– 14,925 శాతం పెరిగిన అమిత్షా కుమారుడి కంపెనీ ఆదాయం
– కార్పొరేట్ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన
– గత ఐదేండ్ల మోడీ మాయాజాలం
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా కుమారుడు జరుషాకు చెందిన కంపెనీ ఆస్తులు గత ఐదేండ్లలో అనూహ్యంగా పెరిగినట్టు ‘ద కారవాన్’ వెబ్సైట్ వెల్లడించింది. జరుషా డిజైనేటెడ్ పార్ట్నర్(కంపెనీ డైరెక్టర్తో సమాన హోదా)గా ఉన్న కుసుమ్ ఫిన్సర్వ్ ఎల్ఎల్పీ ఆదాయం 2014లో రూ.79 లక్షల 60 వేలు కాగా, 2019లో రూ.119 కోట్ల 61
లక్షలకు పెరిగింది. అంటే.. ఈ ఐదేండ్లలో 14,925 శాతం పెరిగిందని అర్థం. ఏటేటా కంపెనీ ఆర్జించిన ఆదాయం
2015లో రూ.3 కోట్ల 23 లక్షలు, 2016లో రూ.24 కోట్ల 16 లక్షలు, 2017లో రూ.143 కోట్ల 43 లక్షలు, 2018లో రూ.111 కోట్ల 87 లక్షలు, 2019లో రూ.119 కోట్ల 61 లక్షలు…ఈ లెక్కలన్నీ జరుషాకు చెందిన కంపెనీ అధికారికంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించినవేనని కారవాన్ తెలిపింది. కుసుమ్ఫిన్సర్వ్ నికర విలువ 2015లో రూ.కోటీ 21 లక్షలు కాగా, 2019లో రూ.25 కోట్ల 83 లక్షలకు పెరిగింది. నికర విలువ అంటే మొత్తం ఆస్తుల నుంచి అప్పుల్ని తీసివేయగా మిగిలేదని అర్థం. ఇక ఈ కంపెనీ నికర స్థిరాస్తుల విలువ 2015లో రూ.51 లక్షల 74 వేలు కాగా, 2019లో రూ.23 కోట్ల 25 లక్షలకు పెరిగింది. కంపెనీ నికర స్థిరాస్తులంటే భూమి, భవనాలు, పరికరాలని అర్థం. వీటిని వెంటనే నగదుగా మార్చుకోవడం వీలుపడదు.
Courtesy Navatelangana…