- మురుగునీటి వ్యర్థాలపై సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి
- నగరంలో రోజూ 1800 మిలియన్ లీటర్ల మురుగు
- అందులో 40ు మేర మురుగునీటి శుద్ధి కేంద్రాలకు!
- ఆ కేంద్రాల్లో జూలై 8 నుంచి ఆగస్టు 6 దాకా
- నాలుగు సార్లు నమూనాలు సేకరణ, పరీక్ష
- 2 లక్షల మందికి వైరస్ సోకినట్టు వెల్లడి
మొత్తం మురుగునీటిని లెక్కిస్తే 6.6 లక్షల పాజిటివ్లు.. వారిలో లక్షణాలున్న, లేనివారు, వచ్చి తగ్గినవారూ ఉన్నారుగ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో కేసులు తగ్గినట్టు సర్కారీ లెక్కలు చెబుతున్నాయి! కానీ.. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 6.6 లక్షల మంది కరోనా పాజిటివ్లున్నట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది! నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీ) మురుగునీటిని పరీక్షించి మరీ వారు అంచనాకు వచ్చారు!! వారు ఈ అధ్యయనం సాగించిన సమయంలో అధికారికంగా నమోదైన కేసుల సంఖ్య కంటే.. అధ్యయనం లో తేలిన సంఖ్య 24 రెట్లు ఎక్కువ!!
సాంక్రమిక వ్యాధులు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి? కరోనా లాంటి మహమ్మారులు ప్రబలినప్పుడు ఆ వైరస్ ఒక ప్రాంతంలో ఎంత మందికి ప్రబలింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్నిసార్లు మురుగునీరు కూడా ఉపకరిస్తుంది. ఈ క్రమంలోనే.. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా విస్తృతి గురించి తెలుసుకోవడానికి మురుగునీటిపై సీసీఎంబీ చేసిన ఒక తాజా అధ్యయనం ప్రకారం నగర జనాభాలో సుమారు 6.6 శాతం మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొవిడ్-19కు కారణమైన ‘సార్స్-కొవ్-2’ వైరస్ ఆర్ఎన్ఏ అవశేషాలు మానవ మలంలో 35 రోజుల దాకా ఉంటాయి. మరుగుదొడ్ల పైపుల నుంచి ప్రవహించే ఆ అవశేషాలు మునిసిపల్ మురుగునీటి పైపుల్లో కలుస్తాయి. (లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా.. వైరస్ సోకినవారి మలంలో, సోకి తగ్గిపోయినవారి మలంలో కూడా ఈ అవశేషాలుంటాయి. అయితే, అవి నిర్వీర్యమైనవి. వాటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు). అంటే ఆ మురుగునీటిని పరిశీలించడం ద్వారా దాదాపు 35 రోజుల వ్యవధిలో నిర్ణీత ప్రాంతంలో ఎంతమంది వైరస్ బారిన పడిందీ అంచనా వేయొచ్చు.
శుద్ధి కేంద్రాల్లో నమూనాల సేకరణ..
నగరంలో రోజుకు 1800 మిలియన్ లీటర్ల మురుగునీటి వ్యర్థాలు వస్తాయి. వాటిలో 40 శాతం మేర నగరంలోని పలు మురుగునీటి శుద్ధి కేంద్రాలకు వస్తాయి. ఆ మురుగును అక్కడ శుద్ధి చేస్తారు. సీసీఎంబీ పరిశోధకులు జూలై 8 నుంచి ఆగస్టు 6 నడుమ ఆయా మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి నాలుగుసార్లు నమూనాలు సేకరించి.. వాటిలో కరోనా ఆర్ఎన్ఏ అవశేషాల కోసం పరీక్షించారు. ‘‘మురుగునీటిలో ఉండే ఆర్ఎన్ఏ పరిమాణం ఆధారంగా మా శాస్త్రవేత్తలు ఎంత మంది ప్రజలకు అది సోకి ఉండవచ్చనే విషయాన్ని అంచనా వేశారు. సుమారు 2.2 లక్షల మంది ప్రజలకు ఈ వైరస్ సోకి ఉండచ్చని తేలింది. అయితే ఈ ప్లాంట్లు హైదరాబాద్లో రోజూ విడుదలయ్యే మొత్తం మురుగునీటిలో 40 శాతాన్ని మాత్రమే శుద్ధి చేస్తున్నాయి. మా అధ్యయనం కోసం 600 మిలియన్ లీటర్ల నీటిని పరిశీలిస్తే 2.2 లక్షల కేసులు ఉన్నట్టు తేలింది కాబట్టి.. మొత్తం 1800 మిలియన్ లీటర్ల మురుగునీటికి దాన్ని అన్వయిస్తే 6.6 లక్షల కేసులు అవుతుంది.’’ అని సీసీఎంబీ ప్రతినిధి డాక్టర్ సోమాదత్తా వివరించారు.
హైదరాబాద్ జనాభా దాదాపు కోటి ఉంటుందనుకుంటే.. అందులో 6.6 శాతం మందికి వైరస్ సోకినట్లని ఆమె విశ్లేషించారు. ‘‘మా అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం నగరంలో వైరస్ బారినపడినవారిలో చాలా మందికి ఎలాంటి లక్షణాలూ లేవు. వారికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదు. ఇంత భారీగా కేసులున్నా ఆస్పత్రులపై ఒత్తిడి, మరణాల రేటు అనుకున్నదానికన్నా చాలా తక్కువగా ఉందని అర్థం’’ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ‘‘కరోనా వ్యాపిస్తున్న సమయంలో కూడా మన ఆరోగ్య వ్యవస్థలు పరిస్థితిని ఎందుకు చక్కగా హ్యాండిల్ చేయగలిగాయనే విషయాన్ని ఈ అధ్యయన ఫలితాలు వివరిస్తున్నాయి’’ అని ఆయన సూచించారు. సీసీఎంబీ చేసిన ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుతానికి ‘మెడ్-ఆర్కైవ్ (క్ఛఛీఖ్ఠజీఠి)’లోని ప్రీప్రింట్ సర్వర్లో పొందుపరచారు. దీనిపై ఇంకా పీర్ రివ్యూ (అంటే సంబంధిత రంగానికి చెందిన నిపుణులు ఫలితాలను పరిశీలించడం) జరగాల్సి ఉంది.
ఆ సమయంలో 26 వేల కేసులే..
సీసీఎంబీ పరిశోధకులు ఈ అధ్యయనం నిమిత్తం మురుగునీటి నమూనాలను ఆఖరుసారిగా సేకరించింది ఆగస్టు 6న. మానవ విసర్జితాల్లో వైరస్ ఆర్ఎన్ఏ 35 రోజులే ఉంటుందనుకుంటే.. ఆగస్టు 6 నుంచి 35 రోజులు వెనక్కి అంటే జూలై 2 అవుతుంది. అప్పట్నుంచీ ఆగస్టు 6 వరకూ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవి 27 వేల లోపు కేసులే!! అంటే.. అధికారిక గణాంకాలతో పోలిస్తే సీసీఎంబీ లెక్కల ప్రకారం ఆ సమయంలో కేసుల సంఖ్య 24 రెట్లు అధికం!!
Courtesy Andhrajyothi