గువాహటి: అసోంలో కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) నాయకుడు అఖిల్ గొగొయ్ కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ‘మావోయిస్టు’ పేరుతో డిసెంబర్ నుంచి ఆయన జైలులో ఉన్నారు. మూడు నెలల పాటు ఆయన జైలు ఉన్నా చార్జిషీటు దాఖలు చేయడంలో ఎన్ఐఏ విఫలమైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినందుకు ఆయనను అరెస్ట్ చేసి గువాహటి సెంట్రల్ జైలులో పెట్టారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు నుంచి ఆయన విడుదల కాలేదు. సీఏఏ నిరసనలకు సంబంధించి జనవరిలో పంబాబజార్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు కావడంతో ఆయన జైలులోనే ఉన్నారు.
ఏ సమయంలోనైనా అఖిల్ గొగొయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని కేఎంఎస్ఎస్ సభ్యుడు ముకుత్ దేకా తెలిపారు. ఎగువ అసోంలో పలు పోలీస్ స్టేషన్లలో గొగొయ్ కు వ్యతిరేకంగా ‘షోన్ అరెస్ట్’ పిటిషన్లు దాఖలయినట్టు ఆయన వెల్లడించారు. గువాహటి నుంచి శివసాగర్ ప్రాంతానికి కూడా గొగియ్ ను తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. జోర్ హట్ తో గువాహటి కేసులోనూ గొగొయ్ కు కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాది శంతను బొర్తాకుర్ తెలిపారు. మరో 90 రోజులు గొగొయ్ ను జైలులోనే ఉంచాలన్న ఎన్ఐఏ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చిందని వెల్లడించారు. కాగా, ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని గువాహటి హైకోర్టులో ఎన్ఐఏ సవాల్ చేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఇంకా ఎటువంటి స్టే ఇవ్వలేదు.
సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణతో గత డిసెంబర్ లో గొగొయ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. గొగొయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా అసోంతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘చార్జిషీటు దాఖలు చేయకుండా ఓ వ్యక్తిని ఎక్కువ రోజులు జైలులో నిర్బంధించడం కుదరదు. దీన్ని బట్టి అఖిల్ గొగొయ్ కు వ్యతిరేకంగా సరైన సాక్షాయలను ఎన్ఐఏ సంపాదించలేకపోయిందని అర్థమవుతోంది’ అని ముకుత్ దేకా అన్నారు.