– అయోధ్య వివాదంపై సిపిఐ(ఎం) పొలిట్బ్యూ
‘అయోధ్య వివాదంపై తీర్పు అయితే వెలువ డింది. బాధితులకు న్యాయం మాత్రం జరగలేదు.’ అని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో వ్యాఖ్యానించింది. ఈ నెల 16, 17 తేదీలలో ఇక్కడ సమావేశమైన పార్టీ పొలిట్బ్యూరో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
అయోధ్య వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిపిఐ(ఎం) మొదటి నుండి చెబుతూవస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కుదరనప్పుడు, కోర్టు తీర్పు ద్వారా పరిష్కరించుకోవడమొక్కటే మార్గం. లౌకిక రాజ్యంలో ఇటువంటి వివాదంపై ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇదే. తీర్పు వెలువడింది కానీ, బాధితులకు న్యాయం మాత్రం జరగలేదు. ఈ తీర్పులో కొన్ని భాగాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ తీర్పును వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురుసభ్యులు రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ విలువలను సమర్ధిస్తూనే, ఒక ఆస్తికి సంబంధించిన ఏ వివాదమైనా లౌకికత్వానికి లోబడే వుండాలి… కేవలం విశ్వాసాలు, నమ్మకాలు ఆధారంగా హక్కుదారులను నిర్ణయించలేము…. పరిష్కరించలేము. ఇటువంటి ప్రకటనలు పదే పదే ఉద్ఘాటించిన తీర్పు చివరికొచ్చేసరికి నమ్మకాలు, విశ్వా సాలకే ప్రాధాన్యతనిచ్చింది. ఈ కేసులో పిటిషనర్ల వాదనలకు పరిమితం కావడానికి బదులు హిందూ, ముస్లిం ప్రస్తావనను తీసుకురావడం ద్వారా తీర్పు దారి మళ్లింది. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ‘అత్యంత తీవ్రమైన చట్ట ఉల్లంఘన’ అని ప్రకటించిన ఈ తీర్పు అంతిమంగా ఆ ప్రదేశాన్ని ఈ నేరానికి బాధ్యులైన శక్తులకే అప్పగించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసిన రామమందిర ఉద్యమానికి నేతృత్వం వహించిన విశ్వహిందూ పరిషత్ సంస్థకు చెందిన ఒక నేత 1989లో ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసిన ఆందోళనకు నాయకత్వం వహించిన వ్యక్తే ఈ పిటిషన్ వేశారు. 1949 డిసెంబర్లో చట్ట నిబంధనలకు విరుద్ధంగా మసీదులో విగ్రహాలను ఏర్పాటు చేయటం ద్వారా ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేశారని తీర్పు పేర్కొంది. చివరికి, ఈ వివాదాస్పద స్థలం మొత్తాన్ని చట్టాన్ని ఉల్లంఘించిన వారికే అప్పగించింది. హిందూత్వ శక్తులు చెబుతున్నట్లు ఆ ప్రాంతంలో మసీదును నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసిన దాఖలాలు ఎక్కడా కన్పించలేదని భారత పురావస్తు పరిశోధనా సంస్థ అందించిన ఆధారాలను ఉటంకిస్తూ ఈ తీర్పు స్పష్టం చేసింది. అదే సమయంలో 1528-1857 మధ్య ఈ మసీదు ముస్లింల ఆధీనంలో వున్నట్లు ఆధారాలు లేవని చెప్పింది. మసీదును నిర్మించిన 1528 నాటి నుండి 1856లో అవధ్ సంస్థానాన్ని బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకునేంత వరకూ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కాలంలో ఇది మొగల్ చక్రవర్తులు, తరువాత అవధ్ నవాబ్ల పాలనలో కొనసాగిందనే విషయాన్ని తీర్పు విస్మరించింది. 1857లో అవధ్ నవాబుల పాలన వరకూ ఎటువంటి వివాదమూ లేవు. అటువంట ప్పుడు ముస్లింలకు మసీదుపై ప్రత్యేక యజామాన్య హక్కులు లేవని, ప్రార్థనలు అక్కడ జరగలేదని కానీ ఎలా నిరూపించగలరు. అయితే ఇందుకు విరుద్ధంగా హిందూత్వ వాదులు ఈ ప్రదేశం తమ ఆధీనంలోనే వుందని చెబుతున్న వాదనను సమర్ధించిన తీర్పు ఇందుకు ఎటువంటి ప్రాతిపదికలను నిర్దేశించలేదు. ఇక్కడ కేవలం నమ్మకాలు విశ్వాసాలది మాత్రమే పైచేయి అయింది. లౌకిక వాదంలో అన్ని మతాలను సమానంగా చూడాలన్న రాజ్యాంగ బాధ్యతలను అమలు చేసేందుకు నిర్దేశించిన 1991 నాటి ప్రార్థనా మందిరాల చట్టాన్ని ఈ తీర్పు పరిగణనలోకి తీసుకుంది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఏ ప్రార్థనా మందిరాన్నైనా 1947 ఆగస్టు 15 తరువాత దాని యధాతథ స్థితి నుండి మార్చడానికిి వీలులేదు. అయితే భవిష్యత్తులో కాశీ, మధుర వంటి ఇతర ప్రాంతాలలో ఇటువంటి వివాదాలు తలెత్తకుండా నిషేధం విధించడంలో కోర్టు విఫలమైంది. కాశీ, మధుర ప్రస్తుతం తమ ‘అజెండా’లో లేవంటూ ఆరెస్సెస్ ఛీఫ్ పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ ప్రదేశాలపై వివాదాలు రేకెత్తిస్తారు. భవిష్యత్తులో తలెత్తే ఇటువంటి అవకాశాలను మొగ్గలోనే తుంచే దృఢనిశ్చయం ఈ తీర్పులో ఎక్కడా కన్పించటం లేదు. 1949 డిసెంబర్, 1992 డిసెంబర్ మధ్య కాలంలో జరిగిన వివిధ సంఘటనలను చట్ట వ్యతిరేకమైనవిగా పేర్కొన్నప్పటికీ ఇందుకు పాల్పడిన వారిని ఈ తీర్పు ఉపేక్షించటంతో సంబంధిత వర్గా లకు న్యాయం అందని మానిపండుగానే మిగిలింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి బాధ్యులైన ఎల్కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, కళ్యాణ్సింగ్ తదితరులపై కేసులు 28 ఏళ్లుగా ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. ఈ కేసులను సత్వరమే విచారించి దోషులను శిక్షించాలి… ఈ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు న్యాయం అందించటంలో విఫలమైందన్నది సుస్పష్టం. గత రెండు దశాబ్దాలుగా కొనసాగిన రక్తపాతం, మతోన్మాద దాడుల్లో వేలాది మంది ప్రాణాలను హరించిన దీర్ఘకాలిక వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ఇది.<br ‘times=””
జమ్మూ కాశ్మీర్లో కమ్యూనికేషన్లు, ప్రజారవాణా వ్యవస్థలపై ఆంక్షలు అమలులోకి వచ్చి వందరోజులు దాటిపోయింది. మధ్యలో కొంత సడలించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజల దైనందిన కష్టాలు, అవస్థలలోఎటువంటి మార్పూ లేదు. కిరాతకమైన ప్రజాభద్రతా చట్టం కింద అనేక మంది రాజకీయ నేతలను నిర్బంధించారు. కొంతమందిని గృహనిర్బంధంలో వుంచారు. తామెవరినీ అరెస్ట్ చేయలేదని, ఎవరిపైనా ఎటువంటి ఆరోపణలూ, అభియోగాలూ నమోదు చేయలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవంలో వారు తమ నివాసం నుండి అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. అదే విధంగా వారిని కలిసేందుకు సందర్శకులెవరినీ అనుమతించటం లేదు. దేశంలోని వివిధ జైళ్లలో వందలాది మంది నిర్బంధంలోవున్నారు. వందరోజుల తరువాత కూడా ఎంత మంది నిర్బంధంలో వున్నారు, వారిని ఏ నేరాభియోగాలపై నిర్బంధించారన్న విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత కానరావటం లేదు. ప్రజలు తమ సాధారణ జీవితాన్ని, దైనందిన కార్యకలాపాలను యదేచ్ఛగా కొనసాగించుకునేం దుకు వీలుగా అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది.
ఎక్కువగా పర్యాటక రంగం, పండ్లు, కుంకుమ పువ్వు వంటి వాణిజ్య పంటల విక్రయాలపై ఆధారపడిన రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థను ఈ ఆంక్షలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. వీటికి లభించే ఆర్డర్లు, అందుకు సంబంధించిన చెల్లింపు లన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. ప్రత్యక్ష విక్రయాల జాడ మాత్రం కన్పించటం లేదు. ఏటా రు.10 వేల కోట్లకు పైగా టర్నోవర్ లభించే యాపిల్ పండ్ల వాణిజ్యం పూర్తిగా నాశనమైంది. బిజెపి ప్రభు త్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి, యాపిల్ రైతులను ఆదుకోవాలి. నిర్బంధించిన రాజకీయ నేతలందరినీ బేషరతుగా విడుదల చేయాలని, రాష్ట్రంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజాతంత్ర హక్కులు, పౌరస్వేచ్ఛలను పూర్తిగా పునరుద్ధరించా లని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం కొనసాగు తున్న అనిశ్చితితో స్కూళ్లకు వెళ్లే చిన్నారులు తమ భవిత, ఉపాధి అవకాశాలు, కెరీర్పై అయోమయ పరిస్థితికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను ఇకపై ఎంతమాత్రమూ కొనసాగించరాదు.
గడచిన రెండు త్రైమాసికాలలో జిడిపి వృద్ధి తగ్గుతున్నట్లు అధికారిక గణాంకాలు చూపుతున్నప్ప టికీ భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ప్రవేశించిం దన్న వాస్తవాన్ని గుర్తించటానికి మోడీ సర్కారు నిరాకరిస్తోంది. దీనితో ప్రజలపై అనేక రకాల ఆర్థిక భారాలు పెరిగిపోతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వినిమయం 8.8 శాతానికి పడిపోయినట్లు ఎన్ఎస్ఎస్ఓ తాజా గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు దశాబ్దాల కాలంలో ఇది అత్యధికం కాగా, దీనితో పేదరికం వేగంగా పెరుగోతంది. అయితే ఈ లెక్కల్లో ‘నాణ్యత లేదం’టూ ఈ నివేదికను ఉపసంహరించు కున్న మోడీ సర్కారు ఇందులో గణాంకాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనితో ఈ గణాంకాలకు విశ్వసనీయత కొరవడటమే కాక ప్రపంచ స్థాయిలో భారత్ వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మన ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయం, సేవలు, పారిశ్రామిక రంగాలన్నీ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పారిశ్రామికోత్పత్తి ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. విద్యుత్ డిమాండ్ 12 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జిడిపి వృద్ధి రేటు 5 శాతానికి లోపే వుందని తాజా అంచనాలు చెబుతున్నాయి. దేశంలో నిరుద్యోగిత గత అర్ధశతాబ్ది కాలంలో గరిస్ట స్థాయికి చేరుకుంది. ఐటి రంగంతో సహా అనేక రంగాలు, ఫ్యాక్టరీలలో మూకుమ్మడి ఉద్వాసనలు, తొలగింపులు చోటుచేసు కుంటున్నాయి. దీనికితోడు ప్రభుత్వం ప్రజల ఆస్తులను భారీయెత్తున ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోంది. ఇది భారత దేశ స్వయంసమృద్ధికి గండి కొట్టటమే కాక మోడీ సర్కారు కార్పొరేట్ మిత్రులకు నేరుగా ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇప్పటికే చుక్కలనంటు తున్న నిరుద్యోగితకు ప్రభుత్వం భారీయెత్తున చేపట్టిన ప్రైవేటీ కరణ మరింత ఆజ్యం పోస్తోంది. భారతీయ సమాజంలో బడుగు వర్గాలకు రిజర్వేషన్ల వల్ల చేకూరే కొద్ది ప్రయోజనాన్ని కూడా ప్రభుత్వం వారికి దూరం చేసేం దుకు ప్రయత్నిస్తోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవటం వల్లే ఆర్థిక మాంద్యం ఆవరిస్తోంది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంపొం దించటమే ఇందుకు తగిన సమాధానం. దీనికి దేశీయంగా డిమాండ్ను పెంచితే అది మూతపడిన ఫ్యాక్టరీల పునరుద్ధరణకు దారి తీస్తుంది. కార్పొరేట్ సంస్థలు తమ పెట్టుబడులను పెంచుతాయన్న ఆశతో మోడీ సర్కారు రెండు విడతలుగా రు.2.15 లక్షల కోట్ల ప్రయోజనాలు కల్పించే ప్యాకేజీలను ప్రకటించింది. కొత్త పెట్టుబడుల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంపొందిస్తే తప్ప కేవలం పెట్టుబడులు పెంచినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కదు. కార్పొరేట్ సంస్థలకిచ్చిన రు.2.15 లక్షల కోట్ల రాయితీలను ప్రభుత్వ పెట్టుబడులుగా వినియోగిస్తే దేశంలో మౌలిక వసతుల పెరుగుదలతోపాటు సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వారు సంపాదనా మార్గం పట్టిన తరువాత దేశీయంగా డిమాండ్ దానికదే పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజితమవుతుంది. అయితే ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ప్రజలకు కొంత ఊరటనిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులకు గండి కొట్టింది. దేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం కల్పించే అవకాశాలకోసం మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు దేశ ప్రజల్లో అధికసంఖ్యాకులను మరిన్ని కష్టాలలోకి నెట్టటం ఖాయమని చెప్పక తప్పదు.
మహారాష్ట్ర, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్, యుపి, బీహార్, రాజస్థాన్, కేరళ, అసోం తదితర రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తున్న మతోన్మాద జాతీయ వాద బూటకపు ప్రచార ప్రభావాన్ని మన కళ్లకు కట్టాయి. ఆర్థిక మాంద్యంతో ప్రజలపై పెరుగుతున్న భారాలు వాస్తవ పరిస్థితులను తెరపైకి తెస్తున్నాయి. ప్రజలపై పెరుగుతున్న ఈ ఆర్థిక భారాలకు వ్యతిరేకంగా ఐక్య ప్రజా పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.
జార్ఖండ్ : జార్ఖండ్లో త్వరలోజరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలకు సిపిఎం పోటీ చేస్తుంది. ప్రజల సంక్షేమాన్ని, వారి ప్రయోజనాలను మెరుగుపరిచేందుకు ఈ ఎన్నికల్లో వామపక్షాలన్నీ ఒక అవగాహనకు రావాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోంది.
జాతీయ విద్యావిధానంలో కేంద్రంలోని మోడీ సర్కారు వివిధ అంశాలపై ప్రతిపాదిస్తున్న మార్పు లను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందుకు సహేతుకమైన వివరణను పార్టీ ఇప్పటికే వెలువరిం చింది. కొత్త విధానంలో ప్రతిపాదిత అంశాలు దేశ భవితను అంధకారంలోకి నెట్టటమే కాక, ఇవి విద్యను పిల్లల హక్కుగా కాక వారికి విలాస వస్తువుగా మారు స్తాయి. ఇది దేశ ప్రయోజనాలు, ప్రజల భవితకు పూర్తి వ్యతిరేకం. ఈ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజాతంత్ర శక్తులను సమీకరించింది ఈ విధానాన్ని ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం వత్తిడి తెచ్చేందుకు జాతీయ స్థాయి ప్రచారం, నిరసన ఉద్యమాన్ని చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది.
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్లో వెలువరించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లు, రిట్పిటిషన్లను పరిశీలించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, ఇందులోని వివిధ అంశాలను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తూ వెలువరించిన మెజార్టీ తీర్పు అసలు విషయాన్ని దారి మళ్లించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు గత ఏడాది వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు తమ తీర్పులో ప్రకటించారు. ఇతర మతాలకు చెందిన మహిళల హక్కులకు సంబంధించిన అంశాలపైకి శబరిమల వివాదాన్ని దారి మళ్లించిన ఈ తీర్పు గత ఏడాది వెలువరించిన తీర్పును సమర్ధించటంలో విఫలమవటమే కాక, రివ్యూ పిటిషన్లను పెండింగ్లో పెట్టటం ద్వారా అనిశ్చితిని సృష్టించింది. అన్ని రంగాలలోనూ మహిళల సమానత్వాన్ని సమర్ధిస్తున్న సిపిఎం ఈ విషయంలో స్పష్టమైన తీర్పును సాధ్యమైనంత త్వరలో వెలువరించాలని కోర్టును కోరుతోంది.
బొలీవియాలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన అధ్యక్షుడు ఎవో మొరేల్స్ను గద్దెదించేందుకు ఆయనకు వ్యతిరేకంగా మితవాదశక్తులు పన్నిన కుట్రను సిపిఎం పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. లాటిన్ అమెరికా దేశా ల అంతర్గత వ్యవహారాల్లో అమెరికన్ సామ్రాజ్యవాద శక్తుల మితిమీరిన జోక్యం అక్కడి వామపక్ష ప్రభుత్వాలను గద్దెదించేందుకు మితవాద శక్తులకు ఊత మిస్తోంది. బ్రెజిల్లో ఫాసిస్టు అధ్యక్షుడు బోల్సనారో మాజీ అధ్యక్షులు లూలా, దిల్మా రౌసెఫ్లను అరెస్ట్ చేయటం అక్కడి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిర పరిచిన తరువాత ఫాసిస్టు బోల్సనారో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అటువంటి వ్యక్తినిమోడీ సర్కారు 2020 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాద శక్తులు వెనిజులాలో మదురో సర్కారు ను టార్గెట్ చేసి ఆ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అక్కడి మితవాద శక్తులకు ఆర్థిక అండదండలంది స్తోంది. అయితే ఈ సామ్రాజ్యవాద పోకడలకు అర్జెంటీనా, చిలీ వంటి దేశాలలో పెరుగుతున్న ప్రజా ప్రతి ఘటనను కూడా మనం గమనించవచ్చు. మితవాద, వామపక్ష శక్తుల మధ్య జరుగుతున్న ఈ పోరాటం లాటిన్ అమెరికా రాజకీయాల భవితను నిర్దేశిస్తుందనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టి పారేసిన సుప్రీంకోర్టు, ఈ వివాదంలో అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సిబిఐ తదితర సంస్థలు కొనసాగిస్తున్న దర్యాప్తునకు ఎటువంటి అడ్డూ రాదని వివరించింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ కేసునైనా సిబిఐ దర్యాప్తు చేస్తోందంటే అందుకు ఎటువంటి నమ్మకం కుదరటం లేదు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టి, ప్రస్తుత ప్రభుత్వ మిత్రులైన బడా కార్పొరేట్ అధిపతులకు ప్రయోజనం కలిగించిన ఈ కుంభకోణంపై విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘా(జెపిసి)న్ని ఏర్పాటు చేయాలి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు జెపిసిని ఏర్పాటుచేయాలన్న తన డిమాండ్ను సిపిఎం పునరుద్ఘాటిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పెద్దయెత్తున ప్రైవేటీకరించేందుకు చేస్తున్న యత్నాలకు వ్యతిరేకంగా డిసెంబర్లో దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు నిరసనలు, సదస్సులు, ఉద్యమాలు నిర్వహించాలని పొలిట్ బ్యూరో పార్టీ కమిటీలకు పిలుపునిచ్చింది. కేంద్ర కార్మిక సంఘాలు 2020 జనవరి 8న పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెకు పార్టీ మద్దతుతో నెల రోజుల ఈ ఉద్యమాలు ముగుస్తాయని పొలిట్బ్యూరో వివరించింది.
Courtesy Prajasakthi..