- గ్రేడింగ్ రద్దు, వేతన బకాయిల విడుదల కోసం విజయవాడలో మార్మోగిన నినాదాలు
అభద్రతను తొలగించండి : గఫూర్ డిమాండ్
‘చలో విజయవాడ’ విజయవంతం
వేలాది మంది ఆశావర్కర్లు విజయవాడ వీధుల్లో కదం తొక్కారు. 8 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను విడుదల చేయాలని. అభద్రతను సృష్టిస్తున్న గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని నినదించారు. ఆశాలు చేపట్టిన ఛలో విజయవాడను భగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధ విధానాలను అమలు చేసినప్పటికీ వేలాది మంది సోమవారం విజయవాడకు చేరుకున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందునుండే ఆశావర్కర్లను జిల్లాల నుండి కదలకుండా చూడటానికి ప్రభుత్వం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నాడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రైళ్లలోనూ, బస్సుల్లోనూ ఎక్కిన వర్కర్లను బలవంతంగా దించేశారు. అయినా, భారీ సంఖ్యలో ఆశాలు విజయవాడకు చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా అలంకార్ సెంటర్ వద్ద నిర్వహించిన సభకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్వి రత్నం అధ్యక్షత వహించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్వి గఫూర్ మాట్లాడుతూ ఆశాల పోరాటానికి మద్దతు ప్రకటించారు. గత టిడిపి ప్రభుత్వం తరహాలోనే వైసిపి కూడా పోలీసులతో ఆందోళనకారులను నిర్బంధిస్తున్నారని అన్నారు. జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకునేందుకు వారి ఇళ్లవద్ద పోలీసులను కాపలా ఉంచడం దారుణమని విమర్శించారు. ఈ తరహా అణచివేత విధాలను మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డ అనతికాలంలోనే పెద్దఎత్తున కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై రోడ్డెక్కడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. గ్రేడింగ్ విధానంతో ఆశావర్కర్లు అభద్రత భావంతో ఉన్నారని, దానిని రద్దు చేసి అభద్రతను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈనెల 30న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశాల వేతనం నెలకు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలు పెంచితే హర్షం వ్యక్తం చేశామని, అదే రోజు గ్రేడింగ్ పాయింట్లతో జాబ్ చార్ట్ విడుదలచేసిన ప్రభుత్వం ఆశాల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. ఈ విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన పాయింట్ల ద్వారా ఆశావర్కర్ల ఉద్యోగానికి ఎసరు పెట్టారన్నార. 75 నుంచి 100 పాయింట్లు వస్తే ‘ ఎ ‘ గ్రేడ్, 74 నుంచి 50 వరకు ‘బి’ గ్రేడ్, 49 కంటే తక్కువ పాయింట్లు వస్తే ‘ సి ‘ గ్రేడ్ ఇస్తామని ప్రభుత్వం తెలిపిందని, ఎ గ్రేడుకు రూ. 10వేలు, బి గ్రేడుకు రూ. 5 వేలు, సి గ్రేడుకు రూ. 3 వేలు వేతనాన్ని ఇచ్చేలా నిర్ణయించారని తెలిపారు. అంతేకాక రోజువారీ చేసే పనులకు పాయింట్లు ఇవ్వలేదని అన్నారు. గ్రేడింగ్ విధానాన్ని తక్షణం రద్దు చేసి, ప్రభుత్వం ప్రకటించినట్లుగా రూ. 10వేలు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు రూ. 400 నుంచి రూ. 4 వేలు వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, వారికి కూడా ఆశావర్కర్ల తరహాలోనే నెలకు రూ. 10వేలు గౌరవవేతనం ఇవ్వాలన్నారు . ఆశావర్కర్లకు పనిగంటలు, సెలవులు నిర్ణయించాలని కోరారు. దూరం చేసే విధంగా ప్రభుత్వ వెబ్సైట్లో ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటున్నారని, దీనవల్ల రషన్ కార్డులు, ఇళ్లస్థలాల వంటి సంక్షేమ పథకాలు వారికి దూరమవుతాయని తెలిపారు. తక్షణం వెబ్సైట్ నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా తొలగించాలని. సంక్షేమ పథకాలు, ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి, రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. 60 యేళ్లు నిండినవారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని, అలాంటి నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి యు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వాగ్ధానాలను నిలబెట్టుకోకుంటే కార్మికులంతా కలసి ఉద్యమిస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు స్వరూపరాణి, ముజఫర్ అహ్మద్, ఆర్వి. నర్సింహరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారంలో పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం : ఎన్హెచ్ఎమ్ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా
ఆశావర్కర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను వారం రోజుల్లోగా విడుదల చేస్తామని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎమ్) డైరెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఆశావర్కర్ల సమస్యపై ప్రజాశక్తి వివరణ కోరగా ఆయన ఈమేరకు స్పందించారు. సిఎఫ్ఎమ్ఎస్ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆశాల పనితీరుకు గ్రేడింగ్ పాయింట్లపై విధివిధానాలు చర్చిస్తున్నామని చెప్పారు.
COURETECY PRAJASHAKTHI