– సుదీర్ఘకాలం లాక్డౌన్ ప్రభావం : సీఎంఐఈ
న్యూఢిల్లీ : ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నవేళ… కోట్లాదిమందికి వ్యవసాయ పనులు ఆధారమయ్యాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) తాజా నివేదిక తేల్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, ఖరీఫ్ పనులు గ్రామీణ భారతంలో ఉపాధి మెరుగుపడటానికి దారితీసిందని నివేదిక అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా, హఠాత్తుగా విధించిన లాక్డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి…ఉపాధిరంగాన్ని కోలుకోని విధంగా దెబ్బతీశాయనీ, కార్మికరంగం ఇప్పట్లో కోలుకునేట్టు కనపడటం లేదని నివేదికలో నిపుణులు వ్యాఖ్యానించారు.
జులై మొదటి రెండు వారాల గణాంకాల్ని పరిశీలించాక, నిరుద్యోగితరేటు మరింత పెరుగుతున్నదనీ, రికవరీ కనపడటం లేదని నివేదిక వ్యాఖ్యానించింది. వరుసగా మూడోవారం (జులై 12నాటికి) ఉపాధిరంగంలో కార్మికుల ప్రాతినిథ్యం రేటు పడిపోయింది. 42శాతం నుంచి 40.4శాతానికి తగ్గింది. ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందా? లేదా? అని నిర్ణయించుకోవటంలో కార్మికుల ప్రాతినిథ్యరేటు కీలకమైన అంశం. ఇది క్రమం తప్పకుండా పడిపోవటం ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి సూచికగా నిలుస్తున్నది.
ఆశలన్నీ వ్యవసాయంపైనే
జులై 12నాటికి దేశవ్యాప్తంగా ఉపాధిరంగం స్వల్పంగా మెరుగుపడింది. ఉపాధిరేటు 36.9 నుంచి 37.4శాతానికి పెరిగింది. నిరుద్యోగ రేటులో (7.4శాతం) స్వల్ప తగ్గుదల ఉపాధిరేటు మెరుగుపడటానికి దారితీసిందని నివేదిక అభిప్రాయపడింది. అత్యంత ఆందోళనకలిగించే అంశం, పట్టణ భారతంలో కార్మికుల ప్రాతినిథ్యరేటు పడిపోతున్నది. జులై 12నాటికి 37శాతంగా నమోదైంది. పట్టణాల్లో నిరుద్యోగరేటు 9.9శాతంగా ఉంది.
పట్టణాలతో పోల్చుకుంటే గ్రామా ల్లో ఉపాధిరేటు మెరుగ్గా ఉంది. నిరుద్యోగరేటు కూడా 7.8శాతం నుంచి 6.3శాతానికి తగ్గింది. ఉపాధిరేటు 38.7నుంచి 39.4శాతానికి పెరిగింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అమలు ఉపాధిరంగంలో రికవరీకి దారితీసిందని నివేదిక తెలిపింది. అలాగే ఖరీఫ్ పనులు మరికొన్నాండ్లు కొన్నాండ్లు కొనసాగుతాయని, ఏదేమైనా ఈ సంక్షోభం నుంచి దేశం కోలుకోవడానికి చాలా పరిమితమైన అవకాశాలే ఉన్నాయని సీఏంఐఈ నివేదిక అంచనావేసింది.
Courtesy: NT