హైదరాబాద్ : ప్రతిష్టాతకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019 ఫలితాల్లో సిద్దిపేట వాసి ఆలిండియా ర్యాంకు సాధించాడు. పట్టణానికి చెందిన మంద మకరంద్ ఆలిండియా లెవల్లో 110వ ర్యాంకు దక్కించుకుని ఐఏఎస్కు అర్హత పొందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట అతడి స్వస్థలం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదల తోనే తాను సివిల్స్కు ఎంపికయ్యానని మకరంద్ పేర్కొన్నారు.
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. పూర్తి ఫలితాల కోసం తమ వెబ్సైట్ చూడాలని యూపీఎస్సీ సూచించింది. 829 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది అభ్యర్థులు ఉన్నారు. 11 మంది లభ్యర్థుల ఫలితాలను విత్హెల్డ్లో ఉంచారు. తొలిసారిగా ఈబీసీ కోటాను అమలు చేశారు. 2019 సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలు, 2020 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
హర్యానాలోని సోనిపట్ జిల్లాకు చెందిన ప్రదీప్ సింగ్ మొదటి స్థానంలో నిలిచారు. జతిన్ కిషోర్(రెండు), ప్రతిభా వర్మ(మూడు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మహిళల విభాగంలో ప్రతిభా వర్మ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది మే 31న జరగాల్సిన సివిల్స్ పరీక్షలు కరోనా సంక్షోభం కారణంగా అక్టోబర్కు వాయిదా పడ్డాయి.
టాప్లో నిలిచిన ప్రదీప్ సింగ్.. హర్యానాలోని ఫరీదాబాద్లో ఇండియన్ రెవన్యూ సర్వీస్ ఆఫీసర్గా శిక్షణ పొందుతున్నాడు. సోనిపాట్ జిల్లాలోని తేవ్రీ గ్రామానికి ప్రదీప్ తండ్రి సుఖ్బీర్ సింగ్ సర్పంచ్గా ఉన్నారు. తన తండ్రి పోత్సాహంతోనే ఐఏఎస్ సాధించానని ప్రదీప్ సింగ్ చెప్పారు. తన తండ్రి రైతు అని, కర్షకుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రదీప్ ఇప్పటివరకు నాలుగు సార్లు సివిల్స్ పరీక్షలు రాయగా.. గత ఏడాది అతడికి 260వ ర్యాంక్ వచ్చింది.
తంగడపల్లి యువకుడికి 218వ ర్యాంక్
సివిల్స్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామ వాసి సత్తా చాటాడు. గ్రామానికి చెందిన బడేటి సత్య ప్రకాష్ గౌడ్ ఐఏఎస్ ఫలితాల్లో 218 ర్యాంక్ దక్కించుకున్నాడు.
తంగడపల్లికి చెందిన బడేటి అశోక్, వసంత దంపతుల కుమారుడైన సత్య ప్రకాష్ గౌడ్.. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. 7వ తరగతి వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫెన్స్ పాఠశాలలో.. ప్రైవేట్ పాఠశాలలో 8,9,10 తరగతులను హైదరాబాద్ లోని శ్రీ ఆదిత్య ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్ లో చదివాడు.
హైదరాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఐఐటీ పాట్నా నుంచి 2018లో బీటెక్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్ పరీక్షలకు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో సివిల్స్ రాసి మొదటి సారే 218 రాంక్ కైవసం చేసుకొని ఐపీఎస్ అధికారిగా ఎన్నిక కానున్నాడు. ఐపీఎస్ కావాలన్నది తన లక్క్ష్యమని వెల్లడించారు. ఐపీఎస్ సాధించి మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తానని చెప్పారు.
సంకీర్త్ కు 330వ ర్యాంక్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సిరిశెట్టి సంకీర్త్ సివిల్స్ 330 ర్యాంక్ దక్కించుకున్నాడు. సంకీర్త్ తండ్రి సింగరేణిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. తల్లి స్కూల్ నడుపుతున్నారు. ఆదిలాబాద్లో మిషన్ భగీరథలో అసిస్టెంట్ ఇంజినీర్గా సంకీర్త్ ప్రస్తుతం పనిచేస్తున్నాడు.
కానిస్టేబుల్ కుమారుడికి 516వ ర్యాంక్
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కుమారుడు డి. వినయ్కాంత్(29) సివిల్స్ ఫలితాల్లో 516వ ర్యాంక్ సాధించాడు. గతేడాది రాజ్యసభ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎంపికైన వినయ్ ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు.