- మింగలేక కక్కలేక
- ముందుకెళ్తే ప్రజలకు దూరం
- వెనకడుగేస్తే కేంద్రంతో వైరం
- మౌనం వీడని కేసీఆర్
నల్లమల అడవుల్లో యురేనియం సర్వే, తవ్వకాల కోసం కేంద్రం ఇచ్చిన అనుమతులతో సీఎం కేసీఆర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత పనైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నల్లమలలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకూ స్పందించక పోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిపాదనను రాజకీయంగా విభేదిస్తే కేంద్రంతో కయ్యం పెట్టుకోవాల్సి ఉంటుందని, మద్దతు పలికితే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ప్రస్తుతానికి మౌనం దాల్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యురేనియం తవ్వకాలతో మానవాళి మనుగడకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ దేశాలన్నీ గుర్తించిన తర్వాత కూడా విద్యుదుత్పాదన పేరుతో కేంద్రం ముందుకు పోవటం కార్పొరేట్లకు, బహుళ జాతి సంస్థలకు మేలు చేసేందుకేనని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యురేనియం తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా కేంద్రం తనకున్న విస్తృతాధికారాలతో తవ్వకాలు జరుపుతుందనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిన అవసరం సీఎంకు ఉన్నదని వారంటున్నారు. యురేనియం తవ్వకాలపై ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఒక నివేదికను సీఎంకు అందచేశారు. అయినప్పటికీ సీఎం ఇప్పటి వరకూ కేంద్రానికి ఎటువంటి లేఖను రాయలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో రహస్య బంధాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ సమాచార హక్కు సవరణ బిల్లు సహా వివిధ కీలక బిల్లుల విషయంలో మోడీకి సహకరించింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకునే అవకాశం లేదని సీఎం స్వయంగా పార్టీ నేతలతో అన్నట్టు తెలిసింది. రాజకీయంగా తమ మనుగడకు ఇబ్బంది లేనంత వరకూ కేంద్రాన్ని వ్యతిరేకించాల్సి అవసరం లేదనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్త మవుతున్నది. అందుకే దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగినా, రాష్ట్రాల హక్కులకు నష్టం వాటిల్లినా కేసీఆర్ నోరు మెదపలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలో ఎటువంటి తేడా లేక పోవటం విశేషం. ఆర్థిక ప్రయోజనాలు, అధికారం ముఖ్యమైనప్పుడు ప్రజా ప్రయోజనాల పేరుతో కేంద్రంతో వైరం పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేననే అభిప్రాయం టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉన్నది. యురేనియం తవ్వకాలతో నల్లమలలో పులులు, ఇతర జీవరాసుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, ఆదిమ గిరిజన తెగకు చెందిన చెంచులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని, కృష్ణా జలాలు విషతుల్యంగా మారి పోతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరించిన నేపధ్యంలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం ఒక్క రోజులో వెలువడినది కాదని అందరికీ తెలుసు. యురేనియం తవ్వకాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ అడవులు,వన్యప్రాణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ముందుకు పోవటం సాధ్యం కాదని అధికారులంటున్నారు. యురేనియం సర్వే, తవ్వకాలకు సంబంధించిన ప్రతిపాదనలు 2003 నుంచే ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు యురేనియం సర్వే ప్రతిపాదనలను కేంద్రం పంపించింది. దీనికి ఆయన అనుకూలంగా వ్యవహరించటంతో అప్పటి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రాజశేఖరరెడ్డి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత యురేనియం తవ్వకాలకు పచ్చ జెండా ఊపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే యురేనియం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. నాగార్జునసాగర్, నల్లమల అటవీ ప్రాంతంలో 2016 కు పూర్వమే 50 ప్రదేశాల్లో బోర్లు వేసి డ్రిల్లింగ్ చేశారు. ప్రజా వ్యతిరేకతతో తాత్కాలికంగా వెనకడుగు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యురేనియం అనుమతుల ఫైల్ను ముందుకు నడిపించింది.
కేంద్ర అటవీ సలహా సంఘం అనుమతులతో మళ్లీ తెరపైకి
యురేనియం తవ్వకాల కోసం కేంద్ర ఆటమిక్ మినరల్ డైరెక్టరేట్కు ఇచ్చిన అనుమతులతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో 76, నాగార్జునసాగర్ పరిధిలోని నిడ్గుల్ ప్రాంతంలో 7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం సర్వే, తవ్వకాలు జరిపేందుకు కేంద్ర అటవీ సలహా సంఘం మే 22 న జరిగిన సమావేశంలో గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈ అనుమతుల తర్వాత 4,000 బోర్డు వేయటానికి కేంద్ర అణుశక్తి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది.
రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి…
రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర వన్యప్రాణి రక్షణ బోర్డు నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం సర్వే కోసం 2016 డిసెంబర్ 6 న జరిగిన సమావేశంలో అనుమతులనిచ్చింది. అటవీ సంరక్షణ చట్టంలోని సెక్షన్ 2 కింద లేఖ నంబర్ 594, తేదీ 22.5.2018 ద్వారా రాష్ట్ర అటవీ శాఖ యురేనియం తవ్వకాలకు సంబంధించిన ఫారం సీ ని కేంద్రానికి పంపించింది. నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు 2017లో అనుమతినిచ్చింది. ఈ సంవత్సరం జూన్ 19 లో తాజా ప్రతిపాదనల కోసం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. యురేనియం సర్వే కోసం పూర్తి స్థాయి ప్రతిపాదనలు పంపాలని కోరింది. దీనిపై అటవీ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల వామపక్ష నేతలు సీఎస్ను కలిసినప్పుడు యురేనియం తవ్వకాలపై కేంద్రం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పటం విశేషం.
పోలీస్ పహారాలో నల్లమల..
యురేనియం తవ్వకాలకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభిస్తుంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నల్లమలపై దృష్టి కేంద్రీకరించింది. ఆ ప్రాంతంలో పహారా పెంచింది. కొత్తవారు ఎవరైనా నల్లమలలో అడుగు పెడితే వారి వివరాలు స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు చేరవేస్తు న్నారు. గతంలో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న నల్లమల ప్రాంతంలో యురేనియం వ్యతిరేక పోరాటం పేరుతో మళ్లీ .మావోయి స్టులు ప్రవేశించే అవకాశం ఉన్నదని నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో అక్కడి పోలీసులు పట్టు బిగిస్తున్నారు. యురేనియం సర్వే వివరాలను తెలుసుకునేందుకు నల్లమలకు వెళ్లిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. యురేనియం వ్యతిరేక సమావేశాలకు పోలీసులు అనుమతులనివ్వటం లేదు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతున్నాయి.
(COURTECY NAVA TELANGANA)