ఆనింద్యో చక్రవర్తి
ఫిబ్రవరి 25 న నా స్నేహితుడు సౌరభ్ శుక్లా జీవితాన్ని ఓ రుద్రాక్ష మాల కాపాడింది. సౌరభ్ ఓ హిందూ మతస్తుడిగా తన చిన్నప్పటినుంచే రుద్రాక్ష మాలని మెడలో ధరించారు. ఆ మాల వల్ల తనకి ప్రశాంతత చేకూరుతుందని అతను అంటుంటారు. ఆ రోజు సౌరభ్ తన ఇద్దరు సహోద్యోగులతో ఈశాన్య ఢిల్లీలోని మతపరమైన అల్లర్ల వివరాలని ప్రజలకి అందించడానికి బయలుదేరారు.
రక్త దాహంతో చెలరేగిపోతున్న ఓ ఉన్మాదుల గుంపుకి వారు చిక్కారు. నిర్దాక్షిణ్యంగా వారు తమపై పిడిగుద్దులు కురిపిస్తుంటే సౌరభ్ తానొక హిందువునని నిరూపించడానికి తన రుద్రాక్ష మాలని వారికి చూపించారు. వెంటనే ఆ గుంపు అతన్ని వదిలేసింది. సౌరభ్ ఫోనులో చిత్రీకరించిన వీడియోని కూడా డిలీట్ చేయించింది. “అన్నింటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే,నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం నా మతమేదో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొనడమే” అని సౌరభ్ శుక్లా తర్వాత ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ అన్నారు.
నిరుద్యోగం వల్ల కలిగే మానసిక ఆందోళన
ఈ ఉన్మాదుల గుంపులో ఉన్నవారంతా ఎవరు?. వారంతా కర్రలూ,రాళ్లూ చేతుల్లో పట్టుకుని మత ద్వేషంతో కళ్లు మూసుకుపోయిన ఇరవై దరిదాపుల వయసున్న కుర్రోళ్లే. ఐతే మతద్వేషం ఒక్కటే వారి అత్యుత్సాహానికి కారణం కాదు. వారంతా కూడా మద్యం మత్తులో ఉన్నారు. గుంపు మనస్తత్వం,మతమౌఢ్యం, పురుషత్వం,మద్యం లాంటివన్నీ మిళితమై వారిని ఆ స్థితికి తీసుకెళ్లాయని చెప్పొచ్చు.
అన్నింటికంటే ముఖ్యంగా వారంతా నిరుద్యోగులే అయ్యే అవకాశం ఉంది. సీఎంఐఈ సమాచారం ప్రకారం ఢిల్లీలో సుమారు 5.7 లక్షల మంది 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఉద్యోగాలు కోసం వెతికి వేసారినా ఏ ఉద్యోగం పొందలేని దుస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. వారి సంఖ్య మొత్తం పట్టణ యువత జనాభాలో 30 % ఉంటుంది. వీరిలో మళ్లీ 20-24 ఏళ్ల మధ్య వయసున్న యువకుల్లో ఐతే నిరుద్యోగిత రేటు 49 శాతంగా ఉంది. అంటే ఇరవైల్లో ఉన్న ప్రతీ ఇద్దరు యువకుల్లో ఒకరికి ఉద్యోగం లేదన్నమాట!.
యవ్వనంలో అడుగుపెట్టి,సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి సహాయపడతారనుకునే వయసులో ఉన్నవాళ్లపై ఈ పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
బంధువులు ఇక పెళ్లి సమయం దగ్గర పడిందని అంటుంటారు. వీటన్నింటి మధ్య యువకుడు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి హాజరౌతూ,దరఖాస్తులూ,మెయిల్స్ పంపుతూ సవాలక్ష ప్రయత్నాలు చేస్తుంటాడు.
దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఐతే యువకులపై కుటుంబ హోదాని పెంచాల్సిన అదనపు బాధ్యత కూడా ఉంటుంది. తండ్రి పరిశ్రమల్లో పనిచేసే కార్మికుడైనా సరే తన పిల్లల్ని స్కూలు,కాలేజీల్లో చదివించడానికి చాలా కష్టపడతాడు. కాబట్టి ఆ తర్వాతి తరంపై ఆఫీసులో జాబ్ సంపాదించి ఇరుకు సందుల్లోని తమ ఇంటిని మెరుగుపరిచే బాధ్యత ఉంటుంది. వారికిది సాంస్కృతికంగా,మానసికంగా కూడా మోయలేని భారంగా మారుతోంది..
నిరుద్యోగ యువకులు ఏం చేస్తారు?.
నిరుద్యోగ యువకులు వీధి చివర్లలో గుమిగూడి గల్లీ క్రికెట్ ఆడతారు. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు,సమాచారం చవకగా లభిస్తుండడంతో యూట్యూబ్ వీడియోలు చూస్తూ ట్విట్టర్,ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మరో జీవితం వెళ్లదీస్తూ ఉంటారు. కొందరేమో ఏదో విధంగా పేరు సంపాదించాలని టిక్ టాక్ వీడియోలు చేస్తుంటారు. రోజంతా కూడా తమ ప్రపంచంలో ఏం జరుగుతుందోననే అంశంపై అంతటా వ్యాపించిన వాట్సప్ యూనివర్సిటీ క్లాస్ రూముల్లోని అసంపూర్ణ,అసంబద్ధ సమాచారమంతా వారికి చేరుతోంది. అంతే కాకుండా ఉద్యోగం లేదన్న నిరాశా,నిస్సహాయతా వారి లోపల దాగుండి ఎప్పుడు బయటపడాలా అని ఎదురుచూస్తూ ఉంటాయి.
నిరుద్యోగ యువతలో మళ్లీ సాంఘిక పరమైన విభజనలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతుల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువని మనకి తెలుసు. సీఎంఈఐ 2019 సమాచారం ప్రకారం వారిలో 63 శాతం మందికి పైగా ఎలాంటి ఉద్యోగాలూ లేవు.
అలాగే ప్రభుత్వ సమాచారం ప్రకారం అగ్ర కులాల వారు కళాశాలలు,విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశం ఎక్కువుంటుందనే విషయమూ మనకి తెలుసు. 2018-19 లో ఉన్నత విద్యని అభ్యసిస్ంచిన వారిలో 36 శాతం అగ్రకులాల వారే. ఐతే మొత్తం జనాభాలో మాత్రం వారు 22 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.
ముస్లింలు – స్వయం ఉపాధి.
ముస్లింలలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు. వారి జనాభా మాత్రం మొత్తం జనాభాలో 15 శాతం వరకూ ఉంటుంది. చాలా పరిశోధనల్లో తెలిసిందేంటంటే మధ్యతరగతి ముస్లిం కుటుంబాల్లో వ్యక్తులు టైలర్లుగా,పెయింటర్లుగా,క్షురకులుగా,మెకానిక్ లుగా పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కాబట్టి టెనెమెంట్ కాలనీలో ఉండే ఓ ముస్లిం తండ్రి తన పిల్లలు తనకంటే బాగా వృద్ధిలోకి వస్తారని ఆశించడు. మతవివక్ష కారణంగా ఉన్నత హోదా గల ఉద్యోగాలేవీ తమ పిల్లలు సాధించడం చాలా కష్టమనే వాస్తవం వారికెప్పుడో బోధపడింది.
నిర్దిష్ట సమాచారం దొరకడం కష్టమైనా అంచనాల ప్రకారం అల్లర్ల ద్వారా ప్రభావితమైన ప్రాంతాల్లో సుమారు 500-700 దుస్తుల కర్మాగారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ కర్మాగారాలన్నీ ఇళ్లల్లోనే 20-25 మంది కార్మికులతో నడడపబడుతుంటాయి. వారంతా దుస్తులు కత్తిరించడం,కుట్టడం,గుండీలు అతికించడం లాంటి పనుల్లో నిమగ్నమౌతారు. ముస్లిం యాజమానులు నిర్వహించే ఈ కర్మాగారాల్లో ఎక్కువ మంది ముస్లిం కార్మికులే ఉన్నారు. ఐతే దుస్తుల తయారీ ఎప్పటినుంచో ముస్లింల సాంప్రదాయిక వృత్తి కాబట్టి ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఉత్తర భారతదేశంలో దుస్తుల తయారీలో పేరుగాంచిన ముస్లిం కమ్యూనిటీ వీరినే దర్జీలు అని కూడా అంటారు.
సామాజిక మాధ్యమాల్లో ముస్లింలని కించపరచడానికి వాడే పంక్చర్ వాలా పదం కూడా ముస్లింలు అధికంగా ఎంచుకునే మరో వృత్తి ఐన ఆటో మెకానిక్ నే సూచిస్తుంది. ఇది కూడా ఈశాన్య ఢిల్లీలో ఓ పెద్ద పరిశ్రమ. ఉదాహరణకి అల్లర్లో ధ్వంసం చేయబడిన ఢిల్లీలోని గోకుల్ పురి టైర్ మరియు కార్ రిపేర్ మార్కెట్ లో పనిచేస్తున్న చాలామంది కార్మికులు ముస్లింలే. ఈ సముదాయంలో ఉన్న చాలా షాపులు కూడా ముస్లిం వ్యాపారులవే.
ఈశాన్య ఢిల్లీలో క్లిష్టమైన సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ
ఓ వైపేమో ఇరవైల్లో ఉన్న నిరుద్యోగ హిందూ యువకులు ఉద్యోగాల వేటలో ఉంటే మరోవైపు ముస్లిం యువత దుస్తుల కర్మాగారాల్లోనో, మరమ్మతుల షాపుల్లోనో నైపుణ్యం గల కార్మికులుగా పని చేసుకుంటున్నారు. ఈ తేడా ఇప్పటికే సాంస్కృతిక పరంగా ఈ రెండు వర్గాల మధ్య విభజనని ప్రోత్సహించిన దుష్ప్రచారానికి తోడై పరిస్థితులని మరింత జటిలం చేస్తోంది. మనం-వాళ్లు అనే సంగ్రామంలో పేలడానికి సిద్ధంగా ఉన్న మందుగుండు సామగ్రి లాంటిదని చెప్పవచ్చు.
ఈ ప్రాంతంలో మరో పెద్ద పరిశ్రమ కూడా ఉంది,అదే వ్యవస్థీకృత నేరం.నాసిర్ అనే అతని నాయకత్వంలో ఒకటి,ఇర్ఫాన్ అలియాస్ ఛేను పెహెల్వాన్ నడిపేదొకటి కలిసి రెండు ముఠాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడని ఈ ముఠాల్లో వందలాది మంది సభ్యులు దొంగతనాలూ,అక్రమ వసూళ్లూ,హత్యలూ లాంటి వాటిలో ఆరితేరిన వారున్నారు. వ్యభిచార గృహాల నిర్వహణని చూసుకునే మరో ముఠా కూడా ఉంది. వీటిలో ఛేనూ పెహెల్వాన్ అనుచరుడు షకీలా లక్ష్మీ నగర్ లో నడిపే వ్యభిచార గృహం అన్నింటికంటే పెద్దది.
ఈశాన్య ఢిల్లీలోని సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ చాలా సంక్లిష్టతతో కూడుకున్నది. చిన్న తరహా పరిశ్రమలు,పరిశ్రమలో పనిచేసే కార్మికులు,వ్యవస్థీకృత నేర విభాగాలూ,నిరుద్యోగం,అన్ని రకాల దుష్ప్రచారం లాంటి వాటికి ఈ ప్రాంతం ఓ కేంద్రంగా మారిందనొచ్చు.
ఓ నిరుద్యోగ హిందూ యువకుడు దర్జీగా పనిచేస్తూ స్వంత మోటార్ బైక్ కొనుక్కున్న తన వయసులోనే ఉన్న ముస్లిం యువకుడిని చూసినప్పుడు అతనిలో అప్పటికే ఉన్న నిరాశ,అపనమ్మకం తారా స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు కాబట్టే హిందువులకి పని దొరకట్లేదు అనే దుష్ప్రచారాన్ని వారు సులభంగా నమ్మేస్తారు. అందువల్ల ప్రతీ ముస్లింని కూడా “దేశం నుంచి వెళ్లగొట్టదగిన” “ఘుస్పైథియా” గా మాత్రమే చూడగలగడం సాధ్యమౌతుంది.
ముస్లింల పరాయీకరణ
మరోవైపు ముస్లిం పురుషులు,ప్రభుత్వం నుంచి విస్తృత స్థాయిలో పరాయీకరణని ఎదుర్కొనాల్సి వస్తోంది. భారతీయులుగా నిరూపించుకోండంటూ,విధేయతని చూపించడంటూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. కాబట్టి ముస్లింలు సీఏఏ కి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నప్పుడు తాము తమ ఉనికిని కాపాడుకోవడానికి ఓ వర్గంగా ఏర్పడాలని భావించి మహిళలేమో ధర్నాలూ,పురుషులేమో విస్తృత స్థాయిలో జోరుగా నిరసనలు చేపట్టారు.
ఈ ప్రాంతంలో నేరాల రేటు అధికంగా ఉండడం బట్టి ఇక్కడ ఇరువర్గాలకీ అక్రమ ఆయుధాలు పొందడం చాలా సులభమనే విషయం మనకి అర్థమౌతుంది.
అందుకే ఈ అల్లర్లలో గాయపడిన చాలామంది బుల్లెట్ గాయాలతో బాధపడుతున్నవారేనని మనం గమనించొచ్చు. నేరపూరిత మనస్తత్వానికీ,మతమౌఢ్యానికీ మధ్య ఎంత దగ్గరి సంబంధం ఉన్నదో అనే విషయం కూడా ఢిల్లీ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఈ అల్లర్లు మనకి తెలియజేస్తున్నాయి.