ఢిల్లీ హింసాకాండపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విచారణలో వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని, ఇందులో సాక్ష్యాత్తూ పోలీసు అధికారులకు భాగస్వామ్యం ఉండడం ఆందోళన కలిగించే అంశమని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత విభాగం పేర్కొంది. ఈ ఏడాది పిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పోలీసులు అరాచక శక్తులకు సహకరించడంతో పాటు పాలుపంచుకున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోలీసులు పాల్పడుతున్న ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలపై కేంద్రం ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని సూచించింది. ఢిల్లీ అల్లర్ల సమయంలో 53 మంది మఅతిచెందగా, అధిక శాతం మంది ముస్లిములే కావడం గమనార్హం. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఈ హింసాకాండలో అనేక మంది ముస్లిములకు చెందిన ఆస్తులు, ఇళ్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయిన విషయం తెలిసిందే.
హింసాకాండ జరిగి దాదాపు ఆర్నెల్లకు పైగా గడిచినా.. ఢిల్లీ పోలీసులు పాల్పడిన మానవ హక్కుల ఉల్లంఘనపై ఇప్పటి వరకూ విచారణ జరగలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ ఇండియా తన ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించి తాము అల్లర్ల భారి నుంచి తప్పించుకున్న వారితో పాటు ప్రత్యక్ష సాక్ష్యులు, మానవ హక్కుల కార్యకర్తలు, రిటైర్డు పోలీసు అధికారులతో తాము మాట్లాడామని పేర్కొంది హింసాకాండకు సంబంధించి పోలీసుల ప్రమేయం ఉన్నట్లు కనిపించే కొన్ని వీడియోలను వారు తమకు చూపించారని, ఈ విధమైన పోలీసు అధికారుల వ్యవహారశైలి సమాజ శ్రేయస్సుకు ఆందోళనకరమని పేర్కొంది.
ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారని, అయితే ఘర్షణలకు సంబంధించి పోలీసులను జవాబుదారీగా ఉంచేందుకు హోంశాఖ ఇప్పటివరకూ ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ అన్నారు. అదేవిధంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు సిఎఎకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు అధిక బలగాలను మోహరించి తీవ్ర అణచివేత వైఖరి ప్రదర్శించారని, ఆందోళనకారులను కస్టడీలో పలువిధాలుగా చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. కాగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విచారణపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటివరకూ స్పందించలేదు.
Courtesy Prajashakti