– ఒకరు మృతి
– ‘సీఏఏ’ వ్యతిరేకులపై రెచ్చిపోయిన మూకలు
షిల్లాంగ్ : ఓ పక్క దేశ రాజధాని కుదుటపడుతుంటే.. మరోపక్క మేఘాలయలో అగ్గి రాజుకుంది. సీఏఏను వ్యతిరేకిస్తూ, ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ)ను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్న ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్యూ) కార్యకర్తలపై జరిగిన దాడిలో ఒకరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని కేఎస్యూ సభ్యుడు, చెర్రపుంజి వాసి లుర్షరు హైనివేటాగా గుర్తించారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు ఇండ్లకు, వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. తొలుత సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కేఎస్యూ సభ్యులపై గిరిజనేతరులకు దాడికి తెగబడ్డారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకొన్న పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకొచ్చారు. షిల్లాంగ్, సమీప ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ముందుజాగ్రత్త చర్యగా కర్ఫ్యూవిధించినట్టు పోలీసు ఉన్నతాధికారి క్లౌవుడియా ఏ లింగ్వా చెప్పారు.
అలాగే సున్నితమైన ఆరు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. తూర్పు జైంతియా హిల్స్, పశ్చిమ జైంతియా హిల్స్, తూర్పు ఖాసీ హిల్స్, రి బోయి, పశ్చిమ ఖాసీ హిల్స్, సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఘర్షణలో కేఎస్యూ సభ్యులకు చెందిన వాహనాలను ధ్వంసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు మేఘాలయా సీఎం కంగ్రాడ్ సంగ్మా తెలిపారు. శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు సైనిక బలగాలను రంగంలోకి దించామన్నారు.
Courtesy: NT