జైపూర్ : రాజస్థాన్ సర్కారును కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెర పడింది. అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బలం నిరూపించుకుంది. విశ్వాస పరీక్షలో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో గహ్లోత్ ప్రభుత్వం గట్టెక్కింది. 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో గహ్లోత్ సర్కార్కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్ రాజకీయ సంకక్షోభం తలెత్తింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక జరిపిన రాయబారంతో మెత్తబడిన పైలట్ చివరకు దిగివచ్చారు. దీంతో గహ్లోత్ సర్కారుకు ముప్పు తప్పింది. విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ ప్రకటించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను కూల్చివేసిన బీజేపీ రాజస్థాన్లో మాత్రం బొక్క బోర్లాపడింది. కాషాయ పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.