యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు నమోదుకాని కరోనా పాజిటివ్ కేసు
కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్న అధికారులు
నల్గొండ: ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించడం, విదేశాల నుంచి వచ్చిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం, జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా కొత్త వ్యక్తి సంచరిస్తే వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ.. వెరసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా లేకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. జిల్లాకు సరిహద్దున ఉన్న నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నా ఇక్కడ కొవిడ్ 19 కేసులు లేకపోవడం విశేషం. అనుమానితులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ నియంత్రణ చర్యలు తీసుకుని ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. 14 రోజుల పాటు ఉంచడంతో పాటు రెండు సార్లు పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తేనే వారిని బయటకు పంపిస్తున్నారు.
సరిహద్దులు బంద్
రాజధాని జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు తరచూ వెళ్లే వారిని గుర్తించి వారు హోం క్వారంటైన్లోనే ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ తొలి రోజు నుంచే జిల్లా సరిహద్దులను మూసివేసి కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.
తొలుత విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 650 మందిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు.
మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చాక అక్కడికి వెళ్లిన వారిలో జిల్లాకు సంబంధించిన వారు 12 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా వీరు అప్పటికే ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్నారు.
* ప్రైమరీ కాంటాక్ట్ల వల్ల కరోనా వస్తుందనే భయంతో మర్కజ్ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులు సుమారు 67 మందిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్లో ఉంచారు.
ప్రజా చైతన్యం వల్లే
అనితా రామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే ప్రజలు స్థానిక యంత్రాంగానికి సమాచారం ఇస్తున్నారు. దీంతో వారిని వెంటనే క్వారంటైన్కు తరలిస్తున్నాం. సరిహద్దు జిల్లాల్లో కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ఆయా గ్రామాల్లోని 370 కుటుంబాలను క్వారంటైన్లో ఉంచాం. అధికారులు, పోలీసులు రేయింబవళ్లు పనిచేస్తుండటం, ప్రజల సహకారంతోనే ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదు. ఇక మీదటా నమోదు కాదనే ఆశిస్తున్నాం.
Courtesy Eenadu