సగం పడకల్లో చికిత్సలు సర్కారీ ధరలకే!
ఫిర్యాదులు, ప్రభుత్వ హెచ్చరికలే కారణం!
మంత్రి ఈటలతో యాజమాన్యాల భేటీ
తప్పును సరిదిద్దుకుంటామని వ్యాఖ్య!
నోడల్ అధికారిని నియమించాలని వినతి
ప్రైవేటుకు ఎవరిని పంపాలన్నదానిపై
నేడో, రేపో మార్గదర్శకాల రూపకల్పన
నేడు ప్రైవేటు ఆస్పత్రులతో డీహెచ్ భేటీ
రోగుల వివరాలు యాప్లో..
ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్కారు నిర్ణయించిన ధరల ప్రకారం చికిత్స పొందే రోగులెవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రి కార్యాలయం మాత్రం ప్రత్యేక యాప్ ద్వారా రోగులను అక్కడికి పంపుతారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావుతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు భేటీ కానున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు ఎటువంటి రోగులను పంపాలన్నదానిపై మార్గదర్శకాలు రూపొందించనున్నారు. అవి ఒకటి రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం పడకల్లో వెంటనే సర్కారీ ధరల అమలు జరుగుతుందని చెబుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు : కరోనా రోగుల చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరు మారింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, సగం పడకలు స్వాధీనం చేసుకుంటామని సర్కారు హెచ్చరించడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. తమ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు సగం పడకల్లో సర్కారు నిర్ణయించిన ధరలకే వైద్యం అందించేందుకు ముందుకొచ్చాయి. గురువారం బీఆర్కే భవన్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో సమావేశమైన ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు.. ఈ మేరకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి కరోనా రోగులను దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో రెండు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. మిగిలిన ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు.
అయినా ఫిర్యాదులు తగ్గకపోవడంతో సగం పడకలను స్వాధీనం చేసుకుంటామనివైద్య మంత్రి ఈటల హెచ్చరించిన నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాలు దిగివచ్చాయి. రెండు రోజుల నుంచి వైద్య మంత్రిని అపాయింట్మెంట్ కోరుతూ రాగా.. గురువారం మంత్రి వారితో భేటీ అయ్యారు. ప్రజల్లో ప్రైవేటు ఆస్పత్రులపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో తెలుసా? వారెంత అసహ్యించుకుంటున్నారో తెలుసా? అని ఈటల ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో అన్నట్లు సమాచారం. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు కొంత పశ్చాత్తాపం వ్యక్తం చేశాయని, చేసిన తప్పును సరిదిద్దుకుంటామని మంత్రితో వ్యాఖ్యానించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 150 ప్రైవేటు ఆస్పత్రులకు కొవిడ్ చికిత్స చేసేందుకు అనుమతులున్నాయి. అందులో వందకు పైగా చికిత్స అందిస్తుండగా, 7879 పడకలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. ప్రధానంగా గ్రేట్ హైదరాబాద్లోనే ఇవి ఉన్నాయి. జిల్లాల్లో తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం కొవిడ్ చికిత్స ధరల ప్యాకేజ్ను నిర్ణయిస్తూ జీవో 248 విడుదల చేసింది. కానీ, దాని ప్రకారం ఎక్కడా చికిత్స అందడం లేదని వైద్య ఆరోగ్యశాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.
సర్కారు చర్యలు ప్రారంభించడంతో సగం పడకల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు అంగీకరించాయి. అయితే పడకలన్నీ ప్రైవేటు ఆధీనంలో ఉంటాయని, సగం పడకల్లోనే సర్కారీ ధరల ప్రకారం చికిత్స జరుగుతుందని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు. రోగులను ఎలా నింపాలన్న విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వెల్లడించారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులపై పర్యవేక్షణకు ప్రభుత్వం తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని వైద్య మంత్రిని కోరారు.
Courtesy Andhrjayothi