- వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించండి..
- హైకోర్టుకు వివేకా కుమార్తె సునీత అభ్యర్థన
- విపక్షంలో ఉండగా సీబీఐ కోసం జగన్ డిమాండ్..
- సీఎం అయ్యాక ఆ ఊసెత్తడం లేదు
- అనేక మంది పాత్రపై సందేహాలున్నాయి..
- హింస జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు
- అయినా ‘కార్డియాక్ అరెస్ట్’పై ప్రచారం..
- అవినాశ్ రెడ్డి సమక్షంలోనే రక్తం తుడిచారు
- నాన్న ఉండగా అటువైపు రాని శంకర్ రెడ్డి..
- ఆరోజు మాత్రమే ప్రత్యక్షమయ్యారు
- రక్తపు మరకలను ఆయనే తుడిచారు..
- పదేపదే సిట్ అధికారుల మార్పు
- అభిషేక్ మహంతి లాంగ్లీవ్ ఎందుకు?..
- ఆరోపణలు కాదు… అనుమానాలున్నాయ్
- సునీత పిటిషన్..
- అమాయకులను ఇరికించి అసలు దోషులను వదిలేస్తారనే సందేహం
అమరావతి : మా నాన్న వివేకానంద రెడ్డి హత్యపై ఎన్నో అనుమానాలున్నాయి. నెలలు గడుస్తున్నా న్యాయం జరగడంలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ఇప్పుడు ఆ ఊసెత్తడంలేదు. పోలీసుల దర్యాప్తు తీరుపైనా మాకు అనుమానాలున్నాయి. దయచేసి ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయండి. లేదా… రాష్ట్ర ప్రభుత్వంతో గానీ, టీడీపీ అధ్యక్షుడితో గానీ ప్రభావితం కాని స్వతంత్ర వ్యవస్థతో దర్యాప్తు చేయించండి’’…. ఇది వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, ప్రముఖ వైద్యురాలు సునీత రాష్ట్ర హైకోర్టుకు చేసుకున్న అభ్యర్థన. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పటికే హైకోర్టును కోరారు. ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు భాస్కర్ రెడ్డి కూడా మంగళవారం ఇదే వినతితో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సంచలనమైన ఆరోపణలు చేశారు.
వివేకా హత్య దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ సిబ్బంది, అధికారులను తరచూ మార్చడం… సిట్-2లో అధికారిగా నియమితులైన అభిషేక్ మహంతీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో అసలు దోషుల్ని వదిలేసి, అమాయకుల్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలతోపాటు ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి తదితరులపై డాక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ చేతగానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ అధ్యక్షుడి చేత ప్రభావితం కాని స్వతంత్య్ర సంస్థ చేత గానీ దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. పిటిషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషన్లో డాక్టర్ సునీత పేర్కొన్న ముఖ్యాంశాలు…
సీఎం అయ్యాక సీబీఐ ఊసెత్తడంలేదు..
అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ ఈ హత్యలో టీడీపీ నేతల హస్తముందని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. నా తల్లి సౌభాగ్యమ్మ, జగన్ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టారు. అది జరిగిన 14 రోజుల తరువాత డీజీపీగా నియమితులైన గౌతం సవాంగ్.. జూన్ 13వ తేదీన సిట్లో కొత్త సభ్యుల్ని నియమించారు. సిట్ 1300 మంది సాక్షుల్ని విచారించింది. అనంతరం జరిగిన పరిణామాల్లో శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యపైనా అనేక అనుమానాలున్నాయి. ఆ తరువాత గత సెప్టెంబరు 2వ తేదీన సిట్ అధికారి అభిషేక్ మహంతి సూచనల మేరకు ఉదయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్రెడ్డిలను విచారించేందుకు సిట్ అధికారులు కడపకు తీసుకుని బయలుదేరారు. కానీ మధ్యలో వారికి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. దాంతో హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని వారిని వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకూ వారిద్దరినీ అధికారులు విచారించకపోవడం దిగ్ర్భాంతి గొలుపుతోంది. ఇక సిట్-2 అధికారి అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఆ తరువాత అక్టోబరు 10వ తేదన కడప ఎస్పీగా కేకేఎన్ అన్బురాజన్ నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో విచారణ నత్తనడకన సాగుతోంది.
గత దర్యాప్తులో సేకరించిన విషయాలను ఆయన పరిగణనలోకి తీసుకోవడమే లేదు. గతంలో సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తూ నా సోదరుడు వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడంతోపాటు గవర్నర్కు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకూ ప్రభుత్వం తరఫున కౌంటర్లు కూడా వేయలేదు. ఆయన సీఎం అయి 8 నెలలవుతున్నా సీబీఐ దర్యాప్తు కోసం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. పోలీసులపై నమ్మకం లేదని ప్రతిపక్ష నేతగా చెప్పిన వ్యక్తి.. స్వయంగా అధికారంలోకి వచ్చాక సిట్ను పునర్వ్యవస్థీకరించకూడదు. ఒకసారి సిట్ ఏర్పాటయ్యాక, ఆ దర్యాప్తుకు అంతరాయం కలిగించకూడదు. అందులోని సభ్యుల్ని మార్చకూడదు. సిట్ సభ్యుల్ని తరచుగా మార్చడానికి గల కారణాలను రాష్ట్రప్రభుత్వం గానీ, డీజీపీ గానీ బహిర్గతం చేయడం లేదు. జగన్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నంత కాలం ఆయన సీబీఐ దర్యాప్తు డిమాండ్ ఇప్పటికీ వున్నట్లే భావించాల్సి వుంటుంది. అలాంటప్పుడు ముఖ్యమంత్రి తాజాగా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో స్పష్టత లేదు. ఈ మొత్తం వ్యవహారాలను పరిశీలిస్తుంటే రాష్ట్ర పోలీసులపై అనుమానాలు రేగుతున్నాయి. అమాయకులను ఇరికించి, అసలైన నేరస్థులను వదిలేస్తారేమోనని సందేహం కలుగుతోంది!
వీరిపై సందేహాలు..
మాకు అందిన, మేం తెలుసుకున్న సమాచారాన్ని బట్టి… ఆ రోజు సంఘటన స్థలం వద్ద ఉన్న పలువురు వ్యక్తులపై అనుమానాలు కలుగుతున్నాయి. అయితే… వారిపై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం లేదు.
వాచ్మన్ రంగయ్య: వివేకానంద రెడ్డిని చివరిగా చూసింది వాచ్మన్ రంగయ్యే. మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు రాజశేఖర్కు ఫోన్ చేసి పులివెందుల ఎప్పుడు తిరిగి వస్తారని రంగయ్య ఆరా తీశారు. ఆ తర్వాత కాల్ చేయలేదని ఖండించారు. అలా కాల్ చేయమని ఎవరు సూచించారు? ఎవరి సూచనలతో ఆయన ఆ కాల్ చేశారు. అక్కడ హింస జరిగినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. గోడ్రెజ్ షెల్ఫ్ స్టీల్ హ్యాండిల్ని కూడా బద్దలు కొట్టారు. మరి ఆ శబ్దం రంగయ్యకు వినిపించలేదా? తనకెలాంటి శబ్దాలు వినిపించలేదని ఎందుకు చెబుతున్నాడు? ఏం జరిగిందో బయటకు చెప్పడానికి భయపడుతున్నాడా? సహజంగా రంగయ్య తక్కువ నిద్రపోతాడు. అతను వేకువజామున 5 – 5.30 గంటల మధ్యలోనే మేలుకొంటాడు. కానీ, సంఘటన జరిగిన రోజు ఉదయం 6 గంటల వరకు నిద్రలోనే ఉన్నాడు. కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, ప్రకాశ్ వచ్చే వరకూ లేవలేదు. ఎందుకలా? వివేకానంద రెడ్డి బాత్రూంలో ఉన్నట్లు మొదటగా గుర్తించింది రంగయ్యే. సహజంగా అతను ఇంట్లోకి వెళ్లడు. ఎవరి సూచనలు లేకుండా పక్క తలుపుగుండా అతను ఎందుకు లోపలికి వెళ్లాడు?
డి.శివశంకర్రెడ్డి: ఈయన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో అతనికి నేరచరిత్ర ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్థానంలో పోటీ చేయాలని భావించారు. 2010లో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో శంకర్రెడ్డి సాంఘిక వ్యతిరేక కార్యాకాలపాలకు వ్యతిరేకంగా వివేకా ధర్నా చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వివేకా బతికుండగా ఆయన ఇంటికి శంకర్ రెడ్డి వచ్చేవారు కాదు. కానీ వివేకా మృతి చెందిన రోజు ఉదయం మాత్రం వివేకా బెడ్రూమ్లోనే ఆయన ఉన్నారు. ఇతరులను లోనికి రానీయలేదు. ఫొటోలు తీసుకోవడానికి అనుమతించలేదు. కానీ ఆ ప్రాంతం శుభ్రం చేయడాన్ని మాత్రం ఆపలేదు. అంటే ఈ పరిణామాల గురించి ఆయనకు తెలిసే శుభ్రం చేయడానికి అనుమతించాడా? వివేకానంద రెడ్డికి హార్ట్ ఎటాక్ అని సాక్షి మీడియా హెడ్ బాలకృష్ణకు రిపోర్ట్ చేశారు. ఆయన ఎందుకలా చెప్పారు? 2016 ఎన్నికల్లో వివేకా స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నారు. అది జరగకపోవడంతో అతను మృతునికి దూరంగా జరిగారు. అతను టీడీపీ నుంచి డబ్బును అనుమతించారు. అంతేగాక వైసీపీ వారు టీడీపీకి ఓటు వేయవచ్చన్న పరిస్థితిని వైసీపీలో కల్పించారు.
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి: సంఘటనా స్థలికి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చేరుకున్న మొదటి కుటుంబీకుడు అవినాశ్ రెడ్డి. శంకర్ రెడ్డి సంఘటనా స్థలిని శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్నారు. దీని నుంచి శంకర్ రెడ్డిని అవినాశ్ రక్షిస్తున్నాడని భావిస్తున్నాం. కడప ఎంపీగా వున్న అవినా్షకు బ్యూరోక్రసీలో ఎంతో పలుకుబడి వుంది.
ఆదినారాయణరెడ్డి: సంఘటన జరిగినప్పుడు ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉన్నారు. వివేకానంద రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆది నారాయణ రెడ్డితో పరమేశ్వర్రెడ్డి కాంటాక్ట్లో వున్నాడు. మార్చి 14వ తేదీ సాయంత్రం శంకర్ రెడ్డి టీడీపీ వారిని కలిశారు. అక్కడ వారేమైనా హత్యకు ప్రణాళిక రూపొందించారా? ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వారు అతనిని రక్షిస్తామన్నారా?
బీటెక్ రవి: 2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాపై బీటెక్ రవి విజయం సాధించారు. రవి విజయానికి శివశంకర్ రెడ్డి సాయం చేశారు. అప్పుడు వారు కలిసి పని చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కోసం పని చేశారు. వివేకా మృతితో వైసీపీ నేతల్ని అరెస్టు చేస్తారు, జిల్లాలో గందరగోళం ఏర్పడుతుందన్నది వారి అభిప్రాయం కావచ్చు.
ఎర్రా గంగిరెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డికి 40 ఏళ్లుగా అత్యంత సన్నిహితుడు. గంగి రెడ్డి వివేకాను 14వ తేదీ రాత్రి 11.15 గంటలకు ఆయన ఇంటి వద్ద వదిలేశారు. ఇల్లు మొత్తం ఆయనకు తెలుసు. ఆ రోజు 7 గంటలకు సంఘటనా స్థలికి వచ్చిన గంగిరెడ్డి…. భార్య, కుమార్తె, అల్లుడు ఫోన్ చేసినా తీయలేదు. అంతేగాక వివేకాది సహజ మరణమని ప్రతి ఒక్కరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తెచ్చాడు. సీఐ సమక్షంలో ఘటనా స్థలిని శుభ్రం చేయడం, మృతదేహం డ్రెస్సింగ్, క్లీనింగ్ వంటి పనులను పర్యవేక్షించాడు. కుటుంబ సభ్యులం లేకుండానే అదే రోజు అంత్యక్రియలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టాడు. వైఎస్ మనోహర్ రెడ్డి చెప్పినందుకే సంఘటన స్థలాన్ని శుభ్రం చేయించాల్సి వచ్చిందని ఆ తరువాత తెలిపాడు.
ఉదయ్ కుమార్ రెడ్డి: వివేకా మృతి గురించి ఉదయ్కు తెలుసని, ఆ రోజు వేకువజామున 3.30 గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన స్నేహితులతో ఆయన తల్లి తెలిపింది. అదే సమయంలో హాస్పిటల్లో పరమేశ్వర్ రెడ్డికి ఒక విజిటర్ ఫోన్లో ఏదో చూపించాడు. ఉదయ్, ఈసీ సురేందర్ రెడ్డి, డి.శివశంకర్ రెడ్డి 14వ తేదీ అర్ధరాత్రి కలిసినట్లుగా రిపోర్టులున్నాయి. శివశంకర్ రెడ్డికి ఉదయ్ సన్నిహితుడు. ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, సతీశ్ రెడ్డి, డాక్టర్ మధులను గత ఆగస్టులో విచారించారు. ఆ తరువాత వైఎస్ అవినాశ్ రెడ్డి, ఈసీ సురేంద్రనాధ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి మంగళగిరిలో డీజీపిని ఎందుకు కలవాల్సి వచ్చింది? కొన్ని అరెస్టులు జరుగుతాయన్న అనుమానంతోనే కలిశారా? ఉదయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ మధుసూధన్ రెడ్డిలను విచారణ కోసం కడప తీసుకెళ్తుండగా కొన్ని ఫోన్లు రావడంతో నందిమండలం నుంచే తిప్పిపంపారు. వారిని అభిషేక్ మహంతి నేతృత్వంలోని సిట్ బృందం ప్రశ్నించకుండా అడ్డుకున్నది ఎవరు?
పరమేశ్వర్ రెడ్డి: ఈయన స్థానిక నాయకుడు. ఆయన భార్య ఎంపీపీ. పరమేశ్వర్ రెడ్డికి నేర చరిత్ర ఉంది. గత ఏడాది మార్చి 13వ తేదీన దినేశ్ నర్సింగ్ హోంలో చేరుతున్నట్లుగా అడ్మిషన్ కార్డు అడిగాడు. అందుకోసం ఆ ఆసుపత్రికి వెళ్లాడు. సాధారణంగా అతను హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకోడు. 14 తేదీ ఉదయం ఛాతీ నొప్పితో సన్రైజ్ హాస్పిటల్లో చేరాడు. వివేకాకు తను సన్నిహితుడినని ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకలా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది? అతనికి ఆ రోజు కొన్ని అస్వస్థత లక్షణాలున్నా మిగిలినదంతా నార్మల్గానే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ఎంఆర్ఐ కూడా తీశారు. కానీ ముఖ్యమైన పని ఉందంటూ సాయంత్రం సమయంలో గంటన్నర బయటకు వెళ్లాడు. అలాంటి స్థితిలో అతనికి అంత ముఖ్యమైన పని ఏముంది? అతను ఆ రోజు అత్యధికంగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. డాక్టర్ వద్దంటున్నా వినకుండా బయటకు వెళ్లి సాయంత్రం 8.30 గంటల సమయంలో మళ్లీ అడ్మిట్ అయ్యాడు. ఆ సమయంలో అతనేం చేశాడు? వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 3.40 గంటల ప్రాంతంలో ఒకరు అతనిని కలిసి సెల్ఫోన్ ఇచ్చారు. ఇది సీసీ టీవీలోనూ నమోదైంది. అతను సెల్ఫోన్లో ఏదో చూశాడు. ఆ ఫోన్ ముందురోజు అతని చేతిలో ఉన్నది కాదు. ఆ తరువాతి రోజు తిరుపతి వెళ్లి మరో ఆసుపత్రిలో చేరాడు.
శ్రీనివాస్ రెడ్డి: ఇతను పరమేశ్వర్ రెడ్డికి చాలా వ్యాపారాల్లో భాగస్వామి. పరమేశ్వర్ రెడ్డి నార్కో అనాలిస్ నుంచి వచ్చాక శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు భిన్న చేతిరాతలతో అతని పేరుతో లేఖ దొరికింది. వివేకా హత్యకు సంబంధించి పోలీసుల వేధింపుల వల్లనే అతను మృతిచెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ వివేకా హత్యకు, శ్రీనివాస్ రెడ్డి మృతికి సంబంధముందని మేం నమ్ముతున్నాం.
వైఎస్ భాస్కర్రెడ్డి: ఇతను వైసీపీ పులివెందుల ఇన్చార్జ్గా ఉన్నారు. ఆయన సన్నిహితుడు శంకర్. 2009లో వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణించినప్పుడు భాస్కర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదించింది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని వివేకా వ్యతిరేకించారు.
వైఎస్ మనోహర్ రెడ్డి: మనోహర్రెడ్డి సూచనలతోనే ఘటనాస్థలిని శుభ్రం చేసినట్లు గంగిరెడ్డి పేర్కొన్నారు. పదింటి రాజశేఖర్ సైతం ఇదే చెప్పారు.
శంకర్ (సర్కిల్ ఇన్స్పెక్టర్): ఉదయం 7.10 గంటలకు శంకర్ ఘటనాస్థలికి వచ్చారు. ఎం.కృష్ణారెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలన్న దానికి అతనే సాక్ష్యం. రాజశేఖర్ రెడ్డి ఫోన్లో చెప్పాకే ఆయన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం ఆయనకు ఎందుకు ఇష్టంలేదు? ఏడు అడుగులు విస్తరించిన రక్తపు మడుగును చూపిస్తూ అది సహజమరణం కాదని షేక్ ఇనయతుల్లా వివరించాడు. అయినప్పటికీ వివేకా కిందపడి మరణించి వుంటాడని శంకరయ్య నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. పక్కనున్న వాళ్లు చెప్పినా అతను వినిపించుకోలేదు.
సురేంద్రనాధ్ రెడ్డి: అవినాశ్ రెడ్డికి బంధువు. ఉదయ్ కుమార్ రెడ్డి, సురేంద్రనాధ్ రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆగస్టు 31వ తేదీన అవినాశ్ రెడ్డి, శివ శంకర్రెడ్డిలతో పాటు డీజీపి కలిశారు. ఆ తర్వాతే దర్యాప్తు నత్తనడకన సాగింది.
సురేంద్ర రెడ్డి: పరమేశ్వర్ రెడ్డి బావమరిది. ఆసుపత్రిలో ఉన్న సురేంద్రరెడ్డి ఫోన్ తీసుకుని ఉదయం 3.40 గంటల ప్రాంతంలో పరమేశ్వర్ రెడ్డికి ఏవో వివరాలు చూపించారు. అదే సమయంలో ఉదయ్ కుమార్ కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ వివరాలు గమనిస్తే హత్య పథకం పూర్తయినట్లు వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రామకృష్ణా రెడ్డి, ఏఎస్ఐ: శివ శంకర్ రెడ్డికి సన్నిహితుడు. దర్యాప్తులో పాల్గొన్న ఏఎస్ఐనే ఆ తర్వాత సాక్షిగా తీసుకున్నారు. ఇదెలా?
ఆరోజేం జరిగిందంటే…
గత ఏడాది మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి మరణించారు. ఆ రోజు నా తల్లి సౌభాగ్యమ్మ చికిత్స కోసం హైదరాబాద్లో నాతోనే ఉన్నారు. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న ఇంట్లో మా నాన్న బస చేశారు. ఆ ఇంటికి 2017 నుంచి రంగయ్య అనే వ్యక్తి వాచ్మన్గా పని చేస్తున్నారు. అతను వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డిల కుటుంబీకులందరికీ సన్నిహితుడే. పదింటి రాజశేఖర్ మా నాన్న నివాసం ఔట్హౌ్సలో ఉండి రోజువారీ కార్యక్రమాలను చూసుకుంటుంటారు. వంటమనిషి లక్ష్మి అలియాస్ లక్ష్మమ్మ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వచ్చి వంట చేసి, ఆహారం సిద్ధం చేసి తన ఇంటికెళ్లిపోతుంది. ఆమె కొడుకు ప్రకాశ్ ఆమెను మోటార్ సైకిల్పై తీసుకొచ్చి, మళ్లీ తీసుకెళ్తుంటాడు. స్థానిక కాలేజీలో అసిస్టెంట్ లైబ్రేరియన్గా పని చేస్తున్న ఎంవీ కృష్ణారెడ్డి మా నాన్నకు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తుంటారు. ఆయన ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు మా ఇంటికి వచ్చి మా నాన్నకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటారు. మా నాన్న వాహన డ్రైవర్ ప్రసాద్. షేక్ ఇనయతుల్లా 15 ఏళ్లుగా మా నాన్నకు టైపిస్టుగా, క్లర్కుగా, పీఏగా వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజూ వేకువజామునే వచ్చి పనులు చూసుకుంటారు. 15వ తేదీ ఉదయం 5.50కి ఎంవీ కృష్ణారెడ్డి మా అమ్మకు ఫోన్ చేశారు. మా నాన్న ఉంటున్న ఇంటి ప్రధాన ద్వారం తెరవలేదని, ఆయన ఇంకా నిద్రపోతున్నారని చెప్పారు. దాంతో ఆయన రాత్రి పొద్దుపోయి వచ్చినందున మరికొంత సేపు నాన్నను పడుకోనివ్వాలని మా అమ్మ చెప్పింది. మళ్లీ 6.15కి నా భర్తకు ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి నాన్న బాత్రూమ్లోని రక్తపుమడుగులో పడి ఉన్నారని, చనిపోయారని చెప్పారు. నా భర్త ఉదయం 6.19 గంటలకు పదింటి రాజశేఖర్కు ఫోన్ చేసి ఏం జరిగిందని విచారించారు. అయితే… తను పులివెందులలో లేనని, 14వ తేదీన చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్లానని చెప్పారు. దాంతో నా భర్త 6.23 గంటలకు షేక్ ఇనయతుల్లాకు ఫోన్ చేసి విచారించారు. తను అప్పుడే నమాజ్ పూర్తి చేసుకుని నాన్న వద్దకు బయలుదేరుతున్నానని, ఈ లోపు ఆయన మృతి గురించి నా భర్త సోదరుడు ఎన్.శివప్రకాశ్ రెడ్డి తెలియజేశారని చెప్పారు. 6.26 గంటలకు అదే విషయాన్ని ఎన్.శివప్రకా్షరెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి కూడా సమాచారం అందించారు. ఇనయతుల్లా కంటే ముందుగా అవినాశ్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడకు పలువురు చేరుకున్నారు. బాత్రూంలో వున్న రక్తపు మరకల్ని శుభ్రం చేశారు. వైఎస్ ప్రకాశ్ రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ ప్రతా్పరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య తదితరుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఉదయం 7 గంటలకు ఓ తెలుగు చానల్లో కార్డియాక్ అరెస్టుతో మా నాన్న చనిపోయినట్లు స్ర్కోలింగ్ వచ్చింది. ఇది హత్య అని అందరికీ స్పష్టంగా తెలుసు. అయితే… కార్డియాక్ అరెస్టు కారణంగా జరిగిన మృతిగా చిత్రీకరించడం దిగ్ర్భాంతి గొలుపుతోంది. ఆ తరువాత ఈ సంఘటనపై రాజకీయ ఆధిపత్యం కోసం అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి.
సీబీఐకి ఇవ్వడానికి మీకేం అభ్యంతరం: హైకోర్టు
వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరమేంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేగాక ఈ కేసు వ్యవహారంలో కిందికోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయబోమని గత విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీ గడువును పొడిగించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐకి కేసు అప్పగించడానికి ఏం అభ్యంతరముందని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ.. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని తెలిపారు. ప్రస్తుతం విచారణ సాఫీగా సాగుతోందని వివరించారు. కాగా పిటిషన్లలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ కార్యదర్శి తదితరులకు మళ్లీ నోటీసులు జారీ చేశారు.
Courtesy Andhrajyothi