-ఏప్రిల్-జూన్లో 81శాతం పతనం..!
– కొత్త ఆవిష్కరణల్లో 98 శాతం క్షీణించొచ్చు
– హైదరాబాద్ విక్రయాల్లో 85 శాతం పడిపోవచ్చు: ప్రాపర్టీ కన్సల్టెంట్ అన్రాక్ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ దెబ్బతో ప్రజల కొనుగోళు శక్తి హరించుకుపోవడం, అనేక మంది ఉద్యోగాలు సందిగ్దంలో పడటంతో గృహ అమ్మకాలు అమాంతం క్షీణించాయి. దేశంలోనిపలు కీలక నగరాల్లో గడిచిన ఏప్రిల్-జూన్ కాలంలో గృహ అమ్మకాలు ఏకంగా 81 శాతం క్షీణించి 12,740 యూనిట్లకు పరిమితం కావొచ్చని ప్రాపర్టీ కన్సల్టెంట్ అన్రాక్ గురువారం ఓ రిపోర్టులో అంచనా వేసింది. 2019 ఇదే ఏప్రిల్-జూన్ కాలంలో ఢిల్లీ, ఎన్సిఆర్, ముంబయి మెట్రోపాలిటిన్ రీజియన్ (ఎంఎంఆర్), పూణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లో ఏకంగా 68,600 యూనిట్ల అమ్మకాలు జరిగాయని అన్రాక్ తెలిపింది.
అన్రాక్ వివరాల ప్రకారం.. గడిచిన జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో పెద్ద మొత్తంలో అమ్మకాలు పడిపోయాయి. ఇదే సమయంలో కొత్త నిర్మాణాలు, ఆవిష్కరణలు ఏకంగా 98 శాతం క్షీణించి 1,390 యూనిట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. 2019 ఇదే ఏప్రిల్ జూన్ కాలంలో కొత్త ఆవిష్కరణలు 69,000 యూనిట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో కొత్త ఆవిష్కరణలు, గృహ అమ్మకాలు పూర్తిగా డీలా పడ్డాయని అన్రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఛైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. గృహ అమ్మకాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదని అనుజ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనేడెవలపర్లు తమ డిజిటల్ అమ్మకాల సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నారు.
కరోనాను అరికట్టడానికి మార్చి 25 నుంచి దేశ వ్యాప్త లాక్డౌన్ విధించడంతో దాదాపుగా అన్ని ఆర్ధిక కార్యకలపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతాల్లో 2020 ఏప్రిల్- జూన్ కాలంలో గృహ అమ్మకాలు 83 శాతం తగ్గి 2,100 యూనిట్లకు పరిమితం కావొచ్చని అన్రాక్ రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో 12,640 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే సమయంలో ఎంఎంఆర్లో 21,360 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. గత త్రైమాసికంలో ఈ ప్రాంతంలో అమ్మకాలు 83 శాతం కోల్పోయి 3,620 యూనిట్లుగా ఉండొచ్చు. హైదరాబాద్లో అమ్మకాలు 85 శాతం క్షీణించి 660 యూనిట్లకు పరిమితం కావొచ్చని అన్రాక్ అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో 4,430 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
Courtesy: NT