ముంబయి: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా కోరేగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ప్రకాశ్ అంబేద్కర్, పౌరహక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోయారు. తెల్తుంబ్డే తన భార్య రమా తుంబ్డే, ఆయన బంధువు దళిత నేత ప్రకాశ్ అంబేద్కర్తో కలిసి దక్షిణ ముంబయిలోని కుంబల హిల్ వద్ద ఉన్న ఎన్ఐఎ కార్యాలయానికి వెళ్లారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ తెల్తుంబ్డే, నవలఖతో పాటు పలువురు పౌర కార్యకర్తల పై ఉపా చట్టం కింద పోలీసులు కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తెల్తుంబ్డే, గౌతమ్ నవల ఖాకు బోంబే హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించి, వారి ముందస్తు అరెస్టు బెయిల్ అభ్యర్థనలపై విచారణ జరిపింది. హైకోర్టు వీటిని తిరస్కరించిన అనంతరం వారిరువురూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్చి 17న సుప్రీం కూడా వారి అభ్యర్థనలను తిరస్కరించి మూడు వారాలలోగా లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోవడానికి ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు మరో వారం గడువు పొడిగించింది. పూనేలో డిసెంబరు 31, 2017న నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే మరుసటి రోజు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు ఆరోపించారు.
Courtesy: NT