నొప్పితో నరకయాతన
ఎక్స్రేతో సమస్య వెలుగులోకి
మంత్రాలు చేసి గుచ్చారా?
వయసు రెండున్నరేళ్లు.. శరీరంలో 11 గుండు సూదులు
వనపర్తి : చిన్నపాటి ముల్లు, సూది మొన, ఇనుప కమ్మీ తాకితేనే మనం విలవిలలాడిపోతాం!! అలాంటిది ఈ ఫొటోలో కనిపిస్తున్న రెండున్నరేళ్ల బాలుడు తొడ, పిరుదుల్లో 11 గుండు సూదులతో నరకయాతన అనుభవిస్తున్నాడు. వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన అశోక్ , అన్నపూర్ణ దంపతుల కుమారుడు లోక్నాథ్ ఈ విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఏడాది క్రితం బాలుడి కాలికి దెబ్బతగిలింది. అప్పట్లో కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. అయితే తొడ, పిరుదుల్లో నొప్పిగా ఉందని గత రెండు రోజులుగా బాలుడు తన తల్లిదండ్రులకు చెబుతున్నాడు. దీంతో వారు తొడ భాగంలో తడిమి చూడగా పిరుదులో ఒక గుండు సూది గుచ్చుకున్నట్లు గుర్తించి, వెంటనే తీసేశారు. సెప్టిక్ అవుతుందేమోనని వనపర్తిలోని సుధా నర్సింగ్హోమ్కు తీసుకొచ్చారు. డాక్టర్ శ్రీనివా్సరెడ్డి ఎక్స్రే తీయగా బాలుడి తొడలో 11 గుండు సూదులు ఉన్నట్లు గుర్తించారు.
వాటిని తీయించేందుకు బాలుడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సూదులు బయటకు తీసిన తర్వాత వైద్యులు ఏం చెబుతారో వేచిచూడాలి. మరోవైపు లోక్నాథ్ తల్లిదండ్రులు వీపనగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి శరీరంలోకి గుండు సూదులు ఎలా వచ్చాయో తెలియడంలేదని వారు చెబుతున్నారు. ఊర్లో మంత్రాలు వేసే వారు ఎవరైనా ఇలా చేసి ఉంటారేమోనని అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
Courtesy Andhrajyothi