- కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు.. అధిక బిల్లులే కారణం
- కొత్త రోగుల్ని చేర్చుకోవద్దు.. ఉన్న వారిని ఇబ్బంది పెట్టవద్దు
- నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం
- ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు హెచ్చరిక
హైదరాబాద్ : కరోనా చికిత్సకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో డెక్కన్ ఆస్పత్రిపై వేటు పడింది. ఆ ఆస్పత్రికి కరోనా చికిత్స చేసేందుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేస్తూ ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేయడమే అనుమతుల రద్దుకు కారణమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీవో నంబరు 248, 281 ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం కొవిడ్ చికిత్స ధరలను నిర్ణయించిందని, అందుకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిపారు. కానీ, హైదరాబాద్ సోమాజిగూడలోని డెక్కన్ ఆస్పత్రిలో సర్కారు నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని శ్రీనివాసరావు వెల్లడించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా డీఎంహెచ్వో విచారణ జరపగా అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా డెక్కన్ ఆస్పత్రిలో కొవిడ్ సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఒక్క కరోనా రోగిని కూడా ఆస్పత్రిలో చేర్చుకోవద్దని, చికిత్స పొందుతున్న రోగులకు అసౌకర్యం కలిగించవద్దని, వారికి సర్కారు నిర్ణయించిన ధరల ప్రకారమే వైద్యం అందించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదేశాలను అతిక్రమిస్తే ఆస్పత్రి లైసెన్స్ను రద్దు చేస్తామని హెచ్చరించారు.
Courtesy Andhrajyothi