– 80 శాతం మందికి తగ్గిన రాబడి..
– భవిష్యత్తుపై ఆందోళనలో ఉద్యోగులు
– దాదాపు అందరిదీ అదే పరిస్థితి
– ప్రభుత్వం, యాజమాన్యాల నుంచి సాయం ఆశిస్తున్న శ్రామికులు : జనరలి, ఫ్యూచర్ గ్రూపు సర్వే
న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యోగుల ఆదాయాలు భారీగా తగ్గాయి. మహమ్మారి కాలంలో సుమారు 80శాతం మంది ఉద్యోగుల ఆదాయాలు పోయాయని ఒకసర్వేలో వెల్లడైంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్నదనీ, మరికొన్నాళ్లు ఇలాగే ఉండాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఇటలీ వేదికగా పనిచేసే జనరలి, దేశంలో పనిచేస్తున్న ఫ్యూచర్ గ్రూపుతో సంయుక్తంగా సర్వే నిర్వహించింది. అంతర్జాతీయంగా 22 దేశాల్లోనూ సర్వే చేసి నివేదికను ఇటీవలే వెలువరించింది. నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం… భారత్లో పని చేస్తున్న శ్రామిక శక్తిలో 80 శాతం మంది ఆదాయాలు కోల్పోయారు.
ఇదే పరిస్థితి మరికొన్ని నెలల పాటుకొనసాగుతుందని 92 శాతం మంది తెలిపారు. ఆదాయాలు కోల్పోయిన వారిలో రెగ్యులర్ ఉద్యోగులు, కార్మికులు, స్వయం ఉపాధి పొందే ఔత్సాహికులూ ఉన్నారు. రాబడి లేకపోవడంతో తమను ఆదుకోవాలని 95 శాతం మంది ఉద్యోగులు ప్రభుత్వాలు, యాజమాన్యాల వంక ఆశగా చూస్తున్నారు. వీరిలో ఆర్థికావసరాలను తీర్చుకోవ డానికి 60 శాతం మంది తాము దాచుకున్న పొదుపు, పెట్టుబడుల నుంచి నగదును తీసుకుని వాడుతున్నా రు.
39 శాతం మంది కుటుంబ సభ్యుల నుంచి రుణాలు తీసుకున్నామని వెల్లడించారు. కరోనా నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం మరికొన్నాళ్లూ తప్పదని సర్వేలో పాల్గొన్న మెజారిటీ ఉద్యోగులు చెప్పారు. లాక్డౌన్ కారణంగా దేశంలో పనిచేస్తున్నవారిలో సగం మంది ఇంటి వద్ద నుంచే చేస్తున్నారనీ, ఇది ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఉత్పత్తి లేక సంస్థలు మూతపడుతున్న తరుణాన యాజమాన్యాలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్నామనీ, జీవితంలో అస్థిరత్వం సంతరించుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నష్టాలతో కుటుంబపోషణ కష్టంగా మారిందని గోడు వెల్లబోసుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగానే గాక భౌతికంగా, మానసికంగా, సామాజికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు.
Courtesy: NT