– మూతపడుతున్న పరిశ్రమలు
– ఉపాధిలోనూ కోతలు
– అనంతపురం ప్రతినిధిల
ఆర్థిక మాంద్యం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు వ్యవసాయ సంక్షోభాన్ని చవిచూసిన అనంతపురం జిల్లా, ఇప్పుడు ఆర్థిక మాంద్యాన్ని కూడా చవిచూడాల్సి వస్తోంది. అంతోఇంతో ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలు ఈ మాంద్యంతో కుదేలవుతున్నాయి. కొన్ని మూతపడుతుండగా, కొన్ని సిబ్బందిని, పనిదినాలను తగ్గించుకునే పనిలోపడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి బజారున పడుతున్నారు. అనంతపురం జిల్లాలో 5,845 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు, 56 పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో లక్ష మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. చిన్న, సూక్ష్మ తరహాలో అత్యధికం ఆగ్రో బేస్డు పరిశ్రమలున్నాయి. ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో అత్యధికం గ్రానైట్ ఉన్నాయి. భారీ పరిశ్రమల్లో సిమెంటు, ఉక్కు పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి. వీటిల్లో అత్యధికం హిందూపురం, తాడిపత్రి ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. హిందూపురం పట్టణ శివారుల్లోని తూముకుంట పారిశ్రామికవాడలోనే సుమారు 400 వరకు పరిశ్రమలున్నాయి. వీటి అనుబంధ పరిశ్రమలన్నింటిలోనూ కలిపి 18 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. తాడిపత్రి ప్రాంతంలో రెండు వేల వరకు గ్రానైట్, నాపరాయి పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడే పెన్నా, అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమలతోపాటు, అర్జారు స్టీల్ పరిశ్రమ ఉంది.
సంక్షోభం దిశగా పారిశ్రామిక రంగం
ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఇప్పటికే సిమెంటు, స్టీల్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను సగానికి తగ్గించుకున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కార్మికులకు నెలలో నాలుగైదు రోజులు సెలవులు ప్రకటించేస్తున్నాయి. క్యాజువల్ కార్మికులను పనిలోకి తీసుకోవడం లేదు. ఈ పరిశ్రమలకు అనుబంధంగా ఉన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఎపిఐఐసి పరిధిలో 962 పరిశ్రమలుంటే 29 పరిశ్రమలు మూతపడ్డాయి. వీటి పరిధిలోలేని చిన్న పరిశ్రమలు లెక్కల్లో లేవు. అనధికారిక అంచనా ప్రకారం మూడవ వంతు కార్మికులు ఉపాధి కోల్పోయారు. అంటే జిల్లాలో లక్ష మంది కార్మికులు ఈ పరిశ్రమల్లో పనిచేస్తుంటే 30 వేల మంది దాక పని లేదు.
హిందూపురం తూముకుంట పరిధిలో 1995లో విప్రో సంస్థను ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ సిలిండర్ల తయారు చేసి దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తుంది. దీనికి అనుబంధంగా సుమారు 18 చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఎగుమతులు తగ్గిపోవడంతో ఆ సంస్థ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటించేసింది. ఇందులో 180 మంది వరకు రెగ్యులర్ ఉద్యోగులుండగా, 520 దాక క్యాజువల్ ఉద్యోగులు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉంటోంది. క్యాజువల్ వారికి మాత్రం పనిలేని రోజుల్లో కోత పెడుతున్నారు. దీని అనుబంధ పరిశ్రమల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అందులో పనిచేస్తున్న వారికి నెలలో 15 రోజులు మాత్రమే పని ఉంటోంది. తక్కిన రోజులు కార్మికులకు సెలవులిచ్చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఉన్న ప్రీకాట్ మిల్లులో మూడో వంతు క్యాజువల్ ఉద్యోగులకు పని లేకుండాపోయింది. 1200 మంది పనిచేసే ఈ సంస్థలో సుమారు 300 మందిని పనికీ తీసుకోవడం లేదు. సూపర్ స్పిన్నింగు మిల్లు అనే మరో సంస్థ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తాడిపత్రి ప్రాంతంలో సుమారు 200 గ్రానైట్, నాపరాయి పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక్కడున్న పెన్నా, అల్ట్రాటెక్లో ఉత్పత్తిని తగ్గించుకున్నట్టు సమాచారం. ఆర్జారు స్టీల్స్ మరమ్మతుల పేరుతో నాలుగైదు రోజులు ఉద్యోగులకు సెలవులు ప్రకటించేస్తోంది. ఇలా జిల్లాలో అనేక పరిశ్రమలు ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిల్లాడుతున్నాయి.
ఉపాధి కోల్పోతున్నారు
ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. పరిశ్రమలపై పడుతున్న ఈ ప్రభావం కార్మికులపై మరింత ఘోరంగా ఉంది. ఉన్న ఫలంగా కార్మికులు ఉపాధి కోల్పోయి బజారునపడాల్సి వస్తోంది. ఇప్పటికే చాలా మంది కార్మికులు పని లేక కుటుంబం గడువక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా ఆర్థికాభివృద్దికి చర్యలు చేపట్టాలి. లేకపోతే కార్మికులు ఉపాధిని కోల్పోయి వారి జీవితాలు దుర్బరంగా తయారయ్యే సూచనలున్నాయి.
– చౌళూరు రవికుమార్, తూముకుంట పారిశ్రామికవాడ కార్మిక సంఘం అధ్యక్షులు
పనిలేక మూసేశా..
విప్రో ఏర్పాటైనప్పుడు నేను కూడా 1995లో ఇక్కడ ఆ సంస్థకు అవసరమైన పరికరాలు తయారు చేసే అనుబంధ పరిశ్రమను ఏర్పాటు చేశాను. 40 మంది కార్మికులు రెండు షిప్టుల్లో నిరంతరాయంగా పనిచేసేవారు. ఇప్పుడు పనిలేకుండా పోయింది. విప్రో నుంచి ఆర్డర్లు రావడం లేదు. కార్మికులకు వేతనాలిచ్చి పరిశ్రమ నడిపే శక్తి లేదు. నడపడం చేతకాక పని నిలిపివేశాను. ఇప్పుడు ఈ షెడ్డను ఇతరులకు బాడుగకివ్వాలని నిర్ణయించుకున్నాను. 25 ఏళ్లుగా ఇదే పనిచేసుకుని బతుకుతూ వచ్చాను. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇదే తరహాలో తక్కిన వారు కూడా ఆలోచిస్తున్నారు.
– లక్ష్మిరెడ్డి, మంజునాథ్ ఇండ్రస్టీస్ అధిపతి
రోజురోజుకు మాంద్యం ప్రభావం తీవ్రమవుతోంది
ఆర్థిక మాంద్యం ప్రభావం రోజురోజుకు తీవ్రమ వుతోంది. ఇది ఆటోమోబైల్ రంగంతో ప్రారంభమై అన్నింటికీ విస్తరిస్తోంది. తూముకుంట పారిశ్రామిక వాడలోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని పరిశ్రమలు సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. మరికొన్ని షిప్టులను తగ్గించుకుని నెలలో 15 రోజులు పని కల్పించి 20 రోజుల వేతనం ఇస్తున్నాం. ఏదొక దగ్గర కోలుకుంటుందని ఆశిస్తున్నాం. అది సాధ్యమవుతుందా? మరింతగా సంక్షోభంలోకి పోతుందా? అన్నది చెప్పలేని పరిస్థితులున్నాయి. మరింత సంక్షోభంలోకిపోతే పరిస్థితులు దారుణంగా తయారయ్యే సూచనలున్నాయి.
– ఎంవిఎస్ మూర్తి, తూముకుంట ఇండిస్టియల్ ఓనర్సు అసోసియేషన్ అధ్యక్షులు
Courtesy Prajasakti