు. అరెస్టయినవారి జాబితా ఎక్కడా అందుబాటులో లేదు. పోలీసు చర్యలో అస్పష్టత ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నది. అపనమ్మకానికి దారితీస్తున్నది. అలాగే చట్టవిరుద్ధమైనది’ అని బృందాకరత్ పిటిషన్లో పేర్కొన్నారు. హింసను ‘మారణహౌమం’గా పేర్కొంటూ… ఆ దారుణానికి సంబంధించి నమోదుచేసినట్టు పేర్కొన్న అయిదువందల ఎఫ్ఐఆర్లను తమ వెబ్సైట్లలో అప్లోడ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని కూడా ఆమె కోర్టును కోరారు. దాడులకు సంబంధించి అన్ని ఫిర్యాదులపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ / బృందంతో దర్యాప్తు నిర్వహించేలా ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడటం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
Courtesy: NT