అప్పు చెల్లించలేదని కర్కశం
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో దారుణం
నకరికల్లు : అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడో దుర్మార్గుడు. భూమి తనఖా పెట్టి అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. హృదయ విదారకమైన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా శివాపురం తండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నకరికల్లు శివారు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్య్రానాయక్, మంత్రుభాయి (55) దంపతులు అటవీ భూములను సాగు చేసుకుంటూ వాటిపై హక్కులు సాధించారు రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. సాగుతో పాటు కుటుంబ అవసరాల కోసం ఇదే మండలంలోని నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద పొలం తాకట్టు పెట్టి రెండేళ్ల కిందట రూ.3.80 లక్షల అప్పు తీసుకున్నారు. వడ్డీతో సహా తన అప్పు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాదం కొనసాగుతోంది. బకాయి తీర్చకుంటే తనఖా పెట్టిన భూమిని స్వాధీనం చేసుకుంటానని అతడు బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొలానికి వెళ్లేందుకు మంత్య్రానాయక్, మంత్రుభాయిలు సిద్ధమవుతున్నారనే సమాచారం తెలుసుకుని ట్రాక్టర్తో శ్రీనివాసరెడ్డి గ్రామానికి వచ్చాడు. అప్పు చెల్లించకుండా పొలంలో కాలు పెడితే ఊరుకోబోనని దుర్భాషలాడాడు. పొలం సాగు చేసుకుని చిన్నగా అప్పు చెల్లిస్తామని దంపతులు వేడుకున్నారు. వాగ్వాదం పెరిగిన క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్తో మంత్రుభాయిను తొక్కించుకుంటూ వెళ్లాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. వెంటనే ట్రాక్టర్తో సహా శ్రీనివాసరెడ్డి పరారయ్యాడు.
Courtesy Eenadu