-వైద్య సేవలు అందుబాటులో లేక అవస్థలు
న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా ఏర్పడ్డ అనూహ్య వాతావరణంలో వృద్ధుల సమస్యలు వినేవాళ్లు కరువయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. లాక్డౌన్ వేళ డాక్టర్లను కలుసుకోలేక 70శాతం మంది వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఓ ఎన్జీఓ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా దేశవ్యాప్తంగా 5వేలమంది వృద్ధుల నుంచి ఏజ్వెల్ సంస్థ సమాచారం సేకరించింది..
లాక్డౌన్ కారణంగా వైద్యుల్ని కలుసుకోలేక పోతున్నామని, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని సర్వేలో పాల్గొన్న 70శాతం మంది వృద్ధులు భయంతో ఉన్నారు. ఇప్పటికే తమ ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నదని 55శాతంమంది ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల్లో 43శాతం మంది రెగ్యులర్ చెకప్ లేదన్నారు. వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నదాంట్లో నిజం లేదని వృద్ధులు తెలిపారు.
పెరుగుతున్న ఒత్తిడి…ఆందోళన
కరోనా వైరస్ బారినపడకుండా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక వారిని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నది. రోజులు…వారాలు…నెలలకొద్దీ ఇంట్లో నాలుగ్గోడల మధ్య ఉండటం వారిని మానసికంగా కుంగదీస్తున్నది. నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి…వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కదలకుండా ఒకేచోట ఉండటం, శారీరక శ్రమ లోపించటం ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదని, సామాజికంగా తమ జీవితాలు దెబ్బతిన్నాయని సర్వేలో పాల్గొన్న 54శాతం మంది అభిప్రాయపడ్డారు.
అందరిమధ్య ఉన్నా ఒంటరితనమే!
లాక్డౌన్ కారణంగా చిన్నాపెద్దా అంతా కూడా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితులు కుటుంబసభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచిందా? కుటుంబంలో వృద్ధుల పరిస్థితి మెరుగుపర్చిందా? అని ప్రశ్నిస్తే సర్వేలో భిన్నమైన సమాధానాలు వచ్చాయి. తమ పిల్లలు రోజంతా కంప్యూటర్, సెల్ఫోన్తో గడుపుతున్నారని 23శాతం మంది వృద్ధులు అభిప్రాయపడ్డారు. ఇంట్లో అందరి మధ్య ఉన్పప్పటికీ, మానసికంగా ఒంటరివాళ్లమేనని 59శాతం మంది చెప్పారు.
Courtesy: NT