– 40 మంది చిన్నారులకు అస్వస్థత
– 14 మందికి ఐసీయూలో చికిత్స
ఆదిలాబాద్ అర్బన్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో సీజనల్ వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు రోజు వారీగా అందిస్తున్న యాంటిబయాటిక్ మందు లు వికటించాయి. దాంతో బుధవారం 40 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 14 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు. మందు వికటించిందా? లేక ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందా? అన్నది తేల్చేందుకు మందులను ల్యాబ్కు పంపించారు. రోజువారీగా చిన్నపిల్లలకు వైద్యులు రాసిచ్చిన ప్రకారం వార్డు సిబ్బంది యాంటిబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంది. బుధవారం ఉదయం యాంటిబయాటిక్ మందును సిరంజి ద్వారా ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత 40 మంది చిన్నారులు జ్వరం, చలితో వణకడం, వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని పిలిచి విషయం చెప్పడంతో, వారు అప్రమత్తమై పరిస్థితి తీవ్రంగా ఉన్న 14మందిని ఐసీయూకు తరలించారు. మిగతా వారికి జనరల్ వార్డులోనే వైద్యం అందించారు. ఎలాంటి ప్రాణాపాయమూ లేదని రిమ్స్ వైద్యులు తెలిపారు.
Courtesy: NT