-మధ్యప్రదేశ్లో వరుస దాడులు
– నిన్న పోలీసులు.. నేడు పెత్తందార్లు
– శివపురిలో భూవివాదంపై చెలరేగిన హింస
భోపాల్ : బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దళితులు భయంకర పరిస్థితులను అనుభవిస్తున్నారు. అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవడం, పక్కపార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడం వంటి వాటిపై శివరాజ్సింగ్ సర్కారుకు ఉన్న శ్రద్ధ.. దళితులకు రక్షణ కల్పించడంలో మాత్రం లోపించింది. ఫలితంగా రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఐదురోజుల క్రితం గుణ జిల్లాలో దళితులపై పోలీసులు జరిపిన దమనకాండను మరవక ముందే.. శివపురీలో అలాంటి సీనే రిపీట్ అయింది. భూవివాదానికి సంబంధించిన విషయంలో పెత్తందారులు కొందరు దళితులపై అకారణంగా దాడికి దిగారు. వారిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. నాటు తుపాకులతో వీరంగం సృష్టించారు. ఈ హింసలో ఐదుగురు దళితులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
బాధితులు, పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సిల్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రభుత్వానికి చెందిన 10 ఎకరాల భూమిలో ఐదెకరాల్లో పెత్తందారీ వర్గానికి చెందిన వారు, మిగతా ఐదెకరాల్లో దళితులు సాగు చేసేవారు. అయితే, దళితుల ఐదెకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకొని అందులో సాగు చేయడానికి పెత్తందారీ వ్యక్తులు ప్రయత్నించారు. దీనికి దళితులు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆగ్రహం చెందిన పెత్తందారీ వ్యక్తులు అదే రోజు రాత్రి దళితులపై దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దారు. పరుషపదజాలంతో దూషించారు. కర్రలతో దళితులను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. నాటు తుపాకులు తీసుకొచ్చి గాల్లోకి కాల్పులు జరిపి భీతావాహ వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఘటనలో ఇద్దరి భుజాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడటంతోవారికి కుట్లు పడ్డాయి. అయితే ఈ ఘటనలో ఏడుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామనీ, వారిని త్వరలో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రాజేశ్ ఛండేల్ తెలిపారు.
కాగా, దళితులపై పెత్తందారీ వ్యక్తులు జరిపిన అమానుష దాడిని దళిత, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ.. దళితులకు భద్రత కల్పించడం పైన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామనీ, నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని ఇన్స్పెక్టర్ మనీశ్ కుమార్ శర్మ తెలిపారు.
Courtesy: NT