హేతుబద్ధీకరణ పేరిట కార్యాచరణ
జిల్లాల్లో కేంద్రాల వారీగా లబ్ధిదారుల గణాంకాల సేకరణ
బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ భవిష్యత్తు తరాల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాలు తగ్గనున్నాయి. లబ్ధిదారుల హాజరు, సంఖ్య ఆధారంగా కేంద్రాల్ని హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్నచోట మూసివేయనుంది. ఒకే గ్రామంలో 2,3 కేంద్రాలు ఉండి, పరిమిత సంఖ్యలోనే లబ్ధిదారులు ఉంటే వాటిని విలీనం చేయనుంది. మహిళా శిశు సంక్షేమశాఖ క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలుపెట్టింది. జిల్లా కలెక్టర్లు, శిశు సంక్షేమాధికారుల ఆధ్వర్యంలో నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి హాజరు తక్కువగా ఉండటానికి కారణాలు అన్వేషిస్తారు. అనంతరం హేతుబద్ధీకరణపై నిర్ణయాలు వెలువరిస్తారు. అంగన్వాడీ కేంద్రాలు లేని కొత్త గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తారు. దీంతో కనీసం 15 శాతం కేంద్రాలు తగ్గే అవకాశమున్నట్లు తెలిసింది.
* రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ల కింద 35,700 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటి పరిధిలో రోజూ 23 లక్షలమంది లబ్ధిపొందుతున్నారు.
* రెండేళ్లుగా ఆధార్ అనుసంధానంతో నకిలీ లబ్ధిదారుల ఏరివేత పూర్తయింది. ఇప్పుడు ఆధార్ హాజరు ఆధారంగా లబ్ధిదారులకు అవసరమైన గుడ్లు, పాలు, ఆరోగ్య లక్ష్మి కింద సరకులు అందుతున్నాయి. కొన్నిచోట్ల పేర్లు నమోదు చేసుకుని కేంద్రాలకు రావడం లేదని వెల్లడైంది.
* పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినప్పటికీ మూడేళ్లలోపు చిన్నారుల హాజరు తక్కువగా ఉంటోంది. కొన్ని కేంద్రాల్లో బాలింతలు, గర్బిణుల కనీస సంఖ్య 15 కన్నా తక్కువగా ఉంటోంది. అలాంటివాటిని సమీపంలోని కేంద్రాల్లో విలీనం చేయాలా? లేదా మూసివేయాలా అనే విషయమై సమగ్ర అధ్యయనం తరువాతకలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.
* తక్కువ సంఖ్య కలిగిన కేంద్రాలను విలీనం చేస్తే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, వర్కర్లపై ప్రభావం పడనుంది. విలీనమైన కేంద్రాల సిబ్బంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. వీరిని ఇతర కేంద్రాల్లో సర్దుబాటు చేయాలా? సేవలు ఎలా వినియోగించుకోవాలన్న విషయమై చర్చ జరుగుతోంది.
(Courtesy Eenadu)