– అమానుషాల్లో మధ్యప్రదేశ్దే అగ్రస్థానం
– చివరిస్థానాల్లో పుదుచ్చేరి, తమిళనాడు
– తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న అఘాయిత్యాలు : ఎన్సీఆర్బీ
న్యూఢిల్లీ : ‘భరతమాత’ తల్లడిల్లుతున్నది. హైదరాబాద్ దిశ ఘటన వివాదాస్పద ఎన్కౌంటర్… ఉన్నావో బాధితురాలి సజీవ దహనం… మహిళలపై పెట్రోల్, కిరోసిన్పోసి చంపేస్తున్న వరుస ఘటనలు ఒకటికాదు.. రెండు కాదు.. పసి మొగ్గలు మొదలు మహిళల వరకూ.. కామాంధుల పైశాచికానికి బలైపోతున్నారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటే కన్నతల్లులు భయంతో వణికిపోతున్న దారుణస్థితి నేడు దేశంలో నెలకొన్నదన్నది నిజం. నిర్భయ ఘటన తర్వాత.. కఠిన చట్టాలు కావాలంటే దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు మిన్నంటాయి. పార్లమెంటులో రోజుల కొద్దీ చర్చ జరిగింది. నిర్భయ చట్టం తెచ్చారు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నారు.. కానీ, ఆ అమానుషం జరిగి ఏడేండ్లయినా తన బిడ్డకు న్యాయం జరగలేదంటూ నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తంచేస్తూనే ఉన్నది. తన కూతురు పేగులు బయటకు లాగి.. చిత్రహింసలకు గురిచేసిన నిందితులు మానవులెలా అవుతారంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లైంగిక దాడులకు సంబంధించిన గణాంకాలను తాజాగా విడుదలచేసింది. 2015-17 మధ్యకాలంలో అఘాయిత్యాల ఘటనలకు సంబందించి తొలి ఐదు స్థానాలను వరుసగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిషాలు నిలిచాయి. కాగా, కాస్తో.. కూస్తో మెరుగైన రాష్ట్రాలుగా పుదుచ్చేరి, తమిళనాడు బీహార్ రాష్ట్రాలు నిలవటం గమనార్హం. అయితే.. లైంగికదాడుల రేట్లో మాత్రం దేశ రాజధాని అగ్రస్థానంలో వున్నది. మొత్తం మహిళా జనాభా, అఘాయిత్యాల సంఖ్యను… ప్రతి వెయ్యిమందికీ లెక్కగట్టి లైంగికదాడి రేట్ను లెక్కగడతారు.
వాస్తవానికి గత రెండేండ్లలో మహిళలపై నేరాలు…ఘోరాలు ఎక్కువయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, తెలుగురాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో మహిళలు అర్థరాత్రి కాదు… పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితులు ఉన్నాయని మహిళా సంఘాలు అంటున్నాయి. ఇండ్లల్లో ఉన్న వారిని సైతం పెట్రోల్ పోసి తగులబెట్టేస్తున్న దారుణాలు వెలుగుచూస్తున్న అమానుషాలు అనేకం. రోజుకో అఘాయిత్యం జరుగుతున్నదని మీడియా కథనాలు వస్తున్నా… పోలీసుల రికార్డులకెక్కనివి భారీసంఖ్యలో ఉంటాయని నేరవిశ్లేషకులు చెబుతున్నారు. 2010 నుంచి అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ ర్యాంకింగ్లో లక్ష జనాభాకు 1.8 లైంగికదాడి ఘటనలు వెలుగుచూశాయి. దాడి ఘటనల్లో మన దేశం 94వ స్థానంలో నిలిచింది. 132.4 రేట్తో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో వుంది.
Courtesy Nava telangana …