- ఇతర మతాల్లోనూ మహిళలపై ఆంక్షలు
- దర్గాలు, మసీదుల్లోకి మహిళలు వెళ్లలేరు
- ఇతర మతస్థుడిని పెళ్లాడిన పార్సీ మహిళలు
- పవిత్ర అగ్ని ప్రదేశాన్ని చేరుకోలేరు
- స్త్రీలపై ఆంక్షలు శబరిమలకే పరిమితం కాదు
- మళ్లీ మళ్లీ తలెత్తే వివాదాలకు చెక్ పెట్టాలి
- విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదన
- శబరిమల బెంచ్లో భిన్నాభిప్రాయాలు
- సీజేఐ నేతృత్వంలో మెజారిటీ తీర్పు
- గత ఆదేశాలను సమర్థించిన ఇద్దరు జడ్జిలు
- పాత తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వివాదం ఎటూ తేలలేదు. ఏదో ఒక స్పష్టత ఇస్తుందని భావించిన సుప్రీంకోర్టు… విషయాన్ని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకోగా… ఇద్దరు మాత్రం వయో పరిమితితో సంబంధం లేకుండా మహిళలందరికీ శబరిమల ప్రవేశం ఉండాలన్న గత తీర్పును సమర్థించారు. మొత్తంగా… మెజారిటీ నిర్ణయం ప్రకారం ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లన్నింటిని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. అంతేకాదు… ‘మహిళా ప్రవేశ’ వివాదం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ముస్లిం, పార్సీ మహిళలూ ఇలాంటి వివక్ష ఎదుర్కొంటున్నారని గుర్తు చేసింది. వెరసి… శబరిమల వివాదం ఇప్పుడు మతాలకు అతీతంగా మహిళలు-ప్రార్థనా మందిర ప్రవేశ ‘హక్కు’ను తేల్చాల్సిన కేసుగా మారిపోయింది. అలాగే… మహిళలందరికీ శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మరో రెండు రోజుల్లో (ఆదివారం) శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్న నేపథ్యంలో… సుప్రీంకోర్టు నిర్ణయానికి కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
మెజారిటీ తీర్పు ఇది…
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రా తరఫున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ 9 పేజీల్లో మెజారిటీ తీర్పు లిఖించారు. మొత్తం పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి నివేదించడానికి కారణాలను వివరించారు. ‘‘నచ్చిన మతాన్ని ఆచరించడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఈ వివాదం శబరిమలకే పరిమితం కాదు. దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. మరో వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లాడిన పార్సీ మహిళ పవిత్ర అగ్ని ప్రదేశంలోకి ప్రవేశించలేదు. ఈ నేపథ్యంలో మొత్తం మహిళలందరికీ ఒక సమగ్రమైన, సంపూర్ణమైన న్యాయం జరగాల్సి ఉంది. విస్తృత ధర్మాసనం ఇలాంటి వివాదాలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా నిర్ణయం వెలువరిస్తుంది’’ అని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మహిళలందరికీ ఆలయ ప్రవేశం కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.
మైనారిటీ తీర్పు ఇలా…
శబరిమల వివాదాన్ని తేల్చాల్సిన బాధ్యత తమ ధర్మాసనంపైనే ఉందని మైనారిటీ తీర్పులో న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తనతోపాటు జస్టిస్ చంద్రచూడ్ తరఫున జస్టిస్ నారీమన్ ఈ తీర్పు రాశారు. సీజేఐ అభిప్రాయంతో అంగీకరించలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తూ… శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని తెలిపారు. గత తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టి వేశారు. ఇప్పటికే అమలులో ఉన్న ఆదేశాలను పకడ్బందీగా అమలు చేసేలా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గత తీర్పును సమీక్షించాలని కొన్ని, కొత్తగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తు చేశారు. వీటిపై ఇప్పుడున్న ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ‘‘భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పడే విస్తృత ధర్మాసనం ఇప్పటి పిటిషన్లను పరిగణనలోకి స్వీకరించవచ్చు, లేదా పక్కన పెట్టేయవచ్చు. ఇప్పుడు ఇచ్చిన తీర్పుపై దాఖలయ్యే సమీక్ష పిటిషన్లు, తీర్పు ప్రభావంపై తలెత్తే అంశాలను మాత్రం విస్తృత ధర్మాసనానికి నివేదించవచ్చు. సుప్రీం నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే.’’ అని తెలిపారు.
ఇవీ పిటిషన్లు…
శబరిమల ఆలయంలోకి మహిళలందరినీ అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న వెలువడిన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మొత్తం 65 పిటిషన్లు పడ్డాయి. ఇందులో 56 రివ్యూ పిటిషన్లు. మరో నాలుగు రిట్ పిటిషన్లు, ఐదు ట్రాన్స్ఫర్ పిటిషన్లు ఉన్నాయి. అప్పట్లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం 10 – 50 ఏళ్ల మధ్య వయసు మహిళలు కూడా శబరిమల వెళ్లేందుకు అనుమతించింది. దీనిపై 4:1 మెజారిటీ తీర్పు వెలువడింది.
విస్తృత ధర్మాసనం ఏం తేల్చాలంటే?
విస్తృత ధర్మాసనం ముందు జస్టిస్ గొగోయ్ ఏడు అంశాలను ఉంచారు. అవేమిటంటే…
1) మత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలోని 25, 26 అధికరణల పరిమితి, పరస్పర ప్రభావం.
2) ‘రాజ్యాంగ నైతికత’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడం.
3) మతపరమైన ఆచారాల్లో కోర్టులో జోక్యం చేసుకోగలిగిన పరిధి?
4) ఆర్టికల్ 25లో పేర్కొన్న ‘సెక్షన్స్ ఆఫ్ హిందూస్’ అనే పదాలపై స్పష్టత ఇవ్వడం.
5) ఏవైనా కొన్ని మతాచారాలు, లేదా వర్గాలకు ఆర్టికల్ 26 ప్రత్యేక రక్షణ కల్పిస్తోందా?
6) మతాచారాలపై దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను న్యాయస్థానం ఏ మేరకు పరిగణనలోకి తీసుకోవాలి?
7) అందులోనూ, సంబంధిత మతాన్ని పాటించని వ్యక్తులు వేసే దావాలను ఏమేరకు స్వీకరించాలి?
శబరిమల పవిత్రతను కాపాడాలని చిలుకూరు ఆలయంలో అనేక మార్లు పూజలు, ప్రదక్షిణలు చేసిన ఫలితంగానే నేడు సుప్రీం తీర్పుపై పునఃసమీక్షకు ధర్మాసనం నిర్ణయం ప్రకటించిదని అర్చకులు రంగరాజన్ హర్షం తెలిపారు. శబరిమలకు మహిళల ప్రవేశాన్ని నిలిపి అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచర్యం కొనసాగేట్లు పునఃసమీక్షలో సుప్రీం ధర్మాసనం చేయాలని కోరారు.
Courtesy andhrajyothy..