- నిద్రాణంగా 2,600 ఖాతాలు
- 12 ఖాతాలు భారతీయులవే !
- అక్రమంగానో సక్రమంగానో సంపాదించారు. గుట్టుగా స్విట్జర్లాండ్ బ్యాంకుల ఖాతాల్లో దాచారు. ఏ కారణం చేతో ఏళ్ల తరబడి ఆ ఖాతాల జోలికిపోలేదు. ఇప్పుడదే వారి పాలిట శాపంగా మారింది. ఈ ఖాతాల అసలు వ్యక్తులు లేదా వారి వారసులు సరైన ఆధారాలతో వస్తే సరి. లేదా ఖాతాలు మూసేసి ఆ డబ్బులు మా ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటాం అని స్విస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా మూసివేత ప్రమాదం ఎదుర్కొంటున్న 2,600 స్విస్ బ్యాంక్ ఖాతాల్లో 2015 నాటికి దాదాపు 4.5 కోట్ల స్విస్ ఫ్రాంక్స్ (సుమారు రూ.300 కోట్లు) ఉన్నట్టు అంచనా. ఇందులో దాదాపు 12 ఖాతాలు భారతీయులవని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఒక్క భారతీయుడు కూడా ఇది మా ఖాతా అని ముందుకు రాకపోవడం విశేషం.
ఇవీ నిబంధనలు…స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. 60 ఏళ్ల నుంచి ఖాతాదారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోతే, ఆ ఖాతాను నిద్రాణంగా ఉన్న ఖాతాగా పరిగణిస్తారు. ఈ ఖాతాల్లో కనీసం 500 ఫ్రాంక్స్ డిపాజిట్ లేదా విలువ తెలియని ఆస్తులు ఉండాలి. స్విట్జర్లాండ్ 2015 నుంచి ఇలాంటి నిద్రాణ బ్యాంక్ ఖాతాల వివరాల్ని వెల్లడిస్తోంది. ఈ ఖాతాల అసలు ఓనర్లు లేదా వారి వారసులు సరైన సాక్ష్ల్యాలతో ముందుకు వస్తే, ఆ ఖాతాల్లోని నగ, నట్రా వా రికే అప్పగిస్తారు. ఖాతాల్లో ని డిపాజిట్లు లేదా ఆస్తుల విలువ ఆధారంగా ఇందుకు ఏడాది నుంచి అయిదేళ్ల వరకు సమయం ఇస్తారు. ఈ లోపు అసలు యజమానులు లేదా వారి వారసులు సరైనా సాక్ష్యాలు సమర్పిస్తే సరి. లేకపోతే ఆ ఖాతాల్లోని సొమ్మంతా స్విట్జరాండ్ కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకి పోతుంది.
బ్రిటిష్ జమానా నుంచే!…నిద్రాణంగా ఉన్నట్టు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రస్తుతం బయటపెడుతున్న భారతీయుల బ్యాంకు ఖాతాల్లో కొన్ని బ్రిటిష్ జమానా నాటివి. ఇందులో రెండు ఖాతాలు కోల్కతాకు, ఒకటి డెహ్రాడూన్కు, రెండు ముంబైకి చెందిన పెద్ద మనుషులవని సమాచారం. బ్రిటిష్ జమానాలోనే బ్రిటన్, ఫ్రాన్స్లో సెటిలైన కొందరు భారతీయుల ఖాతాలు కూడా ఇందులో ఉండడం విశేషం. కొందరు మాజీ సంస్థానాదీశుల స్విస్ బ్యాంక్ ఖాతాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. స్విట్జర్లాండ్ బ్యాంకులు ఏటా సెప్టెంబరు నెలలో ఈ నిద్రాణ ఖాతాల జాబితా విడుదల చేస్తుంటాయి.
టైమ్ దగ్గర పడుతోంది…లీలా తాలూక్దార్, ప్రమతా ఎన్ తాలూక్దార్ అనే ఖాతాదారులు ఈ నెల 15వ తేదీ లోగా తమ వివరాలను స్విస్ బ్యాంకులకు అందించాలి. లేకపోతే వారి ఖాతాల్లోని సొమ్మంతా స్విస్ ప్రభుత్వ ఖాతాలోకి పోతుంది. ఇక చంద్రలత ప్రాణ్లాల్ పటేల్, మోహన్ లాల్, కిశోర్ లాల్ అనే వ్యక్తులు ఈ సంవత్సరం డిసెంబరులోగా తమ ఖాతాల వివరాలు సమర్పించాలి. ముంబైకి చెందిన రోజ్మేరీ బెర్నెట్, పీరె వాచక్ వచ్చే సంవత్సరం డిసెంబరులోగా తమ వివరాలు సమర్పించాలని స్విస్ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి.
Courtesy andhrajyothy..