- ఏసీబీ అధికారుల సోదాల్లో వెల్లడి..
- తెలంగాణ, ఏపీల్లో ఏకకాలంలో 25 ప్రాంతాల్లో సోదాలు
- నర్సింహారెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు
- ఆస్తుల పత్రాలు, ఆభరణాలు, నగదు లభ్యం
- ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు
హైదరాబాద్/మారేడుపల్లి/జనగామ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ వై.నర్సింహారెడ్డి.. సుమారు రూ.70 కోట్ల ఆస్తు లు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అంచనాకు వచ్చారు. బుధవారం అతని నివాసంతోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి దీనిని గుర్తించారు. ఏసీబీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మహేంద్రహిల్స్లోని నర్సింహారెడ్డి నివాసంతోపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలు, వరంగల్, జనగాం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు నిర్వహించారు. మొత్తంగా తెలంగాణ, ఏపీలోని 25 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. మహేంద్రహిల్స్ త్రిమూర్తి కాలనీలోని నర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీలు జరిపింది.
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ సోదాల్లో నర్సింహారెడ్డికి 3 ఇళ్లు, 5 ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు రూ.5కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో బృందం ఉప్పల్లోని మల్కాజిగిరి ఏసీపీ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు జరిపింది. దీంతోపాటు నర్సింహారెడ్డికి బినామీగా భావిస్తున్న ఉప్పల్లో నివసించే ఓ ఏఎ్సఐ ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు మేడిపల్లి, ఉప్పల్లోని నర్సింహారెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశా రు. జనగామ జిల్లాలోనూ 3 చోట్ల తనిఖీలు నిర్వహించారు. లింగాలఘణపురం మండ లం వడ్డిచర్లలో నర్సింహారెడ్డి అత్తవారిం ట్లో, బచ్చన్నపేట మండలంలోని కట్కూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి బండి చంద్రారెడ్డి నివాసంలో, రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లిలోని ఏసీపీ ప్రైవేటు డ్రైవర్ పోరెడ్డి తిరుపతిరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
వ్యాపారాల్లో పెట్టుబడులు..
పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిన నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్తోపాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు ఆధారాలతో గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.7.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్ ధర ప్రకారం రూ.70 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఇక నర్సింహారెడ్డికి సంబంధించి రెండు బ్యాంకు లాకర్లను గుర్తించారు. వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తుల సమాచారంతోపాటు నగదు, విలువైన వస్తువులు బయట పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. నర్సింహారెడ్డి గతంలో మియాపూర్, ఉప్పల్, బేగంపేట్ ఇన్స్పెక్టర్గా, చిక్కడపల్లి డివిజన్లో ఏసీపీగా పనిచేశారు. అక్కడి నుంచి మల్కాజిగిరికి బదిలీ అయ్యారు. నర్సింహారెడ్డి పలు భూ వివాదాల్లో తలదూర్చినట్లు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందింది.
ఏసీబీ గుర్తించిన ఆస్తులు..
అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి.
సైబర్ టవర్స్ ఎదురుగా 1960 చదరపు గజాల 4ప్లాట్లు.
రెండు చోట్ల ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు.
హఫీజ్పేట్లో జీ ప్లస్ 3 వాణిజ్య సముదాయం.
రూ. 15 లక్షల నగదు. రెండు బ్యాంకు లాకర్లు.
30 ఎకరాల కొనుగోలు వివాదంతో..
నర్సింహారెడ్డి ఘట్కేసర్లోని యామన్పేట్లో 30 ఎకరాల భూమిని స్థానిక రాజకీయ నాయకులతో కలిసి కొనుగోలు చేసినట్లు, ఇది వివాదానికి దారి తీసినట్లు సమాచారం. దీంతోపాటు ఇటీవల కొండాపూర్లోనూ అసైన్డ్ భూమి కొనుగోలు చేసినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెం దిన ఎంపీపీ మధుకర్ ద్వారా కొండాపూర్లోని భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. మధుకర్ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు కాగా.. మధుకర్ జీహెచ్ఎంసీలోని అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడికి అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది.
నా వెనక పెద్దసారు ఉన్నారు..!
ఏసీపీ నర్సింహారెడ్డి వివాదాస్పద భూముల విషయంలో తలదూర్చడమే కాకుండా.. ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరైనా చెబితే, ‘నాకేం కాదు.. నా వెనక పెద్దసారు ఉన్నారు’ అని చెప్పుకొనేవాడని తెలిసింది. ఓ భూ వివాదానికి సంబంధించి అధికారులు రూపొందించిన నివేదికలోనూ ఆయన పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. నర్సింహారెడ్డికి అశోక్ పాటిల్ అనే వ్యక్తి కీలక బినామీ అని ఆధారాలు లభించినట్లు సమాచారం. మరి కొందరు బినామీలనూ గుర్తించారు.
Courtesy Andhrajyothi