కారంచేడులో దళితుల్ని బరిసెల్తో పొడిచి చంపిన వాళ్లకి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని దళిత ఉద్యమానికి తెర తీస్తున్నామన్న సంగతి, హవ్వ! సుతరామూ తెలీదు.
అమెరికాలో నడిరోడ్డు మీద జార్జి ఫ్లాయిడ్ మెడ మీద మోకాలు పెట్టి ఊపిరితీస్తున్న పోలీసు అధికారికి నల్లజాతి మహోద్యమానికి పిలుపు ఇస్తున్నానన్న సంగతి అస్సలు తెలీదు.
1968. డిసెంబరు 25. తమిళనాడు
తంజావూరు జిల్లాలోని కీలవేణ్మని గ్రామం. వ్యవసాయ కూలీలైన దళితులందరినీ మార్క్సిస్టు పార్టీ ఆర్గనైజ్ చేసింది. కూలిరేట్లు పెంచమని అడిగారు. దిక్కున్న చోట చెప్పుకోండి అన్నారు భూస్వాములు. గొడవలు జరిగాయి. దళితుల యిళ్లపై ఎర్రజెండాలు… భూస్వాముల ఇళ్లపై పసుపు జెండాలు! క్రిస్ట్ మస్ రోజు రాత్రి 10 గంటలకి
200 మంది గూండాలు భూస్వాములు
గ్రామం మీదికొచ్చారు. కూలి జనాన్ని
తరిమి తరిమి కొట్టారు. భయపడి దళితులు
ఒక యింట్లో దాక్కున్నారు. గూండాలు ఆ యింటిని తగలబెట్టారు. గడ్డీ, ఎండు కట్టెలూ వేయడంతో మంటలు ఎగసి పడ్డాయి. 44 మంది దళితులు సజీవ దహనం అయిపోయారు. ఇద్దరు పిల్లలు బైటికి వస్తే వాళ్లని పట్టుకుని మంటల్లోకి విసిరేశారు. ఆరుగురు పెద్దవాళ్లు పరిగెత్తివస్తే, దొరికిన యిద్దర్నీ నరికి అగ్నిలోకి తోసేశారు. ఐదుగురు మగవాళ్లూ,
16 మంది ఆడవాళ్లూ, 23 మంది పిల్లలూ ఆహుతి అయిపోయారు. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై. 1970లో కేసు నడిచింది. హత్యాకాండకి కారణమైన భూస్వాముల నాయకుడు గోపాలకృష్ణ నాయుడుకి కింది కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. మద్రాసు హైకోర్టు 1975లో ఆ శిక్షను రద్దు చేసింది.
1980లో గోపాలకృష్ణ నాయుణ్ణి నరికి చంపేశారు.
తమిళనాట దళిత ఉద్యమం నీలి కెరటాలై ఎగిసిపడింది.
1977 మే నెల 27 రాష్ట్రం బీహార్, పాట్నాజిల్లా, బెల్చీ గ్రామం.
షరా మామూలే. అటు వాళ్లూ… ఇటు వీళ్లూ…
రెచ్చిపోయిన భూస్వాములు పదకొండు మందిని క్రూరంగా నరికి చంపేశారు. అందులో ఎనిమిది మంది దళితులు. ముగ్గురు కంసాలి వాళ్లు. జనతా పార్టీ జోకర్ల పాలన సాగుతున్న రోజులవి. రాజకీయ కొలిమిలో రాటుదేలిన ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకురాలిగా వున్నారు. బెల్చీ దారుణం విన్న వెంటనే ఢిల్లీ నుంచి బయల్దేరారు. విమానంలో పాట్నా వచ్చారు. పెద్ద కారులో బెల్చీ బయల్దేరారు. కారుని ఒక చోట ఆపారు. కుగ్రామం బెల్చీకి కారు వెళ్లే రోడ్డు లేదు. కారు దిగి నించున్నది ఇందిరాగాంధీ. ఆమెని ఎడ్లబండి మీద తీసికెళ్లాలా? అసాధ్యులైన కొందరు కాంగ్రెస్ నాయకులు కూడబలుక్కుని ఒక ఏనుగుని రప్పించగలిగారు. తెల్లచీర, తెల్లజాకెట్టుతో వున్న ఇందిరాగాంధీ ఆ నల్లటి ఏనుగు ఎక్కారు. బెల్చీ చేరుకున్నారు. పరుగు పరుగున వచ్చిన దళితుల్ని అక్కున చేర్చుకుని అప్యాయంగా పలకరించి, హామీలిచ్చి రాజకీయ డ్రామా పతాక సన్నివేశాన్ని సహజ నటనతో ఇందిరాగాంధీ పండించారు. మర్నాడు దేశంలోని అన్ని దినపత్రికలూ ఏనుగు మీద వెళ్తున్న ఇందిర ఫోటోలని మొదటి పేజీల్లో ప్రచురించాయి. బెల్చీ జాతీయ సమస్యగా తలెత్తుకు నిలబడింది.
1980లో జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా దళితులు వోట్లు గుద్దిపారేశారు. 357 లోక్ సభ సీట్లతో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. కొన్ని గొర్రెలో, బర్రెలో కొద్దిపాటి బ్యాంకు రుణమో పొందిన దళితులు ఈ దేశంలో అణగారిన వారిగా, అడుక్కు తినే వాళ్లుగానే మిగిలిపోయారు.
దళితులపై ఎక్కడన్నా దారుణ హత్యాకాండ జరిగితే, దాని ప్రభావం అనూహ్యంగా వుంటుందని చెప్పడానికి యిదే వుదాహరణ. ఇందిర మళ్లీ ప్రధాని కావడంలో బెల్చీదే ప్రధాన పాత్ర అని అప్పటి పత్రికలు రాశాయి.
నేటికి 35 సంవత్సరాల క్రితం….
1985, జూలై, కారంచేడు… ప్రకాశం జిల్లా.
ఒక రకంగా చూస్తే మన దళితులు అదృష్టవంతులేమో అనిపిస్తోంది నాకు. దళితులు ఎవర్ని అయితే దూషించారో, శత్రువులని ద్వేషించారో వాళ్లే దళిత ఉద్యమానికి పునాది
రాళ్లు వేయడం! Is it irony? A Paradox?
Or poetic justice?
కమ్మ దురహంకారం కన్నీటి కారంచేడుని ఆవిష్కరిస్తే, మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టు నెత్తురోడుతున్న చుండూరుని రెడ్లు తమ వంతు బహుమానంగా యిచ్చారు. ఇంటిపేరులోనే తప్ప చేతుల్లో ఏమీ లేని మాల పద్మారావుకి కత్తినీ, డాలునీ వాళ్లే సమకూర్చారు. పంటలతో, పారే కాల్వలతో అపార ధనరాశులతో తులతూగే కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఇపుడు ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల్ని విస్మరించి బతికి బట్టకట్టలేదు.
అగ్రకుల అహంకారం అణగారిన వాళ్లకి అమృతంగా మారిన చారిత్రక సన్నివేశాన్ని నేను కళ్లారా చూశాను.
అక్టోబరు 6న విజయవాడ నడిబొడ్డున లక్ష మందికి పైగా హాజరైన సభలో దళిత మహాసభ కన్వీనర్ కత్తిపద్మారావు తుఫాన్ లా చెలరేగిపోతూ చేసిన ప్రసంగాన్ని జనం సంభ్రమాశ్చర్యంతో విన్నారు. అప్పటికి బలమైన నిర్మాణం వున్న సి.పి.ఐ, సి.పి.ఎంలు మాత్రమే విజయవాడలో అంత పెద్ద సభ ఆర్గనైజ్ చెయ్యగలవు. ఒక్క పద్మారావు, ఒక్క దళిత మహాసభ ఆ పనిని సులువుగా చేయగలిగాయి. ‘జై భీమ్’ నినాదంతో కమ్యూనిస్టు కోట దద్దరిల్లింది.
కారంచేడు – కమ్యూనిస్టు కోణం
కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానమే కారంచేడు!
1985 జూలై17న కారంచేడు దళితులపై నరమేధం జరిగి నేటికి 35 ఏళ్లు. దళిత సమస్య మానవ హక్కుల సమస్య అని, ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటం దళితుల జన్మహక్కని ఆనాటి కారంచేడు సంఘటన ఎలుగెత్తి చాటింది. నిప్పురవ్వ దావానాలమై వ్యాపించినట్లు దళిత ఆత్మగౌరవ పోరాటం సామాజిక న్యాయ, రాజ్యాధికార పోరాటంగా అభివృద్ధి చెందటమే గాక కులాతీత ఆదర్శవాదుల అవకాశవాదాన్ని కూడా బట్ట బయలు చేసింది. “కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానాలు కావాలి” – కొత్త సమాధానాలు నూతన సిద్ధాంతాలకు ప్రేరణ కావాలి అనే సిద్ధాంత చర్చను దేశవ్యాపితంగా ఎజెండా మీదకు తెచ్చింది.
కులమంటే కుళ్లురా! మతమంటే మత్తురా! కులం కాదు, మతం కాదు కూడు గుడ్డ కావాలి అనే ఆర్ధిక నిర్ణాయక వాదంతో మార్క్సిజాన్ని కుల ప్రమేయం లేని వర్గ కుదింపు వాదం (క్లాస్ రిడక్షనిజం)గా మార్చిన బ్రాహ్మణీయ మూస మార్క్సిస్టులకు ఈ సిద్ధాంత చర్చ కంటగింపుగా మారింది. “కారంచేడు మొదలూ కాదు, నీరుకొండ చివరా కాదు” ఇలాంటి సంఘటనలు జరుగుతూనేవుంటాయి, వీటిని పట్టించుకొంటే వర్గపోరాటం పక్కదారి పడుతుందంటూ సాంప్రదాయ కమ్యూనిస్టు నేతలు కులపలాయన వాదాన్ని ఆశ్రయించారు. వర్గకోణంలో కులాన్ని చూసే వర్గ దృక్కోణంతో కుల అస్థిత్వ ప్రాతిపదికపై దళితులు ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటానికి తలపడటం “సిద్ధాంత పరంగా తప్పు, ఆచరణ పరంగా ముప్పు” అని ఎదురు పాఠాలు చెప్పారు. దళిత సమస్య పరిష్కారానికి బుద్ధ, ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానం పనికి రాదని, కుల ప్రమేయం లేని కుల వ్యతిరేక వర్గ పోరాటమే ఏకైక మార్గం అని పునరుద్ఘాటించారు. “కారంచేడు హరిజనులపై భూస్వాముల దాడి” అనే శీర్షికతో ఒకానొక విప్లవ సంస్థ ఆ సందర్భంలో ఓ కరపత్రం ప్రచురించింది. ఆనాడు అదే విప్లవ సంస్థలో పనిచేసిన ఈ వ్యాస రచయిత, ఓపిడిఆర్ హక్కుల సంఘంలో పనిచేసిన కంచ ఐలయ్యలు అదే సంఘటనపై అదే సమయంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీ తరపున మరో కరపత్రం రూపొందించారు. దానికి “కారంచేడు దళితులపై కమ్మ భూస్వాముల దాడి” అని శీర్షిక పెట్టారు. ఆ విప్లవ సంస్థ అధినాయకులు రూపొందించిన కరపత్రానికి ఈ కరపత్రం భిన్నంగా ఉండటంతో ఆ భిన్నత్వం వివాదంగా మారింది. కుల ప్రమేయం లేని కులాతీత వర్గపోరాట సాంప్రదాయ దృక్పధానికి భిన్నంగా “కమ్మ” భూస్వాములు అంటూ కమ్మ కుల ప్రస్తావన తేవటం సాంప్రదాయ విరుద్ధం అని వారు తప్పు పట్టారు.
కారంచేడు గ్రామ పరిధిలో జరిగిన ఒకానొక ఘటనలో కమ్మకులస్తులు దాడికి పాల్పడినంత మాత్రాన దళితులపై కమ్మ కులస్తుల దాడి అని జనరలైజ్ చేసి రాస్తే రాష్ట్రంలోని కమ్మ కులస్తులంతా తమ విప్లవ సంస్థకు దూరం కారా? అని కమ్మ వారి తరపున వకాల్తా పుచ్చుకొని వాదించారు. కారంచేడు దళితులపై నరమేధానికి పాల్పడిన కమ్మ అగ్రకుల శక్తుల దురహంకారాన్ని ఖండించకుండా దాటవేస్తే మరి దాడికి గురైన దళిత పీడితులు ఆ విప్లవ సంస్థకు దూరం కారా? అని ప్రశ్నిస్తే వారినుండి సమాధానం లేదు. దళితులు దూరమైనా ఫర్వాలేదు గాని, కమ్మ వాళ్ళను దూరం కాకుండా కాపాడుకోవటమే ముఖ్యమని భావించిన సోకాల్డ్ కమ్మ విప్లవ నాయకుల అగ్రకుల పక్షపాతం కారంచేడు ఘటన సందర్భంగా ఆ విధంగా బైటపడి పోయింది. అప్పటి దాకా వారు వల్లిస్తూ వచ్చిన కులాతీత ఆదర్శవాదం అగ్రకుల అవకాశవాదమేనన్న సంగతి ఆచరణలో అర్థం కావటంతో అధినాయకుల అభిప్రాయానికి భిన్నంగా ఉసా, కంచ ఐలయ్యలు అంటారని కులాలకు చెందిన దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని బహిరంగంగా బలపర్చే వైఖరి తీసుకోవటం జరిగింది. ఈ బిన్న వైఖరుల వివాదం, కులాతీత వర్గ పోరాటమా? కుల – వర్గ జమిలి పోరాటమా? అనే అంతర్గత సిద్ధాంత చర్చకు దారి తీసి 1987లో ఈ వ్యాస రచయితని విప్లవపార్టీ నుండి, కంచ ఐలయ్యను ఓపిడిఆర్ నుండి తొలగించడం జరిగింది.
కానీ ఈ సిద్ధాంత చర్చ కొందరు వ్యక్తులపై వేటు వేయటంతో ఆగలేదు. విప్లవ పార్టీ అంతర్గత సిద్ధాంత చర్చ బహిరంగ సిద్ధాంత చర్చగా మారింది. అమరుడు కెజి సత్యమూర్తితో కలిసి, ఈ వ్యాస రచయిత 1989లో స్థాపించిన ఎం.ఎల్ సెంటర్ (ఎదురీత) ఈ సిద్ధాంత పోరాటానికి సారధ్యం వహించింది. అంతే కాదు చుండూరు నరమేధం జరిగిన సందర్భంలో “సమతా వాలంటీర్స్ ఫోర్స్”ని నిర్మించి, దళిత ఆత్మగౌరవ పోరాటానికి ‘ఆత్మరక్షణ – ప్రతిఘటనా’ పోరాటాన్ని జోడించటంలో చారిత్రాత్మకపాత్ర నిర్వహించటం జరిగింది. అలా కారంచేడు నుండి లక్షింపేట దాక, నవ తెలంగాణలో పాతపల్లి(ఆలయప్రవేశం కారణంగా)సాంఘిక బహిష్కరణ నుండి నర్సాపూర్ సామూహిక దాడిదాకా దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటంలో క్రియాశీలంగా పాల్గొనటం జరుగుతోంది.
చారిత్రక నేపధ్యం : 1972లోనే మహారాష్ట్రలో “దళిత ఫాంథర్స్” ఉద్యమం ప్రారంభమైనా 1985 జూలై 17 నాటి కారంచేడు సంఘటనే ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమానికి నాంది పలికింది. ఆ సందర్భంగా శ్రీయుతులు కత్తి పద్మారావు, బొజ్జా తారకం అధ్యక్ష, కార్యదర్శులుగా ఏర్పడిన “దళిత మహాసభ” ఆ ఉద్యమానికి సారధ్యం వహించి ఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ చరిత్రను మలుపు తిప్పింది. “కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానాలు కావాలి?” అంటూ పాత సాంప్రదాయ దృక్పథంతో చెప్పే సమాధానాల్ని తిరస్కరించే నూతన దళిత సిద్ధాంత పోరాటానికి కూడా ఆనాటి కారంచేడు సంఘటనే నాంది పలికింది. ఫలితంగా విప్లవ, కమ్యునిస్టు సంస్థలు సాంప్రదాయ దృక్పధంతో కొన్ని సంస్కరణలు చేపట్టక తప్పలేదు. ఉదా. ఒకానొక విప్లవ సంస్థ ప్రజాస్వామిక శక్తులను సమీకరించి “ బలహీన వర్గాల సమాఖ్య” ఏర్పాటు చేసింది. దళితులపై దాడులకు పాల్పడిన అగ్రకుల భూస్వామ్య శక్తులను శిక్షించి గుణపాఠం చెప్పింది. బలహీన వర్గాల సమాఖ్యలో కుల ప్రస్తావన లేదని ఆరోపణలు రావటంతో దళిత శక్తులతో “ కుల నిర్మూలనా పోరాట సమితి”ని స్థాపించిది. దళితులకి, దళిత ఆత్మగౌరవ పోరాటానికి పరిమితమైన దళిత సంస్థలు కుల సంకుచిత సంస్థలని, తమ కుల నిర్మూలనా సంస్థ దళిత విముక్తిని సాధించే ఉన్నత లక్ష్యం కలిగిన సంస్థ అని చెప్పుకొనే ప్రయత్నం చేసింది. మరొక విప్లవ సంస్థ తన శ్రేయోభిలాషులను సమీకరించి ‘డెఫోడమ్’(డెమోక్రటిక్ ఫోరమ్ ఆఫ్ దళిత్స్ అండ్ ముస్లిమ్స్) సంస్థను స్థాపించింది. అలాంటి కుల మత సంస్థలను స్థాపించడం విప్లవ సాంప్రదాయ వాదానికి విరుద్దమని ఒక వర్గం ఆ విప్లవ సంస్థని తప్పుపట్టి తన దారి తను చూసుకుంది. డఫోడమ్ ను స్థాపించిన విప్లవ సంస్థ నుంచి రాడికల్ గా ముందుకొచ్చి, కుల- వర్గ జమిలి పోరాట దృక్పధంతో మారోజు వీరన్న సీపీయుఎస్ఐ( దళిత బహుజన శ్రామిక విముక్తి)ని స్థాపించినా ఆనతి కాలంలోనే ఆ సంస్థని, ఆ సంస్థ నాయకత్వాన్ని ఈ కౌటిల్య రాజ్యం అణచివేసింది. ఇక వామపక్ష కమ్యూనిస్టు పార్టీల్లో సి.పి.ఐ దళిత సామాజిక ప్రజావేదికలను ఏర్పాటుచేస్తే, సిపిఎం తన కులాతీత కుహనా ఆదర్శవాదాన్ని కొంత సంస్కరించుకొని “కుల వివక్షా వ్యతిరేక పోరాట సమితి”ని స్థాపించింది. గతంలో నిర్మించిన గీత, నేత కార్మిక సంఘాల కోవలో ఆర్థిక దృక్కోణంతో వివిధ కుల వృత్తి సంఘాలను కూడా స్థాపించింది.
మరోవైపు అస్పృశ్య కుల ప్రాతిపదికపై దళితులు చేపట్టిన “ ఆత్మగౌరవ పోరాటం అంతం కాదు ఆరంభం” అని, సామాజికన్యాయం, రాజ్యాధికారం, కుల నిర్మూలన దాని కొనసాగింపు అని చాటి చెప్పిన దళిత ఉద్యమం కేవలం కుల సంకుచిత ఉద్యమం కాదు అని నిరూపించబడింది. అంతేకాదు విప్లవోద్యమంలో నిప్పురవ్వ దావానలంగా మారిన నక్సల్బరికి ఎంతటి చారిత్రక ప్రాధాన్యత ఉందో సామాజిక విప్లవోద్యమంలో కారంచేడుకు కూడా అంతే చారిత్రక ప్రాధాన్యత ఉందని నొక్కి చెప్పింది. దళిత ఆత్మగౌరవ పోరాట నిప్పురవ్వ దళిత వెనుకబడిన వర్గాల బహుజన సామాజిక(న్యాయ) ప్రజాస్వామ్య రాజకీయ శక్తిగా మారి దావానలమైందని నిరూపించబడింది. కానీ కులంతో పాటు, వర్గం జమిలిగా ఉన్న ఈ దేశ కుల వర్గ వ్యవస్థలో బ్రాహ్మణిజంతో పాటు క్యాపిటలిజాన్ని కూడా తుదముట్టించే ఉమ్మడి లక్ష్యం లేకపోవటం, సామాజిక న్యాయ సామ్యవాద ఆశయ సాదనకు తోడ్పడే కుల – వర్గ సమగ్ర సామాజిక విప్లవ దృక్పధం లేక పోవటంతో దాని పరిమితుల్ని అది ఎదుర్కొంటున్నది.
అలాగే ఈ35 ఏళ్ళ కాలంలో విప్లవ సంస్థలు, వామపక్ష కమ్యూనిస్టు సంస్థలు చేపట్టిన సంస్కరణలు సాంప్రదాయ పరిధి దాటని నయా సాంప్రదాయ వాద ఎత్తుగడల వైఖరికి పరిమితమైనాయి తప్ప ఇంతవరకు మౌలికమైన సామాజిక న్యాయ ప్రజాస్వామ్య విప్లవ సిద్ధాంతాన్ని స్వీకరించలేదు. “ నక్సల్బరి రివిజనిజంపై పోరాడింది.! కారంచేడు బ్రాహ్మణిజంపై పోరాడమంది.” అని ఆనాడు ఎం.ఎల్. సెంటర్ (ఎదురీత) తరపున ఈ వ్యాస రచయిత ఇచ్చిన చారిత్రాత్మక నినాదాన్ని ఇంత వరకు ఏ కమ్యూనిస్టు విప్లవ సంస్థ స్వీకరించలేదు. మారోజు వీరన్న సారధ్యంలో స్థాపించిన విప్లవ సంస్థ స్వీకరించినా ఆ సంస్థను బతకనివ్వలేదు. ఈ దేశ ప్రజల్ని పట్టి పీడిస్తున్న బ్రాహ్మణిజాన్ని తుద ముట్టించే లక్ష్యాన్ని, విప్లవ సంస్థలు తమ విప్లవ లక్ష్యాల్లో చేర్చుకోకుండా ఈ దేశంలో దళిత విముక్తిని కాని, శ్రామిక విముక్తిని కాని సాధించలేము. “ఈ దేశ శ్రామిక పీడిత ప్రజలకు క్యాపిటలిజం వర్గ శత్రువు బ్రాహ్మణిజం కుల శత్రువు” అని నొక్కి చెప్పిన అంబేద్కర్ ప్రకారం ఏక కాలంలో ఈ రెండింటిని తుద ముట్టించే కుల – వర్గ జమిలి పోరాటాన్ని నిర్మించి, కుల – వర్గ రహిత సమ సమాజాన్ని స్థాపించేదాకా దళిత బహుజన శ్రామిక వర్గ విముక్తిని సాధించటం అసాధ్యం. 35 ఏళ్ళ నాడు ఆత్మగౌరవ పోరాటం కోసం రక్త తర్పణ చేసిన కారంచేడు దళిత మృతవీరుల స్ఫూర్తితో బుద్ధ, ఫూలే, అంబేద్కర్ సమగ్ర ఆలోచనా విధానాన్ని ఇప్పటికైనా స్వీకరిద్దాం. 1920లో ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 2020నాటికి 100 సం.. నిండిన శతవార్షిక సందర్భంలోనైనా ఈ దేశంలో మార్క్సిజాన్ని కులేతర వర్గ కుదింపు వాదంగా మార్చిన సాంప్రదాయ మార్క్సిస్టుల అసమగ్ర దృక్పధాన్ని మార్చుకొని కుల- వర్గ జమిలి పోరాట విప్లవ కార్యాచరణకు పూనుకొందాం.
ఉసా
కారంచేడులో మాదిగ శక్తి
ప్రజాయుద్ధానికి శ్రీకాకుళం ఎలాగో, దళిత పోరాటాలకు కారంచేడు అలా… ఒక చారిత్రక గుర్తు.
ప్రకాశం జిల్లాలో చీరాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో వుంది కారంచేడు. అది 16 వార్డులున్న పెద్ద పంచాయితీ గ్రామం. అందులో ఎనిమిది వార్డుల్లో కమ్మవారే వున్నారు. మిగిలిన 8 వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్లున్నారు. 16వ వార్డులో అంతా దళితులే. అక్కడ రజకులు, యాదవులు, మంగలివాళ్లూ, ఉప్పర్లు, ముస్లింలు, చుండు నాయకులు. ఎరుకల, యానాదులతోపాటు మాల మాదిగలూ వున్నారు. వేల ఎకరాలు భూస్వాముల చేతుల్లో వున్నాయి. వందల ఎకరాలున్న కమ్మవారే పెత్తందార్లు. దగ్గుబాటి, యార్లగడ్డ, చాగంటి, పేర్ని, పూవాటి, మండా వంటి ఇంటి పేర్లతో వాళ్లదే ఆధిపత్యం!
కమ్మవారి దొడ్లతో జీతానికి చాకిరీ చేసే వాళ్లని హీనంగా చూసేవాళ్లు. పనివాళ్లని కొట్టడం, ఎప్పుడైనా చంపడం కూడా అక్కడ అసహజం కాదు. ఎదురు తిరిగిన ఉప్పర్ల (బీసీలు)ని ఒక సారి కొట్టారు. కూలిరేట్ల కోసం జనాన్ని కూడగడుతున్న చుండు నాయకుల్లో ఒకడైన వెంకటేశ్వర్లుని కొట్టారు. అతను పారిపోయి మాదిగ పల్లెలో దాక్కున్నాడు. ‘మాకు వాణ్ణి అప్పజెప్పాలి’ అన్నారు కమ్మ పెద్దలు. ‘మేం రక్షిస్తాం’ అన్నారు మాదిగలు. మాదిగ పల్లెని ఎదిరించలేక వెనుదిరిగారు. మాలపల్లెపై కమ్మవారు దాడి చేసినప్పుడూ మాదిగలు అండగా నిలిచారు. మాదిగపల్లె మీద కక్ష పెంచుకున్నారు. ఒక్క కుటుంబమే నాలుగు వందల కుటుంబాలుగా విస్తరించిన మాదిగ పల్లె అది. తేళ్ల, దుడ్డు ఇంటి పేర్లు గలవాళ్లే ప్రధానంగా వున్నారు. వ్యవసాయ కూలీకి మాత్రం వాళ్లు కమ్మవారి మీదే ఆధారపడి వున్నారు. పొగాకు, పత్తి వంటి వ్యాపార పంటలూ పండిస్తారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య, పోలీసు రెవెన్యూ వ్యవస్థలు ఆయన కొమ్ము కాసేవి. కమ్మ కుర్రాళ్లు దళిత స్త్రీలని టీజ్ చేయడం చాలా సాధారణం. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో వున్న భూస్వాములు ఎన్టీఆర్ రాకతో తెలుగుదేశంలో చేరిపోయారు. దళితులు మాత్రం కాంగ్రెస్ తోనే వున్నారు. ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ కి వోట్లు వేస్తుండటంతో కమ్మ వాళ్లు గొడవపడ్డారు. దళితులు ఎదురుతిరిగారు. కర్ర తిప్పడంలో నైపుణ్యం గల కండలు తిరిగిన యోధులు మాదిగలకు వున్నారు. వాళ్లలో మాదిగ పెద్ద యోహోషువా ఒకరు. ఆత్మాభిమానం గల మనిషి. ఎన్నికల గొడవల్లో మాదిగ శక్తికి జడిసి, వెనక్కి తగ్గిన కమ్మవాళ్లు దెబ్బతీయాలన్న కసితో వున్నారు.
1985 జూలై 16న పోతిన శీను, రాయినీడు ప్రసాద్ అనే కమ్మ యువకులు మాదిగవాడలోని మంచినీటి చెరువుకి గేదెలను తోలుకెళ్లారు. వాటికి కుడితి పెట్టి, ఆ కుడితినీళ్లు బక్కెట్లని చెరువులో కడిగారు. అలా చెయ్యకండని చెప్పాడు వికలాంగుడైన దళితుడు కత్తి చంద్రయ్య. అతని మీద కమ్మ యువకులు దాడి చేయబోతుండగా, నీళ్ల కోసం వచ్చిన మున్నంగి సువార్త వాళ్లను అడ్డుకుంది. వాళ్లు చర్నాకోల విసిరారు. ఆమె బిందె అడ్డం పెట్టింది. ఒక మాదిగ ఆడది మన మీద బిందె ఎత్తడమా?
కమ్మ కులాధిపత్యం బీటలు వారినట్టే…
ఎదురుదెబ్బ తియ్యాల్సిందే.
ఆ రాత్రే కారంచేడు కమ్మ పెద్దలు సమావేశం అయ్యారు. ఎలా? ఎప్పుడు? ఏ రకంగా? అనే కీలక అంశాలపై చర్చించారు. దళితులు ఇక ఎప్పటికీ మరిచిపోకుండా చావు దెబ్బతియ్యాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. మారణాయుధాల సేకరణ మొదలైంది. మర్నాడు ఉదయం ఆ గ్రామంలో ఏం జరిగింది?
కారంచేడు కండకావరం : ఎ.బి.కె
ఉదయం దినపత్రిక ప్రారంభమై అప్పటికి ఆరు నెలల 15 రోజులు అయింది. బందరు రోడ్డులోని విజయవాడ ఎడిషన్లో పనిచేస్తున్నాను. ఎడిటర్ ఎ.బి.కె ప్రసాద్, మా న్యూస్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి. ఆయన తర్వాత బాధ్యుణ్ణి నేను. అప్పటికే ‘ఉదయం’ మంచిపేరు తెచ్చుకుంది. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆఫీసుకి వెళ్లేవాణ్ణి. రేపు హైద్రాబాద్ నుంచి ఎబికె వస్తున్నారు త్వరగా రండి అని చెప్పారు.
1985 జులై 17
ఉదయం పదిగంటలకి ముందే ఆఫీసులో వున్నా. ఎబికె వున్నారు. మూర్తి గారి గదిలో ఆయన కుర్చీలో కూర్చుని ఎ.బి.కె రిపోర్టర్లు, మరి కొందర్ని పలకరిస్తున్నారు. వెళ్లి ఎడిటర్ని పలకరించి, కొద్దిసేపు మాట్లాడానో లేదో, పక్కనున్న ఫోన్ రింగవుతోంది. రిసీవర్ తీసాను. చీరాల నుంచి ఫోన్. కారంచేడు దారుణం గురించి చెబుతున్నపుడు రిపోర్టర్ గొంతు వణుకుతోంది. మొత్తం సమాచారం, ఫోటోలు పట్టుకుని విజయవాడ రా, ఎప్పటికప్పుడు ప్రతి విషయం తెల్సుకోడానికి యింకో ఇద్దరు కుర్ర రిపోర్టర్లని పిలిపించు..అలాంటి జాగ్రత్తలు చెప్పాను. ఏంటి అంతసేపు మాట్లాడుతున్నావ్ ? అన్నారు ఎ.బి.కె… మూర్తిగారు అక్కడే వున్నారు. కారంచేడులో దళితుల్ని ఘోరంగా చంపారు అని చెప్పారు. ఎవరు? అని అడిగారు ఎ.బి.కె. మన కమ్మవారే అని చెప్పా. “వాళ్లే చంపారా, సరే వచ్చిన వార్తలు నాకు పంపు. నువ్వెళ్లి పని చూసుకో. నేను ఎడిటోరియల్ రాస్తా ” అన్నారు. ఆయన షార్ప్ రియాక్షన్ కి ఆశ్చర్యపోయాను. అప్పటికే అయిదేళ్లు ఈనాడులో పని చేసివుండటంవల్ల, అలాంటి వార్తలు ఎలా హాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు.
యువరక్తం ఉరకలెత్తే జర్నలిస్టుల టీం ఉదయాన్ని అప్పటికే నిలబెట్టింది. ఇప్పటి సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, కవి ఖాదర్ మెహియిద్దీన్, మెరుగుమాల నాంచారయ్య ఏ ఐటం అయినా బాగా రాయగల దిట్టలు. అప్పుడే కెరీర్ మొదలుపెట్టిన చిన్నపాటి సబ్ ఎడిటర్లు వాళ్ళు. మూర్తి గారికి చెప్పి రంగంలోకి దిగాను. మేం బేనర్ అనే ప్రధాన వార్త కాకుండా, సంఘటనలో విషాదాన్ని human storyగా రాస్తాము. ఆ వివరాలన్నీ కె.శ్రీనివాస్కు యిచ్చాను. విజయవాడ రిపోర్టర్లు కొల్లు అంకబాబు, ఇతరులు పోలీసులు, రాజకీయ నాయకులతో మాట్లాడి సమాచారం యిస్తున్నారు.
కారంచేడులో హత్యాకాండ, అయిదుగురు దళితుల నరికివేత లాంటి హెడ్డింగ్తో ప్రధాన వార్త యిచ్చాం. తర్వాత రోజుల్లో మరో ఇద్దరు చీరాల ఆస్పత్రిలో చనిపోయారు. నాటి మానవ విషాదాన్ని కె.శ్రీనివాస్ ప్రతిభావంతంగా రాసి, దానికి ” పంట పొలాల్లో పులి చంపిన లేడి నెత్తురు ” అని హెడ్డింగ్ పెట్టారు. సాయంత్రానికల్లా ఎ.బి.కె ఎడిటోరియల్ కారంచేడు కండకావరం అనే శీర్షికతో సిద్ధం చేశారు. అదే హెడ్డింగ్తో వరసగా మూడు రోజులు కారంచేడు మీదే ఆయన సంపాదకీయాలతో దాడి చేశారు.
మర్నాడు ప్రకాశం జిల్లాతో పాటు కోస్తా జిల్లాల్లో ‘ఉదయం’ మర ఫిరంగిలా పేలింది. కమ్మవారే హంతకులని రాయడానికి చేతులు రాని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరో పేజీలోనో ఏడో పేజీలోనో అతి చిన్నవార్త వేసి ‘కారంచేడులో దాడి ‘ అనేదో పిచ్చి హెడ్డింగ్ పెట్టి యిచ్చాయి. దాంతో ప్రత్యేకించి ఉదయంలోనే FLASH అయిన వార్త సంచలనంగా మారింది. నాటి నుంచి రెండు నెలలకిపైగా కారంచేడు వార్తలు, ఫోటోలు, కేసు వివరాలు, దళిత నాయకుల ఇంటర్వ్యూలతో ఉదయాన్ని హోరెత్తించాము. దాసరి నారాయణ రావు ఇచ్చిన స్వేచ్ఛకి నమస్కరించి ఎ.బి.కె ప్రసాద్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఒక ఉద్వేగంతో పనిచేశాం. ఒక చారిత్రక విషాదానికి సాక్షులుగా నిలిచాం.
కత్తిపద్మారావు నాయకత్వాన దళిత మహాసభ ఆగ్రహప్రదర్శనలతో రంగంలోకి దిగింది. పీపుల్స్వార్ నక్సలైట్లు బుల్లెట్లలాంటి యువకుల్ని ప్రకాశం జిల్లాలోకి పంపించారు. చెంచురామయ్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి అయినందువల్ల, ఎన్టీఆర్తో బంధుత్వం వుండటం వల్ల పోలీసులు గడగడలాడుతూ పనిచేశారు. దళితులు బాధితులు. కమ్మవాళ్లు నిందితులు. ఇరుక్కున్నది పోలీసులు ! సాక్షాత్తూ ఎన్టీరామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుండగా, ఆయన బంధువుల్ని అరెస్టు చేయాల్సిన సంకటంతోనే పోలీసులు ఖాకీ నాటకాన్ని రక్తికట్టించారు. లక్కీగా ఆ సమయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్గా జయప్రకాష్నారాయణ్ (లోక్సత్తా ) వుండటం అటు దళితులకీ, యిటు కమ్మవారికీ మేలు జరిగింది.
కారంచేడులో నెత్తుటి సూర్యోదయం
జులై 16 రాత్రి కారంచేడు . మాల మాదిగలు ప్రశాంతంగానే నిద్రపోయారు. దాడికి ఆరేడు గ్రామాల బంధుమిత్రుల్నీ, మారణాయుధాల్నీ కూడగట్టడంలో కమ్మపెద్దలు రాత్రంతా రెప్పవాల్చకుండ పనిచేశారు. తెల్లారింది. 7 గంటలు దాటింది. నెత్తుటి ఘడియలు సమీపించాయి. డజన్లు,వందలు కాదు. మూడు వేల మంది అరుపులూ,కేకలూ, బూతుల్తో దాడికి తెగబడ్డారు. చేతుల్లో బరిసెలు, కత్తులు, గునపాలు, గండ్ర గొడ్డళ్లు, పెద్ద కర్రలు… గుంపులు మాదిగపల్లెపై విరుచుకుపడ్డాయి. షాక్తో, భయంతో దళితులు ఇళ్లలోంచి బైటపడి పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళవెంటే ఆడవాళ్లు పిల్లలూ..ఎందర్ని అని తప్పించుకోగలరు ! వందలు, వేలమంది తరిమికొడుతున్నారు. బరిసెల్తో పొడుస్తున్నారు. ఆడవాళ్ల చీరలు లాగేస్తున్నారు. మాలమాదిగలంతా అలవాటైన పొలాల్లోకి పరిగెత్తారు. నీళ్లలో బురద బురదగా వున్న చేలల్లో నిస్సహాయంగా నిలబడిపోయారు. దాడిచేస్తున్నవాళ్లకి దొరికిపోయారు. పదునైన బరిసెలు దింపి, పేగులు బైటికి వచ్చేలా తిప్పారు. కత్తులతో నరికారు. గండ్రగొడ్డళ్ళతో వేట్లు వేశారు. నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బురదనీళ్ళలో తేలుతున్న నెత్తురు మధ్య శవాలు! కొందర్ని బురదలోనే తొక్కేశారు. దారుణమైన దెబ్బలు తగిలి,గాయపడిన వాళ్లెందరో లెక్కలేదు.
కర్రసాములోచేయి తిరిగిన మాదిగ వీరుడు తేళ్ళ యెహోషువ చేయెత్తు మనిషి. బరిసెపోట్లకు కూలిపోయిన యెహోషువని చీరాల ఆస్పత్రికి పంపగలిగారు. ఆ సాహసి ఆస్పత్రిలో చాలాసేపు దారుణం గురించి కత్తి పద్మారావుతో మాట్లాడి చనిపోయారు. నాటి దుర్మార్గానికి ఆరుగురు బలైపోయారు.
1. దుడ్డు వందనం (35 )
2. దుడ్డు రమేష్ ( 22)
3. తేళ్ళ యెహోషువ (55)
4. తేళ్ళ మోషే ( 70 )
5. తేళ్ళ ముత్తయ్య ( 45 )
6. దుడ్డు అ్రబహాం ( 41 )
చాలా మంది ఆడవాళ్ల చీరలు, జాకెట్లు చించేశారు. ఇద్దరు మహిళల్ని మానభంగం చేశారు. పొత్తి కడుపుల్ని బరిసెలతో చీల్చారు.
జూలై 31న ఆంధ్రప్రదేశ్ బంద్కి కాంగ్రెస్-ఐ పిలుపు యిచ్చింది. వామపక్షాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష కమిటీ కలిసి బంద్ని జయప్రదం చేశాయి.
దగ్గుబాటి చెంచు రామయ్య ని అరెస్ట్ చెయ్యాలని కమ్మునిస్ట్ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు డిమాండ్ చేశారు.
కత్తిపద్మారావు గొంతెత్తితే…
స్మశాన నిశ్శబ్దం లాంటి చీకటి
కారంచేడును కమ్ముకుంది.
యుద్ధరంగం చీరాలకు మారింది.
దళితులు తిరుగుబాటుకి సన్నద్ధం అవుతున్నారు.
కమేండర్ ఇన్ చీఫ్ కత్తి పద్మారావు కదం తొక్కుతున్నాడు. మరుగుతోన్న బాధితుల రక్తం.. “..దళితపులులమ్మా…” అంటూ ఉద్యమగీతంగా మారుతోంది.
చీరాల రుధిరక్షేత్రం శత్రువుగుండెల్లో నిద్రపోతానని ప్రతిజ్ఞ చేస్తోంది.
ప్రకాశం జిల్లానిని ఒక అనుమానం వెన్నాడింది.
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న దళితులు దెబ్బకు దెబ్బ తీస్తారా? కారంచేడు భూస్వాముల గుండెల్లో వణుకు.
హత్యకేసు నడుస్తున్నందువల్ల దళిత సాక్షుల్ని భూస్వాములు లేపేస్తారా? బాధితుల కళ్ళలో బెరుకు. రంగంలో చురుగ్గా వున్న పీపుల్స్వార్ ఎప్పుడేం చేస్తుందో ? ఎక్కడ ఏం పేలిపోతుందో పోలీసుల టెన్షన్.
భూస్వాముల భయం
పుకార్లు, అనుమానాలు, వదంతులు, భయాందోళనలు, చీరాల సముద్ర కెరటాల్లా ఎగిరిపడుతున్నాయి. భీషణ ప్రతిజ్ఞలు, పత్రికా ప్రకటనలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, మరో పక్క ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, కారంచేడు దుర్మార్గం వార్తల ప్రవాహంగా మారుతోంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఏ మూల ఏం జరుగుతుందో.. ‘ఉదయం’ ప్రతిరోజూ పొద్దున్నే ఫోటోలతో సహా..బాధితులు చదివేది, భూస్వాములు కొనేదీ ఉదయమే. కత్తి పద్మారావు నుంచి సామాన్య దళిత కార్యకర్త దాకా ఉదయం పట్టుకు తిరిగేవాళ్ళే. పోలీసులు,లాయర్లు, ఇతర పేపర్ల జర్నలిస్టులు, కారంచేడు పరిణామాల కోసం ‘ఉదయం’ చదివేవాళ్ళు ! ఉదయం ఒక ఉద్యమ పత్రికగా మారిపోయింది.
కత్తి పద్మారావు రెచ్చగొట్టే ప్రసంగాలతో
కమ్మ భూస్వాముల ప్రతి వ్యూహాలతో
అందరికీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది
ప్రత్యక్ష సాక్షి హత్య
హత్యాకాండ జరిగి నెలరోజులు దాటుతోంది. ఆగస్ట్ 15-చీరాలలో నిరసన దినం పాటిస్తున్నారు. విప్లవ కార్యకర్త ఉషాఎస్డానీ చీరాల సభలో మాట్లాడారు. ఆ సభా వేదిక మీద దుడ్డు అలీశమ్మ వున్నారు. దాడిలో మరణించిన దుడ్డు రమేష్ తల్లి అని నాకు గుర్తు. జూలై 17న నెత్తుటి బరిసెల్ని చూసి చలించిపోయిన తల్లి ఆమె. నాటి రాక్షస దాడికి ప్రత్యక్ష సాక్షి. ఆమె కన్నీటి కథనం హృదయం లేని కోర్టుని కూడా కదిలించే శక్తి గలది. దీన్ని పసిగట్టిన భూస్వాములకు కంటిమీద కునుకు లేదు. ఆగస్ట్ 20-25 తేదీల మధ్య భూస్వాముల కిరాయి గూండాలు, చీరాలలోనే అలీశమ్మని కత్తులతో పొడిచి చంపారు! మనుషుల్ని చంపితే సరిపోదు. సాక్ష్యాన్ని కూడా హతమార్చాల్సిందే!
చీరాల భగ్గుమంది. దళితులు దిగ్గున లేచారు.
మనవాడు అధికారంలో వుంటే మనం ఎన్ని హత్యలయినా చేసుకోవచ్చు అనేది వాళ్ళ ధీమా ! నిజానికి ఎన్టీరామారావు ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ప్రతీకారదాడులు జరుగుతాయని భూస్వాములు కంపించి పోయారు. తక్షణం చేయాల్సిన పని ఫైర్బ్రాండ్ కత్తి పద్మారావు గొంతు నొక్కాలి. పద్మరావునీ చంపేస్తారన్న వదంతులతో చీరాల, పొన్నూరు గడగడలాడిపోయాయి. చిటికెలో అదృశ్యం అయిపోయిన పద్మారావు సురక్షితమై యింట్లో కొన్నాళ్ళు గడపాల్సి వచ్చింది. ఉద్యమంగా మారిన దళితవీరుల ఆవేశం కట్టలు తెంచుకు ప్రవహిస్తోంది. బొజ్జా తారకం, శివసాగర్ రంగం లోకి దిగారు.
ఉగాది పండగరోజునే….
1985 జులైలో ఘోరం జరిగితే 1987 దాకా బంద్లూ, ధర్నాలూ, సభలూ, ఉపాన్యాసాలూ తప్ప, బాధ, అశాంతి, వేదన తప్ప దళితులకు ఏఊరటా లేదు. భూములూ, ఉద్యోగాలూ, డబ్బూ ఇస్తానంటోంది ప్రభుత్వం. యిచ్చింది కూడా. జరిగిన అవమానం, పేరుకుపోయిన కక్ష, నిస్సహాయత వాళ్లని కుంగదీస్తున్నాయి. పీపుల్స్వార్ యాక్షన్ టీం రంగంలోకి దిగింది. అప్పటికే కారంచేడులో రెక్కీ ముగిసింది.
1987 ఏప్రిల్ 6వ తేదీ, ఉగాది పండగ.
ఆ రోజు సాయంత్రం చీకటిపడ్డాక, అయిదుగురు సభ్యుల యాక్షన్ టీం కారంచేడులో అడుగుపెట్టింది. ఏడుగంటలు దాటాక, దగ్గుబాటి చెంచురామయ్య ఇంటికి చేరుకుంది. పసుపు రాసిన గుమ్మాలు మామిడి తోరణాలతో రమ్మంటున్నాయి. పిలిస్తే ఆయన పలికాడు. ఏదో ముఖ్య విషయం మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. చెంచురామయ్య కూర్చున్నారు. వీళ్లు కొద్దిసేపు మాట్లాడారోలేదో ఆయనకి అనుమానం వచ్చింది. చటుక్కున లేచి లోపలి గదిలోకెళ్ళి తలుపు గడియపెట్టుకున్నారు. అయిదుగురూ లోపలికెళ్ళారు. ఇద్దరు ఇంటి వెనక్కి వెళ్ళారు. వెనుక తలుపు గడియపెట్టిలేదు. తక్షణం లోనికి చొరబడి చెంచురామయ్యను కత్తులతో నరికేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక,బైటికి వచ్చి తాపీగా నడుచుకుంటూ వెళ్ళి చీకటిలో కలిసిపోయారు. మరికొంతసేపట్లో హత్య విషయం తెలిసినా అప్పటికే యాక్షన్ టీం అదృశ్యం అయిపోయింది. పీపుల్స్వార్ దళ సభ్యులు 1. జె. లక్ష్మణరావు 2. కె. విజయకుమార్ ( కమ్మ) 3. ఏసు 4. ముత్యాల రామకృష్ణ, 5. ఇదపని శివశంకర్
“నా తండ్రి హత్యాకాండకు బాధ్యుడు కాదు. అయినా పీపుల్స్వార్ ఆయన్ని హతమార్చింది. నేనువాళ్ళని మన్నిస్తున్నాను. విద్యావంతుడైన విజయకుమార్ని విడుదల చేయాలని కోరుతున్నాను ” అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పత్రికా ప్రకటన చేశారు. లక్ష్మణరావు ఎప్పటికీ దొరకలేదు. ఏసుని పోలీసులు ఒక ఎన్కౌంటర్లో చంపేశారు. చాలా ఏళ్ల విచారణ తర్వాత మిగిలిన ముగ్గుర్నీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.
– తాడి ప్రకాష్